యువతిపై రేప్, వీడియో తీసి బెదిరింపులు: నిందితుల అరెస్ట్
కృష్ణా: జిల్లాలోని ఆగిరిపల్లి మండలం పోతవరప్పాడులోని ఎన్ఆర్ఐ ఇంజినీరింగ్ కళాశాలలో ఓ విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడిన కేసులో పోలీసులు పురోగతి సాధించారు. అత్యాచారానికి పాల్పడిన నిందితులు కృష్ణవంశీ, శివారెడ్డి, దొడ్ల ప్రవీణ్ను పోలీసులు శనివారం అదుపులోకి తీసుకున్నారు.
దారుణం: బర్త్ డే అని పిలిచి.. రేప్ చేసి, వీడియో తీశారు, రూ.10లక్షలు ఇవ్వాలంటూ..
కాగా, నిందితుల్లో శివారెడ్డి, కృష్ణ వంశీ సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా పనిచేస్తున్నారు. మరో నిందితుడు ప్రవీణ్ ఎంబీఏ పూర్తిచేసి ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. 2017 బర్త్ డే అని పిలిచిన నిందితులు బాధిత యువతిపై అత్యాచారం చేసి ఆ వీడియోను వాట్సప్లో షేర్ చేశారు.
అంతేగాక, బాధితురాలిని కోరిక తీర్చాలంటూ, రూ.10లక్షలు ఇవ్వాలంటూ తాజాగా బెదిరింపులకు దిగారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
ఆత్మహత్య చేసుకోవద్దు: అండగా ఉంటాం: నన్నపనేని
అత్యాచార బాధితులు మానసికంగా కుంగిపోయి ఆత్మహత్యలు లాంటివి చేసుకోవద్దని ఏపీ మహిళా కమిషన్ ఛైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం, చట్టాలు వారికి అండగా ఉంటాయని భరోసా ఇచ్చారు. విజయవాడలోని ఎన్టీఆర్ ప్రభుత్వ ఆస్పత్రిలో కృష్ణా జిల్లాలోని ఆగిరిపల్లి అత్యాచార బాధితురాలిని ఆమె పరామర్శించారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. బాధితురాలు మానసికంగా కుంగిపోతోందని, ఆమెకు ధైర్యం చెప్పానని వెల్లడించారు. ముఖ్యమంత్రి వద్దకు ఆమెను స్వయంగా తీసుకెళ్తానని, ఎంటెక్ వరకు ఆమెను ప్రభుత్వం చదివిస్తుందని హామీ ఇచ్చారు. ఇలాంటి అఘాయిత్యాలు జరిగినప్పుడు పరువు పోతుందని వెనకడుగు వేయకుండా వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఆమె సూచించారు. అత్యాచారానికి పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని అన్నారు.