హార్దిక్ పటేల్ స్ఫూర్తిగా..: బాబు-కెసిఆర్లకు కొత్తగా 'అగ్ర' చిక్కులు
హైదరాబాద్/విజయవాడ: గుజరాత్లో పటేల్ ఉద్యమం నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం ఆ కులంలోని వెనుకబడిన వారికి పది శాతం కోటా ఇచ్చేందుకు నిర్ణయించింది పటీదార్ ఆందోళనను ఆదర్శంగా తీసుకొని తెలుగు రాష్ట్రాల్లోను అగ్రవర్ణాలు రిజర్వేషన్ కోసం ఉద్యమించేందుకు సిద్ధమవుతున్నాయి.
తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో బ్రాహ్మణ, వైశ్య, రెడ్డి, కమ్మ, క్షత్రియ, వెలమ కులాలన్నీ ఒకే వేదిక పైకి వచ్చి.. తమ కులాల్లోని వెనుకబడిన వారికి కోటా ఇవ్వాలని డిమాండ్ చేసేందుకు సన్నద్ధమవుతున్నాయి. ప్రధానంగా ఈ ఉద్యమం ప్రస్తుతం ఏపీకి పరిమితం కానుంది.
ఇప్పటికే కాపు రిజర్వేషన్ పేరుతో ముద్రగడ పద్మనాభం ఉద్యమించారు. ప్రభుత్వం వెనుకబడిన కాపులకు రిజర్వేషన్ కల్పించేందుకు అడుగులు వేస్తోంది. ఇప్పుడు, 20 శాతం రిజర్వేషన్ల డిమాండుతో బ్రాహ్మణ, వైశ్య, రెడ్డి, కమ్మ, క్షత్రియ, వెలమ కులాలన్నీ ఒకే వేదికపైకి రానున్నాయి.
ఉద్యమ స్వరూప స్వభావం, కార్యాచరణ ఖరారు కోసం, ఆయా కుల సంఘాల ప్రతినిధులు ఈ నెల 19వ తేదీన శ్రీశైలంలోని అఖిల భారత రెడ్డి సంఘాల సమాఖ్య కల్యాణ మండపంలో భేటీ కానున్నాయి. దీనితో నవ్యాంధ్రలో గుజరాత్ మాదిరిగా కొత్తగా అగ్రకుల పోరాటానికి తెరలేవనుంది.
ఇప్పటికే గుజరాత్లో పటేళ్లు తమను ఓబీసీల్లో చేర్చాలని ఉద్యమిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటిదాకా బీసీ, కాపు ఉద్యమాలతో హోరెత్తుతున్న నవ్యాంధ్రలో ఇక అగ్రకుల ఉద్యమం కూడా చేరనుంది. తమ కుల్లాలోని నిరుపేదలకు విద్య, ఉద్యోగ, ఉపాధిరంగాల్లో తప్పనిసరిగా 20 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న డిమాండుతో అగ్ర కులాలన్నీ ఓకే వేదికపై రానున్నాయి.
దీనికోసం ఆయా కులాల్లోని ప్రముఖులంతా తొలిసారిగా ఒకే తాటిపైకి రానుండటం గమనార్హం. అగ్ర కులాలన్నింటికీ ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలని, అది సాధ్యం కాకపోతే అగ్ర వర్ణాలన్నింటికీ కలిపి ఒకే కార్పొరేషన్ ఏర్పాటు చేయాలన్న డిమాండ్ను ముందుకు తేనున్నాయి.
ఇప్పటికే బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేశారని, అయితే దానికి ఇచ్చిన రూ.67 కోట్లు సరిపోవని, ఇంకా పెంచాలని, అదేవిధంగా అన్ని కులాలకు బ్రాహ్మణ కార్పొరేషన్ మాదిరిగానే ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలని కోరనున్నారు.
వచ్చె నెలలో కోస్తాలో మహాగర్జన సభ జరగనుందని చెబుతున్నారు. ఆ తర్వాత తెలంగాణలో కూడా సభలు నిర్వహించేందుకు సన్నద్దమవుతున్నారు. అగ్ర కులాల్లోనే అధిక శాతం నిరుపేదలున్నారని, వారికి విద్య, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో ఇరవై శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేయనున్నారు.
అయితే, అగ్ర కులాల్లోని ఎమ్మెల్యేలు, ఎంపిలు, ఎమ్మెల్సీలతోపాటు వృత్తి నిపుణులు, వాణిజ్య వ్యాపార రంగాల్లో ఉన్న వారి పిల్లలకు ఈ రిజర్వేషన్లు ఇవ్వాల్సిన అవసరం లేదని, కేవలం పేదలెవరో గుర్తించి వారికి మాత్రమే 20 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పనున్నారు. ఈ నెల 19న కార్యాచరణ ఖరారు చేయనున్నారని అంటున్నారు.
తమ ఉద్యమం ఇతర కులాలకు వ్యతిరేకం కాదని, వారికి రిజర్వేషన్లు ఉండాలని, అలాగే తమ కులాల్లోని నిరు పేదలకు రిజర్వేషన్లు ఉండాలని చెబుతున్నారు.
ఇప్పటి వరకూ బ్రాహ్మణ, కమ్మ, రెడ్డి, వైశ్య, వెలమ వర్గాల ముఖ్యమంత్రులు పనిచేసినప్పటికీ, వారి వల్ల ఆయా కులాలకు వచ్చిన ప్రయోజనాలేమీ లేదంటున్నారు. వారు కూడా తమ పార్టీల ఉనికి కోసం ఇతర కులాలకే ప్రయోజనాలు చేకూర్చి, సొంత కులాలకు మేలు చేస్తే, ఎక్కడ ఇతర కులాల దృష్టిలో దోషిగా నిలబడతామన్న భయంతో అగ్ర కులాలను నిర్లక్ష్యం చేశారని అంటున్నారు.
తాజా లెక్కల ప్రకారం.. ఏపిలో బిసిలు 45 శాతం, కాపులు 10, ఎస్సీ 10, ఎస్టీ 5, మైనారిటీలు 9 శాతం, రెడ్డి 6, కమ్మ 5, వెలమ 2, వైశ్య 3, బ్రాహ్మణ 2, క్షత్రియ 3 శాతం ఉన్నారు. తెలంగాణలో బిసిలు 45, ఎస్సీ 15, ఎస్టీ 5, మైనారిటీ 12, బలిజ 4, కమ్మ 3, రెడ్డి 5, వెలమ 5, క్షత్రియ 2, వైశ్య 2, బ్రాహ్మణులు 2 శాతం ఉన్నారు.
కాగా, ఇప్పటికే కాపు ఉద్యమంతో ఏపీ సీఎం చంద్రబాబు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హామీ మేరకు కాపులకు రిజర్వేషన్ కోసం ప్రయత్నాలు చేస్తుంటే, బీసీ సంఘాలు హెచ్చరిస్తున్నాయి. దీంతో చంద్రబాబు వీటిని ఎలా ఎదుర్కొంటారనే చర్చ సాగుతోంది. అలాగే, అగ్ర కుల రిజర్వేషన్ ఉద్యమం తెలంగాణకు పాకితే.. కేసీర్ ఏం చేస్తారో చూడాలి.