కాపు గర్జన: మాస్క్లతో వచ్చి రత్నాచల్ దగ్ధం, పట్టిస్తున్న వీడియోలు!
విజయవాడ: కాపు గర్జన నేపథ్యంలో తునిలో విధ్వంసం, రత్నాచల్ ఎక్స్ప్రెస్ దగ్ధంపై విచారణ వేగవంతం అవుతోంది. మూడు రోజుల క్రితం కాపు గర్జన సమయంలో జరిగిన విధ్వంసంలో రైళ్లకు, పోలీసు స్టేషన్కు నిప్పు పెట్టిన వారిని గుర్తించే పనిలో పోలీసులు పడ్డారు.
రత్నాచల్ ఎక్స్ప్రెస్ దహనాన్ని పోలీసులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఇందుకు సంబంధించి వివిధ వీడియో చానళ్లు ప్రసారం చేసిన దృశ్యాల్లో ముఖానికి ముసుగులు ధరించిన దాదాపు 300 మందిని గుర్తించినట్టుగా తెలుస్తోంది.
వీరంతా ఎవరు? ముఖానికి మాస్క్లు ఎందుకు ధరించి వచ్చారనే విషయమై దర్యాఫ్తు చేస్తున్నారని తెలుస్తోంది. పెద్ద సంఖ్యలో కాపులంతా రైల్వే పట్టాలకు దూరంగా ఉన్నారని గుర్తించిన పోలీసులు... కొన్ని వందలమంది మాత్రమే పట్టాలు ఎక్కారని, వారిలో పలువురు మాస్క్లు ధరించారని తేల్చాలని తెలుస్తోంది.
రైల్వేశాఖ, ఆర్పీఎఫ్, జీఆర్పీ, పోలీసు శాఖలు నిందితులను గుర్తించేందుకు సంయుక్త విచారణ చేపట్టాయి. ఇక ఘటనాస్థలిలో క్లూస్ టీం ఆధారాలు సేకరించే పనిలో ఉంది. ఈ కేసుల్లో వీడియోలు, ఫోటోలు కీలకమని పోలీసులు భావిస్తున్నారు.
సభకు వచ్చి, ఆపై తమ సెల్ ఫోన్లలో ఇందుకు సంబంధించిన వీడియోలు, చిత్రాలను తీసిన వారు తమకు అందించాలని కాపు సామాజిక వర్గానికి పోలీసులు విజ్ఞప్తి చేశారు.
సభలో అసాంఘిక శక్తులు చొరబడ్డాయని, వారి కారణంగానే పెను విధ్వంసం జరిగి రూ.130 కోట్ల ఆస్తి నష్టం జరిగిందని పోలీసులు వెల్లడించారు. పక్కా వ్యూహంతోనే ఇదంతా జరిగిందని నిర్దారణకు వచ్చారు. కాగా, ఈ ఘటనపై రాజకీయ దుమారం చెలరేగుతున్న విషయం తెలిసిందే.