అగ్రిగోల్డ్ కేసు హైకోర్టులో విచారణ: 11కోట్లకు భవనం కొనుగోలు
హైదరాబాద్: అగ్రిగోల్డ్ కేసు హైకోర్టులో శుక్రవారం విచారణకు వచ్చింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణాలో ఉన్న అగ్రిగోల్డ్ ఆస్తుల వివరాలను మరోసారి రెండు ప్రభుత్వాలు కోర్టుకు సమర్పించాయి. విజయవాడలో ఉన్న అగ్రిగోల్డ్ భవనాన్ని విజయవాడ వాసి 11 కోట్ల 11 లక్షల 11 వందల 11 రూపాయలకు కొనుగోలు చేశారు.
10 రోజుల్లో 25 శాతం డబ్బులు చెల్లించాలని..మిగతాది 30 రోజుల్లో చెల్లించి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని హైకోర్టు ఆదేశించింది. అలాగే ఏపీలో ఆంధ్రా బ్యాంక్ ఉన్న ప్రాపర్టీని 8 కోట్ల 60 లక్షల రూపాయలకు అమ్మడానికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఆస్తులను కొనుగోలు చేసిన వారికి కేటాయించాలని రెండు ప్రభుత్వాలకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. హాయ్లాండ్లో ఉన్న ఆస్తుల విలువ రూ.1000 కోట్లు ఉంటుందని అగ్రిగోల్డ్ కంపెనీ హైకోర్టుకి తెలిపింది. ఇప్పటికే అగ్రిగోల్డ్ ఆస్తుల కొనుగోలుపై వెనక్కి తగ్గిన జీఎస్సెల్ గ్రూప్పై తర్వాత విచారణ చేస్తామని హైకోర్టు వెల్లడించింది. తదుపరి విచారణను అక్టోబర్ 11కు వాయిదా వేసింది.