అగ్రిగోల్డ్ బాధితుల పాదయాత్ర,దీక్ష...అర్ధాంతరంగా రద్దు:భిన్నాభిప్రాయాలు
గుంటూరు:అగ్రిగోల్డ్ బాధితులు డిపాజిట్ చేసిన సొమ్ములు నెల రోజుల్లోగా చెల్లించాలని అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బాధితులు బుధవారం గుంటూరు విజ్ఞాన మందిరంలో న్యాయపోరాట దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే.
అయితే రెండో రోజుకు చేరిన ఈ దీక్ష అర్ధాంతరంగా ముగిసింది. అంతే కాదు తమ ఆందోళనలో భాగంగా అగ్రి గోల్డ్ బాధితులు ఎపి సచివాలయం వరకు చేపట్టిన ఆత్మఘోష పాదయాత్ర కూడా రద్దు చేసినట్లు బాధిత సంఘాల నేతలు ప్రకటించారు. అయితే దీక్ష-పాదయాత్రల రద్దుపై పలువురు బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు ప్రభుత్వం నుంచి ఏ విధమైన స్పష్టమైన హామీ రాకుండానే అర్ధాంతరంగా ఇలా ఆందోళన విరమించడం ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు.
రద్దుపై...భిన్నాభిప్రాయాలు
అయితే ఇలా దీక్ష...పాదయాత్రలను అర్థాంతరంగా రద్దు చేసుకోవడంపై పలువురు బాధితులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆందోళనను విరమించుకోవడానికి ప్రభుత్వం ఇచ్చిన హామీ ఏంటో చెప్పాలని వారు నిలదీస్తున్నారు. తమకు న్యాయం కోసం చేసే పోరాటమని రాష్ట్రం నలుమూలల నుంచి ఇక్కడిదాకా వస్తే మాకు ఏం న్యాయం చేయకుండా...ఏం చేస్తారో చెప్పకుండా ఇలా చేశారని బాధితులు మండిపడ్డారు. మంత్రి నక్కా ఆనందబాబు ఏం హామీ ఇస్తే దీక్ష విరమింపచేశారో చెప్పాలని నేతలను బాధితులు ప్రశ్నించారు.
నేతలపై...బాధితుల మండిపాటు
మన దీక్షా శిబిరానికి ఓ మంత్రి వచ్చి హామి ఇవ్వటం గొప్పేకదా...న్యాయం చేస్తామన్నప్పుడు సమయం ఇవ్వాలి కదా అంటూ నేతలు మాట్లాడటంపై కొందరు బాధితులు ఆగ్రహంతో రగిలిపోయారు. ఇలా ఆందోళన తీవ్రతరం కాగానే ఏదో ఒక హామీ అంటూ పరిస్థితి సద్దుమణిగేలా చెయ్యడం...ఆ తరువాత మళ్లీ పట్టించుకోకపోవడం...గత మూడేళ్లుగా ఇదే జరుగుతోందని...ఇప్పుడు కూడా మళ్లీ అదే జరిగిందని, ఇందులో వింతేముందంటూ బాధితులు వాపోయారు. అయితే ఇలా ఆవేశంతో ఉన్న బాధితులకు ఆయా సంఘాల నేతలు నచ్చ చెప్పేందుకు ప్రయత్నించారు.
మంత్రి హామీ...ఇదే!
అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విజ్ఞాన మందిరంలో జరుగుతున్న దీక్ష వద్దకు గురువారం మంత్రి నక్కా ఆనంద బాబు విచ్చేసి నేతలతో సమావేశం అయ్యారు. అగ్రిగోల్డ్ బాధితుల గురించి ఈరోజు జరిగే మంత్రివర్డ సమావేశంలో చర్చిస్తామని, ఆందోళన విరమించండని కోరారు. దీంతో మంత్రి ప్రసంగానికి బాధితులు అడ్డుపడ్డారు.
నేతల తీరు...బాధితుల అసంతృప్తి...
అయితే తమ డబ్బులు ఇచ్చేంత వరకు దీక్ష విరమించేది లేదని...ఇక్కడ నుంచి కదిలేది లేదంటూ బాధితులు పెద్ద ఎత్తున కేకలు పెట్టారు. అయితే మంత్రి నక్కా ఆనందబాబు మీకు న్యాయం చేస్తామనగానే అయితే తమకు డబ్బులు ఎప్పుడు ఇస్తారో ఖచ్చితమైన సమయం చెప్పాలంటూ నినాదాలు చేశారు. అయితే మంత్రి సమాధానం చెప్పకుండా మాట దాటేశారని బాధితులు అంటున్నారు. అయితే ఈ రోజు సాయంత్రం ఐదుగురికి ముఖ్యమంత్రిని కలిసే అవకాశం ఇప్పిస్తానని మంత్రి నక్కా ఆనందబాబు చెప్పారన్నారు. అయితే మంత్రి హామీ నమ్మి నేతలు ఆందోళన విరమించడంపై ఎక్కువమంది బాధితులు అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది.