అగ్రిగోల్డ్ ఏజంటు ఆత్మహత్య:రూ.కోటికి కట్టించాడు...భార్యచే తలకొరివి
శ్రీకాకుళం:శ్రీకాకుళం జిల్లా టెక్కలి పట్టణానికి చెందిన అగ్రిగోల్డ్ ఏజెంటు రాంపాత్రుని కోటేశ్వరరావు(43) రైలుకింద పడి ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. కోటబొమ్మాళి మండలం హరిశ్చంద్రపురం రైల్వే స్టేషన్ సమీపంలో ఆయన ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు. రైలు కింద పడిన కారణంగా ఆయన శరీరం ముక్కలు ముక్కలు కాగా, టెక్కలి ఏరియా హాస్పటల్ లో పోస్టుమార్టం పూర్తిచేసి భౌతికకాయాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు.
అప్పులవాళ్ల ఒత్తిడి బాగా పెరిగిపోవడం, తాజాగా అగ్రి గోల్డ్ కు సంబంధించి మీడియాలో వెలువడుతున్న వార్తలను బట్టి బాధితులకు ఇప్పట్లో న్యాయం జరిగే పరిస్థితి లేదని ప్రచారం జరుగుతుండటంతో తీవ్ర మనోవేదనకు గురై ఆత్మహత్యకు పాల్పడినట్లు రైల్వే పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో కుటుంబసభ్యులు పేర్కొన్నారు. కష్టజీవిగా, సాత్వికుడిగా పరిసర ప్రాంతాల్లో మంచి పేరు సంపాదించుకున్న కోటేశ్వరరావును అగ్రి గోల్డ్ సంస్థే పొట్టనపెట్టుకుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
స్థానికుల కథనం ప్రకారం...పెద్దరోకళ్లపల్లికి చెందిన రాంపాత్రుని కోటేశ్వరరావు కుటుంబం కొన్ని సంవత్సరాల క్రితం టెక్కలి తరలివచ్చి ఇక్కడే స్థిరనివాసం ఏర్పరుచుకుంది. కష్టజీవి అయిన కోటేశ్వరరావు అనంతరకాలంలో అగ్రి గోల్డ్ సంస్థ లో సాధారణ ఏజంట్ గా చేరి...ఆ తరువాత స్వయంకషితో క్రమంగా సీడీ స్థాయికి ఎదిగారు. ఈ క్రమంలో వివిధ వ్యక్తులకు చెందిన సొమ్ము రూ.కోటికి పైగా అగ్రిగోల్డ్, బొమ్మరిల్లు సంస్థల్లో పాలసీల రూపంలో పెట్టుబడి పెట్టించారని, అయితే అగ్రి గోల్డ్ సంస్థలు దివాలా తీయడంతో సొమ్ము కట్టినవారంతా ఒత్తిడి చేయడం ప్రారంభించారని కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.
అగ్రి గోల్డ్ సంస్థ దివాలా తీయడంతోనే కొడుకు పరిస్థితి ఏమవుతుందోనన్న ఆందోళనతో ఏడాదిన్నర కిందట కోటేశ్వరరావు తండ్రి కూర్మయ్య హఠాన్మరణం చెందారని, మళ్లీ ఇప్పుడు ఆయన కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడని స్థానికులు చెబుతున్నారు. కోటేశ్వరరావుకు భార్య జగదీశ్వరి, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు రాసిన కుమార్తె హేమ ఉన్నారు. భర్త ఆత్మహత్య విషయం తెలిసిన భార్య జగదీశ్వరి గుండెలవిసేలా రోదించింది. తలకొరివి పెట్టేవారు లేకపోవడంతో భర్త మృతదేహానికి ఆమె తల కొరివి పెట్టడం అందర్నీ కలచివేసింది.కోటేశ్వరరావు కుటుంబాన్నిప్రభుత్వం ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు.