మోసం: అగ్రిగోల్డ్ చైర్మన్కు మూడేళ్ల జైలు శిక్ష
కడప: అగ్రిగోల్డ్ ఛైర్మన్ ఏవీ రామారావుకు కడప జిల్లా బద్వేలు న్యాయస్థానం మూడేళ్లు జైలు శిక్ష, రూ.6 వేల జరిమానా విధించింది. ఈ మేరకు మంగళవారం న్యాయమూర్తి శుభవల్లి తీర్పునిచ్చారు. రామారావు.. ఓ కంపెనీకి చెందిన ఉద్యోగులతో కుమ్మక్కై భారీ మోసానికి పాల్పడిన విషయం తెలిసిందే.
మైదుకూరు డీఎస్పీ శ్రీనివాసులు తెలిపిన వివరాల ప్రకారం.. మ్యాక్స్ అర్ద్క్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్ కంపెనీ పోరుమామిళ్ల మండలం సిద్ధవరం గ్రామంలో 300 ఎకరాలు సేకరించింది.
ఈ కంపెనీ తరఫున రవిబాబు, కొండూరు వేంకటేశ్వర ప్రసాద్లు ఫవర్ పట్టా పొంది ఉన్నారు. అగ్రిగోల్డ్ ఛైర్మన్ రామారావు వారిద్దరితో కుమ్మక్కై ఆ కంపెనీని మోసగించారు. దీంతో ఆ కంపెనీ యాజమాన్యం పోరుమామిళ్ల పోలీసుస్టేషన్లో 2001 ఫిర్యాదు చేసింది.
ఈ కేసులో నిందితుడైన రామారావును ఏలూరు జైలు నుంచి పోలీసులు బద్వేలు న్యాయస్థానంలో హాజరుపరిచారు. విచారణలో నేరం రుజువు అవడంతో రామారావుకు జైలు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పు వెలువరించారు.
రేపటి నుంచి అగ్రిగోల్డ్ బాండ్ల పరిశీలన
రాష్ట్రంలోని అన్ని పోలీస్స్టేషన్ల వద్ద ఈ నెల 5 నుంచి సీఐడీ ఆధ్వర్యంలో అగ్రిగోల్డ్ బాధితుల జాబితాను సేకరిస్తారని బాధితులంతా బాండ్లు, ఇతర ఆధారాలతో అక్కడకు వెళ్లి ధ్రువీకరించుకోవాలని అగ్రిగోల్డ్ ఖాతాదారులు, ఏజెంట్లు సంక్షేమ సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు ముప్పాళ్ల నాగేశ్వరరావు కోరారు. విజయవాడ హనుమాన్పేట సీపీఐ భవన్లో మంగళవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
అగ్రిగోల్డ్ అసోసియేషన్ ఉద్యమ ఫలితంగా ఖాతాదారుల జాబితాకు తుది రూపమిచ్చేందుకు సీఐడీ అధికారులు కసరత్తు ప్రారంభించారని తెలిపారు. రాష్ట్రంలోని 660 మండలాల్లోని బాధిత ఖాతాదారులు, ఏజెంట్లుకు చెందిన బాండ్లు, ఆధార్, బ్యాంక్ ఖాతా నకలు, ఒరిజినల్ పత్రాలను చూపి ధ్రువీకరించుకోవాలని సూచించారు.