జయలలిత గెలుపు, ఏపీకీ షాక్: చంద్రబాబుకు 'హోదా' చిక్కులు
చెన్నై/విజయవాడ: అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత వరుసగా రెండోసారి, మొత్తం ఆరోసారి తమిళనాడు ముఖ్యమంత్రిగా అయి చరిత్ర సృష్టించారు. తమిళనాట జయలలిత గెలుపు నేపథ్యంలో... ఏపీకి ప్రత్యేక హోదా అంశం పైన మరోసారి తేటలెత్తమైందా? అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి.
ఇప్పటికే ఏపీ ప్రత్యేక హోదా పైన కేంద్రమంత్రులు దాదాపు తేల్చేశారు. హోదాను నాటి యూపీఏ ప్రభుత్వం చట్టంలో పెట్టలేదని, దీంతో తాము ఏం చేయలేని పరిస్థితుల్లో ఉన్నామని బీజేపీ చేతులెత్తేసింది. దీంతో హోదా రాదని దాదాపు తేలిపోయింది.
హోదా పైన కేంద్రమంత్రులు తేల్చివేసినప్పటికీ ఎక్కడో ఓ చోట మిణుకుమిణుకుమనే ఆశలు కలుగుతున్నాయి. ప్రధాని మోడీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ, ఆయన వ్యాఖ్యలు, విపక్షాల పోరాటం, బీజేపీ నేతల వ్యాఖ్యలు.. తదితరాలను చూస్తుంటే వచ్చే ఎన్నికల నాటికి వ్యూహాత్మకంగా వ్యవహరించి హోదా ఇచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని కొందరు అభిప్రాయపడుతున్నారు.
అయితే, జయలలిత గెలుపు, రాజ్యసభలో ఆమెకు పెరగనున్న సీట్ల నేపథ్యంలో ప్రత్యేక హోదా పైన పూర్తిగా ఆశలు వదిలేసుకోవచ్చుననే వాదనలు వినిపిస్తున్నాయి.
కొద్ది రోజుల క్రితం కేంద్రమంత్రి, టిడిపి నేత అశోక్ గజపతి రాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రత్యేక హోదాను ముఖ్యంగా ముగ్గురు ముఖ్యమంత్రులు వ్యతిరేకిస్తున్నారని బాంబు పేల్చారు. ఏపీకి హోదాను తమిళనాడు, కర్నాటక, బీహార్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు వ్యతిరేకిస్తున్నారని చెప్పారు.
తమిళనాడు ఎన్నికల నేపథ్యంలో మరోసారి జయలలితనే సీఎం అయ్యారు. దీంతో ఏపీకి హోదా విషయంలో జయలలిత నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండదని చెప్పవచ్చు. ఇది ప్రత్యేక హోదా సాధిస్తామని చెబుతున్న టిడిపి, వైసీపీలకు షాకేనని, అలాగే వచ్చే ఎన్నికలకు (2019) ముందు ఇస్తామని, ఒకవేళ బీజేపీ భావించి ఉంటే.. ఆ పరిస్థితి కనిపించదని అంటున్నారు.
జయ, మమతలకు పెరగనున్న సీట్లు
తమిళనాడులో జయలలిత పార్టీకి, పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ పార్టీకి రాజ్యసభలో సీట్లు పెరగనున్నాయి. రాజ్యసభలో బీజేపీకి ఆధిక్యం లేదు. దీంతో బిల్లుల కోసం విపక్షాలు, ఇతర మిత్ర పక్షాల వైపు, తమతో కలిసి వచ్చే వారి వైపు చూస్తోంది.
ఈ అసెంబ్లీ ఎన్నికల్లో అద్భుత విజయం సాధించిన నేపథ్యంలో జయలలిత పార్టీ అన్నాడీఎంకేకు, మమత పార్టీ తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి రాజ్యసభలో బలం పెరగనుంది. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే పరిస్థితి ఎదురైతేనే మిగతా రాష్ట్రాలు మండిపడుతున్నాయి. అలాంటిది బీజేపీకి బలం లేని రాజ్యసభలో జయ, మమత వంటి వారి మద్దతు కోసం బీజేపీ ఏపీకి ఇచ్చే హోదా అంశాన్ని పక్కన పెట్టే పరిస్థితులే ఉండవచ్చునని అంటున్నారు.