సునీల్ విడుదల: జగన్ బెయిల్ రద్దు చేయాలని పిటిషన్
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి అనుచరుడు, ఎమ్మార్ కేసు నిందితుడు సునీల్ రెడ్డి సోమవారం బెయిల్ పైన చంచల్ గూడ జైలు నుండి విడుదలయ్యారు. ఎమ్మార్ విల్లాల కేసులో అక్రమంగా వచ్చిన సొమ్ము సునీల్ రెడ్డి ఖాతాలోకి జమ అయిందన్న ఆరోపణలతో సూనీల్ పైన సిబిఐ అరెస్టు వారెంట్ జారీ చేయడంతో ఆయన కొంతకాలంగా జైల్లో ఉన్నారు. శనివారం ఆయనకు బెయిల్ వచ్చింది. ఈ రోజు జైలు నుండి విడుదలయ్యారు. బ్రహ్మానంద రెడ్డి, నిమ్మగడ్డ ప్రసాద్లకు నాంపల్లి సిబిఐ కోర్టు సోమవారం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. వారు మంగళవారం జైలు నుండి విడుదల కానున్నారు.
జగన్ బెయిల్ రద్దు చేయాలని..
వైయస్ జగన్మోహన్ రెడ్డి బెయిల్ను రద్దు చేయాలని కోరుతూ తెలంగాణకు చెందిన న్యాయవాది సిబిఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు పలువురు తెలంగాణ న్యాయవాదులు సిబిఐ ఎస్పీని కలిసి జగన్ బెయిల్ను రద్దు చేసే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు.
మాజీ డిజిపికి చుక్కెదురు
ఎపి మాజీ డిజిపి దినేష్ రెడ్డికి భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. పదవీ కాలాన్ని పొడిగించాలంటూ ఆయన దాఖలు చేసిన పిటిషన్ను కోర్టు కొట్టివేసింది.
చెన్నమనేనికి ఊరట
కరీంనగర్ జిల్లా వేములవాడ ఎమ్మెల్యే, తెరాస నేత చెన్నమనేని రమేష్కు సుప్రీం కోర్టులో ఉపశమనం లభించింది. రమేష్ ఎన్నికల చెల్లదంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీం కోర్టు సోమవారం తాత్కాలికంగా స్టే విధించింది.