'ఎయిర్ఏషియాతో బాబుకేం సంబంధం, మోడీ కూడా ఉన్నారా? ఫోన్ ట్యాపింగ్ బయటకెలా వచ్చింది'
అమరావతి: ఎన్డీయే ప్రభుత్వంపై ఏపీ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు కుటుంబ రావు మంగళవారం తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. ఆయన విజయవాడలో మాట్లాడారు. ఎన్డీయే సమాఖ్య స్ఫూర్తికి తూట్లు పొడుస్తోందని ధ్వజమెత్తారు. జాతీయ మీడియాను కంట్రోల్లో పెట్టుకొని, తమ తప్పులు బయటపడకుండా చేసుకుంటోందన్నారు.
Recommended Video
ఎయిర్ఏషియా స్కాం: 'అక్రమ మార్గంలో పనుల కోసం చంద్రబాబును కలిస్తే చాలు!'
బీజేపీ హెడ్ క్వార్టర్ను కట్టినంత సమయంలో అంటే తొమ్మిది నెలల్లో ఏపీలో ఏదైనా ఒక్క సంస్థను కట్టాలని డిమాండ్ చేశారు. నాలుగేళ్లలో ఏపీలో ఒక్క విద్యా సంస్థను కూడా కట్టలేదన్నారు. విభజన హామీల విషయంలో పదేళ్ల సమయం ఉందని బీజేపీ నేతలు చెబుతున్నారని, కానీ ప్రజలు ఏన్డీయేకు అయిదేళ్ల సమయమే ఇచ్చారన్నారు. ఆ తర్వాత ఎవరు వస్తారో ఎవరికి తెలుసన్నారు.
చంద్రబాబును అవమానించేలా జీవీఎల్ వ్యాఖ్యలు
సార్వత్రిక ఎన్నికలు వచ్చే లోగా ఏపీలో ఒక్క కేంద్ర ప్రభుత్వ సంస్థను ఏర్పాటు చేయగలరా అని కుటుంబ రావు సవాల్ చేశారు. కేంద్రం మెడలు వంచైనా తాము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుకుంటామని చెప్పారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును అవమానించేలా బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవిఎల్ నర్సింహా రావు మాట్లాడుతున్నారన్నారు.
అధికారులతో పరిశీలనకు జీవీఎల్ సిద్ధమా?
బీజేపీ నేతలు పదేపదే యూసీలు అంటున్నారని, ఆ విషయంలో సమావేశం ఏర్పాటు చేసేందుకు సిద్ధమని కుటుంబ రావు అన్నారు. యూసీల పైన కేంద్ర, రాష్ట్ర అధికారులతో పరిశీలనకు జీవీఎల్ నర్సింహ రావు సిద్ధమా అని కుటుంబ రావు ప్రశ్నించారు. యూసీలపై తాము అవాస్తవాలు చెప్పడం లేదని, జీవీఎల్ నర్సింహా రావే అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అసలు యూసీలు అడగడానికి జీవీఎల్ ఎవరని ప్రశ్నించారు.
ఎయిర్ ఏషియాకు, చంద్రబాబుకు ఏం సంబంధం?
ఫైళ్ల క్లియరెన్స్లో నరేంద్ర మోడీ ప్రభుత్వం వెనుకబడి ఉందని కుటుంబ రావు అన్నారు. ఎయిర్ ఏషియా స్కాం వ్యవహారంలో అసలు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రమేయం ఏముందని ప్రశ్నించారు. అసలు చంద్రబాబుకు, ఎయిర్ ఏషియాకు ఏం సంబంధమని ఆయన అభిప్రాయపడ్డారు. ఎయిర్ ఏషియా వ్యవహారంలో 85 శాతం పని అంతా యూపీఏ 2 హయాంలో జరిగిందన్నారు.
ఎయిర్ ఏషియాలో మోడీ, కేంద్రమంత్రులు కూడా ఉన్నారా?
ఎయిర్ ఏషియా వ్యవహారానికి నరేంద్ర మోడీ కేబినెట్ ఆమోదం తెలిపిందని కుటుంబ రావు గుర్తు చేశారు. అలా అయితే ప్రధాని నరేంద్ర మోడీ సహా ఎన్డీయేలోని మంత్రులు అందరూ ఈ వ్యవహారంలో ఉన్నారా అని ఘాటుగా ప్రశ్నించారు. చంద్రబాబుపై అనవసర ప్రచారం చేస్తున్నారని అభిప్రాయపడ్డారు.
ఫోన్ ట్యాపింగ్ ఎలా బయటకు వచ్చింది?
ఎయిర్ ఏషియాకు చెందిన ఇద్దరు మాట్లాడుకునేటప్పుడు చంద్రబాబు పేరు రావడంపై కుటుంబ రావు స్పందిస్తూ.. అసలు దేశంలో ఫోన్ ట్యాపింగ్కు అనుమతి ఉందా అని ప్రశ్నించారు. అసలు ఆ ఫోన్ను ఎవరు ట్యాప్ చేశారు, అది ఎలా బయటకు వచ్చిందో చెప్పాలని నిలదీశారు. ఢిల్లీలో ఫోన్ ట్యాపింగ్కు అనుమతి ఇస్తున్నారా అని నిలదీశారు. 9 నెలల్లో ఢిల్లీలో అద్భుతంగా బీజేపీ జాతీయ కార్యాలయాన్ని నిర్మించారని కుటుంబ రావు గుర్తు చేశారు.
సాక్షి పత్రికపై ఆగ్రహం
ఎయిర్ ఏషియా వ్యవహారంలో చంద్రబాబుపై సాక్షి పత్రిక ఓ కథనం ఇచ్చింది. దీనిపై కుటుంబ రావు మండిపడ్డారు. వైసీపీ, జగన్ పత్రిక సాక్షి చీప్ పబ్లిసిటీకి పాల్పడుతోందన్నారు. కేంద్రమంత్రి అశోక్ గజపతి రాజు పైన నిరాధార ఆరోపణలు అన్నారు. ఒక్క ఆధారం కూడా లేదన్నారు. ఎవరో ఇద్దరు మాట్లాడుకుంటే చంద్రబాబుకు, అశోక్ గజపతి రాజుకు ఏం సంబంధమని ప్రశ్నించారు.