రిమోట్ కోసం గొడవ, భర్తపై ఉమ్మేసి కొట్టింది! ఎయిర్ హోస్టెస్ది హత్యే
హైదరాబాద్: మాజీ ఎయిర్ హోస్టెస్ రీతూ మృతి కేసును పోలీసులు చేధించినట్లుగా తెలుస్తోంది. భార్యాభర్తల మధ్య గొడవ కారణంగా, ఆమెను భర్తనే హత్య చేశారని తెలుస్తోంది. మరో విషయమేమంటే వారి మధ్య రిమోట్ కోసం గొడవ జరిగినట్లుగా తెలుస్తోంది.
భార్య రీతు, భర్త సచిన్ మధ్య ఆ రోజు రిమోట్ కోసం గొడవ జరిగింది. ఆ గొడవ కూడా భర్త స్నేహితుడు రాకేష్ ముందు జరిగింది. తన స్నేహితుడి ముందు తన భార్య తనను అవమానించిందనే ఆగ్రహంతో రీతును భరత్ హత్య చేశాడని తెలుస్తోంది.
భర్త సచిన్ తన భార్య రీతు గొంతును దిండుతో నొక్కి ఊపిరాడకుండా చేసి చంపేశాడని తెలుస్తోంది. సచిన్ను పోలీసులు కాసేపట్లో మీడియా ముందుకు తీసుకు రానున్నారు.
కాగా, తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ఉప్పల్ పోలీసు స్టేషన్ పరిధిలో సోమవారం ఉదయం రీతు అనే మాజీ ఎయిర్ హోస్టెస్ తన నివాసంలో విగతజీవిగా కనిపించిన విషయం తెలిసిందే.
స్థానికులు దీనిని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని శవపరీక్ష కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటన ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇందిరా నగర్లో జరిగింది. స్థానికంగా ఇది సంచలనం సృష్టించింది.
ఏం జరిగింది?
పోలీసుల విచారణలో బుధవారం నాడు సచిన్ తన తప్పును అంగీకరించినట్లుగా తెలుస్తోంది. పోలీసులు సచిన్, అతని స్నేహితుడు రాకేష్ను విచారించారు. రాకేష్ ఇన్ఫోసిస్ ఉద్యోగి. ఈ కేసులో అతను ముఖ్యమైన సాక్షి. రాకేష్, సచిన్లు ఎంబీయేలో క్లాస్మేట్స్.
సమాచారం మేరకు, విచారణలో రాకేష్... అతను, సచిన్ ఆదివారం రాత్రి బార్లో మందు తాగారు. తర్వాత సచిన్ ఇంటికి బిర్యానీ పార్సిల్ తీసుకొని వెళ్లారు. ఐపీఎల్ మ్యాచ్ చూసేందుకు సచిన్ రిమోట్ అడిగాడు. దీనిపై భార్యాభర్తల మధ్య వాగ్వాదం జరిగింది. అనంతరం కాసేపటికి బిర్యానీ వడ్డించమని సచిన్ అడిగాడు.
అయితే, రీతు వడ్డించేందుకు నిరాకరించింది. అంతేకాకుండా, సచిన్ పైన ఆమె ఉమ్మేసింది. కొట్టింది. దీంతో ఆగ్రహోద్రుడైన సచిన్ ఆమెను కొట్టాడు. రాకేష్ కలుగజేసుకునే ప్రయత్నం చేశాడు. అయితే, సచిన్ పర్సనల్ విషయంలోకి రావొద్దని సచిన్ అతనిని హెచ్చరించాడు.
పోలీసుల విచారణలో సచిన్... గొడవ అనంతరం రీతు బెడ్ రూంకి వెళ్లి కూర్చుంది. ఆమె సచిన్ కుటుంబ సభ్యులను తిట్టింది. దీంతో అతను ఆగ్రహానికి లోనయ్యాడు. దిండు ముఖం పైన పెట్టి అదిమాడు. ఆ తర్వాత కాసేపటికి ఆమె కదలలేకపోవడం చూశాడు.
దీంతో, ఆమె తండ్రికి ఫోన్ చేసి పిలిపించాను. ఆసుపత్రికి తీసుకెళ్లాం. అప్పటికే ఆమె మృతి చెందిందని వైద్యులు చెప్పారు. సచిన్ దిండును ముఖంపై పెట్టి ఊపిరాడకుండా చేయడం వల్ల ఆమె చనిపోయిందని పోలీసులు చెప్పారు. అయితే, పోస్టుమార్టం నివేదిక కోసం వేచి చూస్తున్నట్లు చెప్పారు.