ఎయిర్ హోస్టెస్ హత్య: ఇల్లు అమ్మి బిజినెస్లో పెట్టాలని రీతుపై ఒత్తిడి
హైదరాబాద్: మీ స్వస్థలంలోని ఇంటిని అమ్మి, తన వ్యాపారంలో రూ.10 లక్షల పెట్టుబడి పెట్టాలని మృతి చెందిన మాజీ ఎయిర్ హోస్టెస్ రీతు ఉప్పల్ను భర్త సచిన్ నిత్యం వేధించే వాడని తెలుస్తోంది. రీతు కుటుంబ సభ్యులు తమ ఆస్తులను ఇచ్చేందుకు అంగీకరించకపోవడం పైన సచిన్ కోపంతో ఉండేవాడని చెబుతున్నారు.
వ్యాపారంలో పెట్టుబడి కోసం నిత్యం రీతును వేధించేవాడు. అందుకోసం ఎప్పుడు ఆమెతో తగవుపడేవాడు. జంషెడ్ పూర్లోని ఇంటిని అమ్మి రూ.పది లక్షలు ఇవ్వమని రీతు తండ్రిని డిమాండ్ చేసేవాడు. అప్పటికే కట్నం రూపంలో వారు పదిహేను పదహారు లక్షల రూపాయలు ఇచ్చారు.
ఆ తర్వాత ఇంటిని అమ్మేయమని ఒత్తిడి చేసేవాడు. అయితే, ఆ ఇంటిని అమ్మితే తాము ఎక్కడ ఉండాలని రీతు తల్లిదండ్రులు ప్రశ్నించేవారు. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో తన భార్య రీతు పేరిట ఓ ఇల్లు ఉందని సచిన్ విన్నాడని తెలుస్తోంది.
దీంతో, కోల్కతాలోని ఇల్లు అమ్మి, డబ్బులు తీసుకు రావాలని నిత్యం రీతును వేధించేవాడు. ఈ బాధలు భరించలేక కొద్ది రోజుల క్రితం రీతు ఉప్పల్ అతని నుండి వేరుగా ఉండి జీవించడం ప్రారంభించింది. అయితే, అతను మారాడని భావించి కొద్ది రోజుల తర్వాత తిరిగి భర్త వద్దకు వెళ్లింది.