చంద్రబాబు, నారా లోకేష్! స్పెషల్ ఫ్లయిట్ను వీడి..సాధారణ విమానంలో ప్రయాణం!
బెంగళూరు: తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు, మాజీ మంత్రి నారా లోకేశ్ సాధారణ విమానంలో ప్రయాణం సాగించారు. అధికారంలో ఉన్న అయిదేళ్ల పాటు ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు గానీ, ఐటీ శాఖ మంత్రిగా ఆయన కుమారుడు లోకేశ్ గానీ ప్రత్యేక విమనాల్లో రాకపోకలు సాగించారు. ఎక్కడికి వెళ్లినా ప్రత్యేక విమానాన్ని తప్ప సాధారణ ఫ్లయిట్లలో ఏనాడూ ప్రయాణించలేదు.
ప్రస్తుతం చంద్రబాబు అధికారాన్ని కోల్పోయారు. ప్రతిపక్ష నేత హోదాకు పరిమితం అయ్యారు. ఈ నేపథ్యంలో- ఆయన సాధారణ విమానాల్లో ప్రయాణించారు. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్తో సమావేశం కావడానికి ఆయన విజయవాడ నుంచి ఎయిరిండియా విమానంలో హైదరాబాద్కు బయలుదేరారు. ఓ సాధారణ విమానంలో ఆయన ప్రయాణించడం గత అయిదేళ్ల కాలంలో ఇదే తొలిసారి.
చంద్రబాబుతో పాటు నారా లోకేష్ కూడా అదే విమానంలో హైదరాబాద్కు బయలుదేరారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్ల ఆయన ప్రయాణించిన విమానాన్ని దారి మళ్లించారు. హైదరాబాద్కు బదులుగా బెంగళూరుకు వెళ్లిందా విమానం. సుమారు ఆరు గంటల పాటు ఆలస్యంగా ఎయిరిండియా విమానం సురక్షితంగా గమ్యస్థానానికి చేరుకుంది.
చంద్రబాబు, నారా లోకేష్తో పాటు సుమారు 130 మంది ప్రయాణికులు ఉన్న ఎయిరిండియా విమానం గురువారం సాయంత్రం 7:20 నిమిషాలకు గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరింది. హైదరాబాద్ మీదుగా అది దేశ రాజధానికి వెళ్లాల్సి ఉంది. వాతావరణం సరిగా లేకపోవడంతో విమానాన్ని బెంగళూరుకు మళ్లించారు. రాత్రి 9.20 గంటలకు విమానం బెంగళూరుకు చేరుకుంది. గంట పాటు బెంగళూరు కెంపెగౌడ విమానాశ్రయంలో గడిపారు. వాతావరణం అనుకూలించడంతో రాత్రి 10.30 గంటల సమయంలో ఆ విమానం హైదరాబాద్కు బయలుదేరింది.