ఎయిరిండియా మాజీ బాస్కు పిలిచి కీలక పదవి ఇచ్చిన జగన్: కేబినెట్ ర్యాంక్: ప్రశాంత్ కిశోర్ రెకమెండ్?
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నామినేటెడ్ పోస్టులను భర్తీ చేయడానికి తెర తీసినట్లు కనిపిస్తోంది. అత్యంత కీలకమైన, ప్రతిష్ఠాత్మక కార్పొరేషన్లకు ఛైర్మన్లను ఎంపిక చేయడంపై కసరత్తు ఆరంభించారు. పార్టీకి చెందిన సీనియర్ నాయకులతో పాటు తెలుగుదేశం పార్టీకి గుడ్బై పలికి..వైసీపీ కండువాను కొప్పుకొన్న మాజీమంత్రులు, మాజీ ఎమ్మెల్యేల్లో చాలామంది ఈ నామినేటెడ్ పోస్టులపైనే ఆశలు పెట్టుకున్నారు.
అనంతపురంలో కరోనా వైరస్: రష్యా నుంచి వచ్చిన పర్యాటకుడిలో: అతని ట్రావెల్ హిస్టరీ ఇదీ..!
కేబినెట్ హోదాతో..
ఈ పరిస్థితుల్లో ఉత్తర ప్రదేశ్కు చెందిన రిటైర్డ్ సివిల్ సర్వీసెస్ అధికారికి పిలిచి మరీ కీలక పదవిని అప్పగించారు వైఎస్ జగన్. ఆయనను రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ) ఛైర్మన్గా నియమించారు. కేబినెట్ మంత్రి స్థాయి హోదాను ఇచ్చారు. ఆయనే అశ్వని లొహాని. ఇండియన్ రైల్వే సర్వీసెస్ అధికారి. కేంద్రంలో పలు కీలక విభాగాలకు అధిపతిగా పని చేశారు. ఆయన అనుభవాన్ని, సేవలను వినియోగించుకోవడానికే ఏపీటీడీసీ ఛైర్మన్గా నియమించినట్లు చెబుతున్నారు. ఏపీటీడీసీ ఛైర్మన్గా లొహానిని నియమిస్తూ సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ ఉత్తర్వులు జారీ చేశారు.
కాన్పూర్కు చెందిన మాజీ అధికారి
అశ్వని లొహాని.. ఉత్తర ప్రదేశ్లోని కాన్పూర్లో జన్మించారు. ఇండియన్ రైల్వేస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెకానికల్ అండ్ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్లో విద్యను అభ్యసించారు. మెకానికల్ ఎలక్ట్రికల్ విభాగాల్లో ఇంజినీరింగ్ పూర్తి చేశారు. ఇండియన్ రైల్వే సర్వీసులకు ఎంపిక అయ్యారు. చాలాకాలం పాటు కేంద్ర సర్వీసుల్లో పని చేశారు. ఎయిరిండియా, రైల్వే బోర్డు ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా వ్యవహరించారు. ఇండియా టూరిజం డెవలప్మెంట్ బోర్డు (ఐటీడీసీ) సీఎండీగా పని చేశారు.
పర్యాటకం, లాజిస్టిక్ రంగాలపై పట్టు..
పర్యాటకం, లాజిస్టిక్ రంగాలపై అశ్వని లొహానికి మంచి పట్టు ఉందని, దీన్ని దృష్టిలో ఉంచుకుని ఆయనకు వైఎస్ జగన్ ఏపీటీడీసీ ఛైర్మన్ పగ్గాలను అందించినట్లు చెబుతున్నారు. రైల్వే బోర్డు ఛైర్మన్గా సుదీర్ఘకాలం పని చేసిన అనుభవం ఉన్నందున.. రైల్వే ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయడానికి ఉపయోగపడతారని జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. లాజిస్టిక్ రంగంపైనా మంచి పట్టు ఉండటం వల్ల రాష్ట్రంలోని అన్ని పర్యాటక ప్రదేశాలను అనుసంధానిస్తూ రవాణా వసతిని అభివృద్ధి చేయడానికి ఆయన సూచనలు, సలహాలను తీసుకోవడానికి వీలు ఉంటుందని అభిప్రాయం ప్రభుత్వ పెద్దల్లో వ్యక్తమౌతున్నట్లు తెలుస్తోంది.
Recommended Video
ప్రశాంత్ కిశోర్ రికమెండ్
ఇదిలావుండగా- ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ రికమెండేషన్ వల్లే వైఎస్ జగన్.. అశ్వని లొహానికి ఈ నామినేటెడ్ పోస్టును అప్పగించారనే అభిప్రాయాలు కూడా వ్యక్తమౌతున్నాయి. ప్రశాంత్ కిశోర్కు చెందిన ఐప్యాక్ డైరెక్టర్ వివాహానికి వైఎస్ జగన్ తన భార్య భారతితో కలిసి లక్నోకు వెళ్లిన విషయం తెలిసిందే. వైఎస్ జగన్.. అక్కడ ప్రశాంత్ కిశోర్ను కూడా కలిశారు. అప్పుడే ఆయన ఈ విషయాన్ని ప్రస్తావించగా.. జగన్ అంగీకరించారని చెబుతున్నారు. పైగా- ఎయిరిండియా, రైల్వే బోర్డు, ఐటీడీసీ వంటి కీలక విభాగాల్లో సీఎండీగా పనిచేసిన అనుభవం ఉన్నందున.. జగన్ ఓకే చెప్పారని సమాచారం.