కొజికోడ్ విమాన ప్రమాదం విధి వైపరీత్యం - కెప్టెన్ సాథేతో వ్యక్తిగత పరిచయం - పవన్ కల్యాణ్ విచారం
కేరళలోని కోజికోడ్ లో జరిగిన ఘోర విమాన ప్రమాదంపై జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ విచారం వ్యక్తం చేశారు. ప్రమాదంలో చనిపోయిన పైలట్, ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్ దీపక్ వసంత్ సాథేతో వ్యక్తిగతంగానూ పరిచయం ఉందని తెలిపారు. సాథేతోపాటు కో పైలట్ కెప్టెన్ అఖిలేశ్ కుమార్ కు కూడా విమానయానంలో ఎంతో అనుభవం ఉందని, అయినా అయినప్పటికీ ప్రమాదం చోటుచేసుకోవడం దురదృష్టకరమని జనసేనాని అన్నారు. ఈ మేరకు శుక్రవారం ఆయనో ప్రకటన విడుదల చేశారు.
''కేరళలోని కొజికోడ్ విమానాశ్రయంలో జరిగిన విమాన ప్రమాదంలో ఇద్దరు పైలట్లు సహా 18 మంది ప్రయాణికులు దుర్మరణం చెందడం బాధాకరం. ప్రయాణం చివరి నిమిషంలో ఊహించని ఈ ప్రమాదం జరగడం విధి వైపరీత్యం. గల్ఫ్ నుంచి ప్రయాణం చేసినవాళ్లు మాతృభూమిపై కాలుమోపేలోపే మృత్యువు ప్రమాదం రూపంలో కాలేసింది.
ఎయిర్ ఇండియా విమానాన్ని నడిపిన వింగ్ కమాండర్ దీపక్ వసంత్ సాథే, కెప్టెన్ అఖిలేశ్ కుమార్ లు విమానయానంలో ఎంతో అనుభవం ఉన్న పైలట్లు. అయినప్పటికీ విమానం ప్రమాదానికి గురికావడం దురదృష్టకరం.
వింగ్ కమాండర్ దీపక్ సాథే గతంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ల చిరస్మరణీయ సేవలు అందించారు. వ్యక్తిగతంగా కూడా ఆయన నాకు తెలుసు. ఈ ప్రమాదంలో ఆయన కూడా దుర్మరణం చెందడం నన్ను కలచివేసింది. సాథే సేవలు, ధైర్యసాహసాలను ఎన్నటికీ మరువబోము. ఈ ప్రమాదంలో చనిపోయినవాళ్లకు శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను. వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను'' అని జనసేనాని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.