విజయవాడ వాసులకు తప్పిన పెను ప్రమాదం: ఈదురు గాలుల్లో చిక్కుకున్న ఢిల్లీ విమానం!
విజయవాడ: ఘోర విమాన ప్రమాదం తృటిలో తప్పింది. దేశ రాజధాని నుంచి విజయవాడకు బయలుదేరిన ఎయిరిండియా విమానం భూమికి సుమారు 28 వేల అడుగుల ఎత్తులో ఎగురుతున్న సమయంలో తుఫాను తరహా వాతావరణంలో చిక్కుకుంది. ఉరుములతో కూడిన ఈదురు గాలులు విమానాన్ని ఊపేశాయి. ఎంతగా అంటే- విమానంలోని వస్తువులు చెల్లాచెదురుగా పడిపోయాయి. ప్రయాణికులకు భోజనాన్ని అందించే ప్లేట్లన్నీ ప్రయాణికులపై విసిరేసినట్టుగా పడ్డాయి. ఫలితంగా కొందరు ప్రయాణికులకు గాయాలయ్యాయి. చివరికి- ఈ విమానం సురక్షితంగా నేలకు దిగడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఎయిరిండియా విమానం ఈ తరహా ఈదురుగాలుల బారిన పడటం వారం రోజుల వ్యవధిలో ఇది రెండోసారి.
ఎయిరిండియాకు చెందిన ఏఐ-467 రకం విమానం శనివారం సాయంత్రం 7:28 నిమిషాలకు ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి విజయవాడకు బయలుదేరింది. సుమారు 135 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. నిర్దేశిత సమయం ప్రకారం.. రాత్రి 9:40 నిమిషాలకు అది గన్నవరం విమానాశ్రయంలో దిగాల్సి ఉంది. టేకాఫ్ తీసుకున్న సుమారు గంట తరువాత.. విమానం ఉరుములతో కూడిన ఈదురుగాలుల మధ్య చిక్కుకుంది. ప్రచండ గాలులు విమానాన్ని అల్లకల్లోలానికి గురి చేశాయి. ఫలితంగా విమానంలోని వస్తువులు చెల్లా చెదురు అయ్యాయి. బాత్ రూమ్ మూత సైతం విరిగి పడింది.
భోజనం చేసే ప్లేట్లు మీద పడటంతో కొందరు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. చివరికి విమానం సురక్షితంగా గన్నవరం విమానాశ్రయంలో దిగడంతో వారంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనపై ఎయిరిండియా విమానయాన సంస్థ యాజమాన్యం విచారణకు ఆదేశించింది. రెండు రోజుల కిందటే కోచి-తిరువనంతపురం విమాన ప్రయాణికులు కూడా ఇదే తరహా అనుభవాన్ని ఎదుర్కొన్నారు. కోచి నుంచి తిరువనంతపురానికి బయలుదేరిన ఎయిరిండియా విమానం గగనతలంలో ఈదురుగాలుల మధ్య చిక్కుకుంది. కొన్ని క్షణాల పాటే ఊగిపోయింది. ఈ ఘటనలో ప్రయాణికులు సురక్షితంగా బయటపడగలిగారు.