తొలి విడత వ్యాక్సిన్ అందుకునే రాష్ట్రాల జాబితా ఇదే: ఏపీ, తెలంగాణ పరిస్థితేంటీ?
విజయవాడ: ప్రాణాంతక కరోనా వైరస్ మహమ్మారిని నిర్మూలించడానికి కేంద్ర ప్రభుత్వం వ్యాక్సినేషన్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. కొద్దిసేపటి కిందటే ఈ ప్రక్రియను ప్రారంభించింది. ఇందులో భాగంగా- కరోనా వ్యాక్సిన్లను రాష్ట్రాలకు చేరవేస్తోంది. తొలివిడతలో 13 రాష్ట్రాలను దీనికోసం ఎంపిక చేసింది. మహారాష్ట్ర పుణేలోని సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా కంపెనీ నుంచి వ్యాక్సిన్ల తరలింపు ఈ తెల్లవారుు జామున ఆరంభమైంది. ఈ రోజంతా వ్యాక్సిన్ల తరలింపు కార్యక్రమం కొనసాగుతోంది.
వ్యాక్సిన్ డోసులను అందుకునే 13 నగరాల జాబితాను కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఏపీ, తెలంగాణ సహా 13 రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలకు వ్యాక్సిన్ అందబోతోంది. ఆంధ్రప్రదేశ్-విజయవాడ, తెలంగాణ-హైదరాబాద్, పశ్చిమ బెంగాల్-కోల్కత, ఢిల్లీ, తమిళనాడు-చెన్నై, అస్సాం-గువాహటి, మేఘాలయా-షిల్లాంగ్, గుజరాత్-అహ్మదాబాద్, ఒడిశా-భువనేశ్వర్, బిహార్-పాట్నా, కర్ణాటక-బెంగళూరు, ఉత్తర ప్రదేశ్-లక్నో, చండీగఢ్లకు వ్యాక్సిన్లను సరఫరా చేస్తున్నామని తెలిపింది.
దీనికోసం ఎయిరిండియా, స్పైస్జెట్, ఇండిగో ఎయిర్లైన్స్లకు చెందిన ప్రత్యేక కార్గో విమానాలను వినియోగిస్తున్నామని విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురీ తెలిపారు. ఈ ఒక్కరోజులో ఆయా నగరాలకు వ్యాక్సిన్ అందుతుందని చెప్పారు. మొత్తం 56.5 లక్షల డోసుల వ్యాక్సిన్లను చేరవేస్తామని పేర్కొన్నారు. ఈ నెల 16వ తేదీన వ్యాక్సినేషన్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన విషయాన్ని ఆయన పునరుద్ఘాటించారు. విమానాశ్రయాల నుంచి వ్యాక్సినేషన్ సెంటర్లకు వాటిని తరలించాల్సిన బాధ్యతను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయ పరచుకుంటున్నాయని స్పష్టం చేశారు.
Recommended Video
తొలి విడత వ్యాక్సిన్ హెల్త్ వర్కర్లకు అందిస్తారు. డాక్టర్లు, నర్సులు, ఇతర ప్రాథమిక ఆరోగ్య కార్యకర్తలను ఈ జాబితాలోకి చేర్చారు. తెలంగాణలో సుమారు 2.90 లక్షల మంది హెల్త్ వర్కర్లకు వ్యాక్సిన్ అందబోతోంది. హెల్త్ వర్కర్లకు తొలి విడత డోస్ ఇచ్చిన నాలుగు వారాల అనంతరం ఇతర ఫ్రంట్లైన్ వర్కర్లకు వ్యాక్సిన్ వేస్తారు. పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులను ఈ జాబితాలోకి తీసుకొచ్చారు. అనంతరం 50 సంవత్సరాల వయస్సు పైనున్న వారికి వ్యాక్సిన్ ఇస్తారు. దీనికి అనుగుణంగా తెలంగాణకు వ్యాక్సిన్ డోసులను కేంద్ర ప్రభుత్వం పంపిణీ చేస్తుంది.