ఆలస్యం: విమానంలోనే అశోక్ గజపతి రాజుకు నిలదీత, మంత్రి ఆగ్రహం
Recommended Video
విజయవాడ: ఎయిర్ ఇండియా విమానయాన సంస్థ మరోసారి వివాదాల్లోకి ఎక్కింది. సిబ్బంది రాకపోవడంతో బుధవారం విమానం గంటన్నర ఆలస్యంగా బయలుదేరింది. ఆ సమయంలో విమానంలో కేంద్రమంత్రి అశోక్ గజపతి రాజు కూడా ఉన్నారు. ఈ ఘటనపై అశోక్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఢిల్లీ నుంచి విజయవాడ వెళ్లాల్సిన ఆ విమానం బుధవారం గంటన్నర ఆలస్యంగా బయల్దేరింది. షెడ్యూల్ ప్రకారం ఉదయం ఆరు గంటలకు ఆ విమానం బయలుదేరాల్సి ఉంది. ప్రయాణీకులు అందరూ తమ సీట్లలో కూర్చున్నారు.
ప్రయాణీకుల ఆగ్రహం, విమానంలోనే అశోక్ చుట్టుముట్టి
అయితే పైలట్, సిబ్బంది సమయానికి రాకపోవడంతో ఆలస్యమైంది. ప్రయాణికులు ఆగ్రహానికి గురయ్యారు. అదే విమానంలో ఉన్న అశోక్ గజపతిరాజును చుట్టుముట్టి ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో కేంద్రమంత్రి వెంటనే ఎయిర్ ఇండియా చీఫ్ ప్రదీప్ ఖరోలాకు ఫోన్ చేశారు. ఆలస్యంపై ఆరా తీశారు.
మంచు కారణంగా ఆలస్యం
అయితే మంచు ఎక్కువగా ఉండటంతో విమానాన్ని ఆపినట్లు ఎయిర్ ఇండియా అధికారులు తొలుత చెప్పినట్లుగా తెలుస్తోంది. ఈ విషయాన్ని గ్రౌండ్ సిబ్బందికి చెప్పడం ఆలస్యమైందని, దీంతో వారు ప్రయాణికులను ఎక్కించుకున్నారని చెప్పారు. అంతేగాక భద్రతా తనిఖీల కారణంగా పైలట్ కూడా 15 నిమిషాలు ఆలస్యంగా వచ్చినట్లు వెల్లడించారు.
వెంటనే చర్యలు
ఘటనపై చర్యలు చేపట్టామని ఎయిర్ ఇండియా అధికార ప్రతినిధి తెలిపారు. సమాచారాన్ని చేరవేయడంలో అలసత్వం ప్రదర్శించిన ముగ్గురు సిబ్బందిని సస్పెండ్ చేశామని, పైలట్ను హెచ్చరించినట్లు చెప్పారు.
ముందే బయలుదేరుతుందనుకొని
విమానయాన అధికారులు ఆరు గంటలకు విమానం బయలుదేరుతుందని భావించి అంతకుముందు నుంచే బోర్డింగ్ ప్రారంభించారు. కాగా, ఇటీవల వరుసగా ఎయిర్ ఇండియా వివాదాల్లో చిక్కుకుంటున్న విషయం తెలిసిందే.