ఎయిర్ షోకు నిరాకరణ, ఏపిని దేశంలో భాగంగా చూడటం లేదు : సాధింపులో భాగమే..
విశాఖ ఉత్సవాల్లో భాగంగా ప్రారంభం కావాల్సిన ఎయిర్ షో రద్దయింది. విశాఖ తీరంలో 9 యుద్ద విమానాలతో 90 మంది నావికా సిబ్బందితో ఏర్పాటు చేయాలనుకున్న ఎయిర్ షోకు కేంద్రం నుంచి అనుమతులు రాకపోవడంతో కార్యక్రమాన్ని రద్దు చేయాల్సి వచ్చిందని అధికారులు తెలిపారు. అయితే, ముఖ్యమంత్రి..టిడిపి ఎంపీలు మాత్రం ఇది కేంద్ర సాధింపు లో భాగమేనని విమర్శిస్తున్నారు..
విశాఖ ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన ఎయిర్ షో రద్దు చేస్తూ కేంద్రం నిర్ణయించింది. నిర్ణీత సమయానికి ఏర్పాట్లు చేయకపోవడం, సమన్వయ లోపాలే కేంద్రం నుంచి అనుమతులు రాకపోవడానికి ముఖ్య కారణంగా కనిపిస్తున్నాయి. గత వారం ఎయిర్ షో నిర్వాహకులు విశాఖపట్నం వచ్చి ఆర్కే బీచ్, ఇతర ప్రాంతాలను పరిశీలించి నిర్వహణ ఏర్పాట్లను పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వం అనుమతి కోరుతూ రక్షణ శాఖకు లేఖ పంపినప్పటికీ సమయం మించి పోవడంతో కేంద్రం అనుమతి నిరాకరించినట్లు తెలుస్తోంది. అయితే, ముందుగానే కేంద్రం ఈ మేరకు సమాచారం ఇవ్వాల్సి ఉందని ఏపి అధికారులు భావిస్తున్నారు. కానీ, రాజకీయంగా మాత్రం ఇది దుమారం రేగుతోంది..
ఇదే అంశం పై ముఖ్యమంత్రి చంద్రబాబు ఫైర్ అయ్యారు. ఏపీని దేశంలో భాగంగా కేంద్రం చూడటం లేదని చంద్రబాబు ఆరోపించారు. విశాఖ ఉత్సవ్లో ఎయిర్ షో నిర్వహించనివ్వకుండా అడ్డుకున్నారని, విశాఖ ఉత్సవ్లో ఎయిర్ షో ట్రైల్స్ తర్వాత రద్దు చేశారని విమర్శించారు. ఇదే అంశంపై టీడీపీ ఎంపీలు కూడా కేంద్రం తీరును తప్పుబట్టారు. కక్ష సాధింపులో భాగంగా మరోసారి ఎయిర్ ఫోర్స్ విన్యాసాలను ఆపేశారని టీడీపీ ఎంపీ మురళీమోహన్ ఆరోపించారు. గతంలో కూడా విరాట్ షిప్ విషయంలో కేంద్రం పక్షపాతంగా వ్యవహరించిందని, ఈ షిప్ను ఏపీకి కేటాయించాలని మూడు నెలల క్రితమే దరఖాస్తు చేస్తే, మహారాష్ట్రకు కేటాయించారని టీడీపీ ఎంపీలు ఆరోపించారు. కేంద్రం తాము అన్ని రకాల వివరణలు ఇచ్చామని చెబుతోంది.