విశాఖ నుంచి కోల్కతాకు...అందుబాటులోకి మరో విమాన సర్వీసు
విశాఖపట్టణం: వివాఖ నుంచి ప్రయాణికులకు మరో నూతన విమాన సర్వీసు అందుబాటులోకి రానుంది. ఎయిర్ ఏషియా కలకత్తా నగరానికి ఈ కొత్త సర్వీసులను ప్రారంభిస్తోంది. ఈ నెల 11 నుంచి ఇవి అందుబాటులోకి వస్తాయని తెలిసింది.
ప్రస్తుతం విశాఖ నుంచి ఎవరైనా విమాన ప్రయాణం ద్వారా కోల్కతా వెళ్లాలంటే ఇండిగో సర్వీసు ఒక్కటే అందుబాటులో ఉంది. ఆ విమానం సర్వీసు కూడా మధ్యాహ్న సమయంలో ఉండడంతో ఎక్కువమందికి ప్రయోజనకరంగా లేదని, ముఖ్యంగా వ్యాపార వర్గాలకు ఈ ఫ్లైట్ వేళలు అసలు అనుకూలంగా లేవని చాలాకాలంగా వాదనలు వినిపిస్తున్నాయి.
కొత్త సర్వీస్...కోల్ కతాకు
ఈ విషయం తమ దృష్టికి రావడంతో దీనిప బాగా యోచించిన ఎయిర్ ఏసియా అందరికీ అనువైన సమయాల్లో మరో సర్వీసును ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఆ మేరకు చకచకా ఏర్పాట్లు పూర్తి చేసి కొత్త సర్వీసు ప్రారంభం తేదీ కూడా ప్రకటించేయడంతో దీనికి సంబంధించి ఇప్పటికే బుకింగ్లు కూడా జరుగుతున్నట్లు సమాచారం. ఈ కొత్త సర్వీసు కోల్కతాలో ఉదయం 5:10 గంటలకు బయలుదేరి 6:45 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుందని, తిరిగి ఉదయం 7.10 గంటలకు ఇక్కడి నుంచి బయల్దేరి 8.35 గంటలకు కోల్కతా చేరుతుందని తెలిసింది.
ప్రయాణికుల...హర్షం
దీంతో ఈ విమానం సమయాలు వ్యాపార, అధికార వర్గాలకు చాలా అనుకూలంగా ఉంటుందని ఎయిర్ ఏషియా భావించినట్లే ఆయా వర్గాల నుంచి ఈ విమానం ఏర్పాటుపై హర్షం వ్యక్తం అవుతున్నట్లు సమాచారం. ఈ విమానం వల్ల మరో ప్రయోజనం కూడా సిద్దించిందని విమాన ప్రయాణికులు సంతోషపడుతున్నారట. ప్రస్తుతం విశాఖపట్నం నుంచి నేరుగా బ్యాంకాక్ వెళ్లడానికి విమానాలు లేవు. అందువల్ల చాలా మంది హైదరాబాద్ కు వెళ్లి అక్కడి నుంచి వేరే విమానాల్లో బ్యాంకాక్కు వెళ్తున్నారు. దానికి వ్యయంతో పాటు సమయం కూడా ఎక్కువ పడుతోంది.
బ్యాంకాక్ టూర్ ...సో ఈజీ
ఇపుడు కోల్కతాకు తెల్లవారు జామున విమాన సర్వీసు అందుబాటులోకి రావడంతో విశాఖ నుంచి కోల్కతాకు గంటన్నరలో వెళ్లిపోతే, అక్కడి నుంచి బ్యాంకాక్కు మరో గంటన్నరలో చేరిపోవచ్చు. పైగా కోల్కతా నుంచి బ్యాంకాక్కు విమాన సర్వీసులు ఎక్కువగా ఉన్నాయి. దీంతో మూడు నాలుగు గంటల వ్యవధిలోనే బ్యాంకాక్ కు చేరుకునే అవకాశం లభించిందనేది విశాఖ వాసుల సంతోషం. అలాగే తక్కువ ఖర్చుతోనే బ్యాంకాక్ వెళ్లాలనుకునేవారు ఇప్పుడైతే ముందుగా రైలులో కోల్కతా వెళ్లి, అక్కడి నుంచి బ్యాంకాక్ విమానం ఎక్కుతున్నారు. ఇదంతా డబ్బు ఆదా చేసేందుకే...అయితే ఇలాంటి వారికి రైలు ప్రయాణంలో ఒక రోజందా గడిచిపోతూ సమయం చాలా వృధా అవుతోంది. అయితే ఇపుడు కొత్తగా ప్రారంభించిన ఎయిర్ ఏషియా కొత్త సర్వీసు టికెట్ కూడా ముందుగా బుక్ చేసుకుంటే రూ.3వేలకే లభ్యమవుతోంది, అలాగే దీనివల్ల సమయం కూడా బాగా కలిసి వస్తుంది.
బి దేశాలు...ఈశాన్య రాష్ట్రాలు
ఇక విశాఖ నుంచి కోల్ కతా కనెక్టవిటీ ఫ్లైట్ వల్ల ఒక్క బ్యాంకాక్ మాత్రమే కాకుండా కోల్కతా నుంచి భూటాన్, బంగ్లాదేశ్లకు కనెక్టివిటీ ఏర్పడుతోంది. విశాఖలో ఈ విమానం ద్వారా ఏడు గంటలకు బయల్దేరితే మూడు బి దేశాలు బ్యాంకాక్, భూటాన్, బంగ్లాదేశ్ లకు ఎక్కడికైనా కలకత్తా మీదుగా 10 గంటల వ్యవధిలోనే వెళ్లిపోవచ్చు. ఈ విధంగా పర్యాటకులకు ఎయిర్ ఏషియా సర్వీసులు బాగా ఉపయోగపడనున్నాయి. మరోవైపు కోల్కతాకు ఎయిర్ ఏషియా ప్రవేశ పెట్టే ఈ విమాన సర్వీసు వల్ల ఈశాన్య రాష్ట్రాలకు కూడా మంచి కనెక్టివిటీ లభించనుంది. టీ తోటలు ఎక్కువగా ఉండే అసోం, డెహ్రాడూన్ వంటి ప్రాంతాలకు చాలా తక్కువ సమయంలో వెళ్లి రావచ్చని విశాఖ నుంచి తరుచూ విమాన ప్రయాణాలు చేసే ట్రావెలర్స్ చెబుతున్నారు.