జూనియన్ లైన్ ఉద్యోగాల పేరుతో మోసం, తన పేరుతో చీట్..? డీజీపీకి అజేయ కల్లాం ఫిర్యాదు
ఐఏఎస్, ఐపీఎస్ పేర్లతో మోసాలు చేయడం చూశాం. తర్వాత కేటుగాళ్లు కూడా పట్టుబడ్డారు. అయితే సీఎం ముఖ్య సలహాదారు పేరుతో మోసాలు మాత్రం ఇప్పుడే వెలుగుచూశాయి. దీనిని అజేయ కల్లం సీరియస్గా తీసుకున్నారు. తన పేరుతో జరుగుతోన్న మోసాలపై విచారణ జరపాలని డీజీపీ గౌతమ్ సవాంగ్ను కోరారు. ఈ మేరకు ఆయన లేఖ రాశారు.
తన పేరుతో జరుగుతోన్న మోసాలపై నిగ్గు తేల్చాలని అజేయ కల్లాం ఫిర్యాదు చేశారు. మంగళగిరిలో ఓ గ్యాంగు తన పేరు చెబుతూ జూనియర్ లైన్ మన్ ఉద్యోగాలు ఇప్పిస్తామని డబ్బులు వసూలు చేస్తోందని, ఈ మేరకు వాట్సాప్లో మేసెజ్ సర్క్యులేట్ అవుతోందని తెలిపారు. నిరుద్యోగుల్లో నమ్మకం కలిగించేందుకు తన పేరు వాడుకుందని ఆరోపణలు వచ్చాయన్నారు. ఇందులో నిజనిజాలు తెలియడం లేదని అజేయ కల్లం పేర్కొన్నారు.
ఆ ఆరోపణలే నిజమని తేలితే నిరుద్యోగులను మోసం చేస్తోన్న వారిపై చర్యలు తీసుకోవాలని అజేయ కల్లం అన్నారు. లేదంటే ఆ సందేశాలు తప్పని తేలితే, ఫేక్ మెసేజ్ ఎవరు పంపారో తేల్చాలని కోరారు. వారిని గుర్తించి న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఈ అంశంపై తక్షణమే స్పందించి దర్యాప్తు ప్రారంభించాలని డీజీపీకి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు.