ఆసక్తికరం:సీఎం చంద్రబాబుతో ఆర్ఎల్డీ అధినేత అజిత్ సింగ్ భేటీ;మంత్రులేమన్నారంటే?...
అమరావతి:ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబుతో రాష్ట్రీయ లోక్ దళ్ అధినేత, మాజీ కేంద్ర మంత్రి అజిత్ సింగ్ భేటీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అమరావతిలోని సీఎం కార్యాలయంలో గురువారం చంద్రబాబుతో అజిత్ సింగ్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా ఇరువురు పలు కీలక అంశాలపై చర్చించినట్లు సమాచారం. అనంతరం అజిత్ సింగ్ ను సత్కరించిన చంద్రబాబు ఆయనకు బుద్దుడి జ్ఞాపికను బహూకరించారు. సిఎం చంద్రబాబును కలిసేందుకు వచ్చిన అజిత్ సింగ్ వెంట మాజీ ఎంపి యలమంచిలి శివాజీ కూడా ఉన్నారు. కేంద్రంలో ఎన్డీఏ కూటమికి వ్యతిరేకంగా ప్రాంతీయ పార్టీలను సమాయత్తం చేస్తున్న చంద్రబాబుతో ఆర్ఎల్డీ అధినేత అజిత్ సింగ్ భేటీ కావడం రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు, రాష్ట్రీయ లోకదళ్ నాయకుడు అజిత్ సింగ్ ల మధ్య సమావేశం సందర్భంగా దేశ రాజకీయాల గురించి విస్తృత చర్చ జరిగివుంటుందని అందరూ భావిస్తున్నారు. దీంతో ఈ భేటీ పై అమిత్ షా కూడా అరా తీసినట్లు తెలిసింది. అమరావతి దాకా వెళ్లి చంద్రబాబుని అజిత్ సింగ్ కలవాల్సిన అవసరం ఏముంది అంటూ అమిత్ షా ఆరా తీసినట్టు తెలుస్తోంది.
జాతీయ రాజకీయాల్లో గత రెండు నెలలుగా యాక్టివ్ గా వర్క్ చేస్తున్న చంద్రబాబు ఇప్పటికే 17 పార్టీలతో చర్చించారు. వారం కిందటే కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి విజయవాడ వచ్చి చంద్రబాబుతో భేటీ అయిన సంగతి తెలిసిందే. వారిరువురూ కూడా ప్రధానంగా జాతీయ రాజకీయాలపైనే చర్చించినట్లు తెలిసింది. అయితే ఇదే క్రమంలో ఇప్పుడు ఆర్ఎల్డీ నాయకుడు అజిత్ సింగ్ అమరావతి రావటంతో సిఎం చంద్రబాబు భేటీలు చర్చనీయాంశంగా మారాయి.
ఇదిలావుంటే తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీతో టీడీపీ పొత్తు పెట్టకోబోతోందన్న ప్రచారంపై మంత్రి పితాని మీడియాతో చిట్ చాట్ సందర్భంగా ఒక కీలక విషయాన్ని వెల్లడించారు. పొత్తుల అంశంపై గురువారం రాత్రి 11 గంటల వరకు మంత్రుల సమావేశం జరిగిందని...నేతలందరికీ సీఎం చంద్రబాబు ఒక డైరెక్షన్ ఇచ్చారని ఆయన వ్యాఖ్యానించారు.
అయితే టీడీపీ ఏ పార్టీతో పొత్తు పెట్టుకోవాలో పూర్తి నిర్ణయాధికారం అధ్యక్షుడికే వదిలేశామని పితాని స్పష్టం చేశారు. అలాగే మరోమంత్రి యనమల తెలంగాణాలో ముందస్తు ఎన్నికల విషయమై మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతుండటంతోనే కేసీఆర్ ముందస్తుకు వెళ్లినట్లు అనిపిస్తోందని అభిప్రాయపడ్డారు.