వైఎస్ జగన్ హయాంలో తొలి గ్రాఫిక్ డిజైన్లు: విజయవాడలో అదే హైలైట్: చంద్రబాబు పాలన తరహాలోనేనా?
విజయవాడ: విజయవాడలో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన అజిత్సింగ్ నగర్ మోడల్ పార్క్నకు సంబంధించిన త్రీడీ గ్రాఫిక్ డిజైన్లు విడుదల అయ్యాయి. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు గురువారం ఉదయం వాటిని విడుదల చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో విడుదలైన తొలి గ్రాఫిక్ డిజైన్లు ఇవే. ఇదివరకు చంద్రబాబు ప్రభుత్వం రాజధాని అమరావతి నిర్మాణానికి సంబంధించిన పలు గ్రాఫిక్ డిజైన్లను విడుదల చేసింది.
ఏపీలో ఆరోగ్యశ్రీ కింద కరోనా ట్రీట్మెంట్: ప్రైవేటు ఆసుపత్రుల్లోనూ వైద్యం: రేట్ ఫిక్స్
నాడు అమరావతి గ్రాఫిక్స్
అదే తరహాలో వైఎస్ జగన్ ప్రభుత్వం మొదటిసారిగా అజిత్సింగ్ నగర్ మోడల్ పార్కునకు సంబంధించిన గ్రాఫిక్ డిజైన్లు విడుదల అయ్యాయి. చంద్రబాబు హయాంలో విడుదలైన గ్రాఫిక్ డిజైన్లపై అప్పట్లో ప్రతిపక్ష హోదాలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పలు విమర్శలను గుప్పించారు. అమరావతి నిర్మాణానికి సంబంధించిన గ్రాఫిక్ డిజైన్లతో తెలుగుదేశం ప్రభుత్వం కాలయాపన చేస్తోందంటూ ఆరోపణలను సంధించారు.
ప్రతిపక్ష హోదాలో విమర్శలు..
అప్పట్లో సింగపూర్ సహా పలు అంతర్జాతీయ సంస్థలు అమరావతి నిర్మాణానికి సంబంధించిన డిజైన్లను రూపొందించాయి. గ్రాఫిక్ డిజైన్ల కోసమే అప్పట్లో వందల కోట్ల రూపాయలను టీడీపీ ప్రభుత్వం వృధాగా ఖర్చు పెట్టిందంటూ ప్రతిపక్ష హోదాలో వైసీపీ నేతలు చంద్రబాబు ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన సందర్భాలు చాలా ఉన్నాయి. సోషల్ మీడియాలో సైతం నాటి గ్రాఫిక్ డిజైన్లపై సెటైర్లు సంధించారు. తాజాగా అదే తరహాలో జగన్ ప్రభుత్వంలో కూడా ఇలాంటి నమూనాలు విడుదల అయ్యాయి.
మోడల్ పార్కు 3డీ ఇమేజ్
నిజానికి- ఏదైనా ఓ ప్రాజెక్టును చేపట్టినప్పుడు వాటి నమూనా ఎలా ఉండాలనే విషయంపై ఈ డిజైన్లను తయారు చేయడం సహజం. అందులో భాగంగానే - విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు.. తాము కొత్తగా నిర్మించబోతోన్న అజిత్సింగ్ నగర్ మోడల్ పార్కు త్రీడీ ఇమేజీలను రూపొందించారు. కొత్తగా రూపుదిద్దుకోబోయే పార్కు ఇలా ఉండబోతోందంటూ వెల్లడించారు. ఈ పార్కు అభివృద్ధి పనులకు సంబంధింని కాంట్రాక్టును రాష్ట్రానికి చెందిన సంస్థలే చేపట్టినట్లు తెలుస్తోంది.
10 కోెట్ల రూపాయల వ్యయంతో..
అజిత్సింగ్ నగర్ మోడల్ పార్కు నిర్మాణ పనులకు మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఈ నెల 6వ తేదీన శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. మొత్తం 10 కోట్ల రూపాయల వ్యయంతో ఈ పార్కు నిర్మాణ పనులను చేపట్టబోతున్నారు. ఇందులో అమ్యూజ్మెంట్ పార్కు, ప్లాంట్ నర్సరీ జోన్, స్పోర్ట్స్ జోన్, ఎకొలాజికల్ మ్యూజియం, వాకింగ్ ట్రాక్, చిల్డ్రన్స్ ప్లే జోన్ వంటి సౌకర్యాలను నిర్మించబోతున్నారు. విజయవాడకు తలమానికంలా ఈ పార్కును అభివృద్ధి చేయబోతున్నట్లు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు చెబుతున్నారు.