ఎన్టీఆర్వల్లే: ఎర్రబెల్లి, ఎలా చనిపోయారని అక్బర్ కౌంటర్
హైదరాబాద్: శంషాబాద్ విమానాశ్రయ టెర్మినల్కు స్వర్గీయ నందమూరి తారక రామారావు పెట్టడం పైన తెలంగాణ రాష్ట్ర శాసన సభలో చర్చ సాగుతోంది. శుక్రవారం తొలిసారి సభ వాయిదా పడి, తిరిగి ప్రారంభమైంది. ఈ సందర్భంగా టీడీపీ సభ్యుడు ఎర్రబెల్లి దయాకర రావు మాట్లాడారు.
తమ పార్టీ అధ్యక్షులు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలంగాణ ప్రాంత నేత పీవీ నర్సింహారావుకు ఢిల్లీలో ఘాట్ కట్టించాలని లేఖ రాశారన్నారు. పీవీకి సరైన ప్రాధాన్యత దక్కలేదని తొలుత చెప్పిందే తామన్నారు. తెరాస ఎప్పుడైన పీవీ గురించి లేఖ రాసిందా అని ప్రశ్నించారు. దానికి కేసీఆర్ స్పందిస్తూ.. తాము ప్రధానికి లేఖ రాశామన్నారు.
అనంతరం ఎర్రబెల్లి మాట్లాడుతూ.. ఢిల్లీలో పీవీ ఘాట్ గురించి పట్టుబడించి చంద్రబాబే అన్నారు. విమానాశ్రయం టెర్నినల్కు ఎన్టీఆర్ పేరు పెట్టినందుకు తాము సంతోషిస్తున్నామన్నారు. అలాగే విమానాశ్రయానికి పీవీ నర్సింహారావు పేరు పెడతామంటే తాము పూర్తిగా మద్దతిస్తామన్నారు. విమానాశ్రయానికి గతంలో ఎన్టీఆర్ పేరే ఉండేదన్నారు. అదే పేరు కొనసాగించేందుకు కేంద్రం నిర్ణయం తీసుకోవడం సంతోషించదగ్గ విషయమన్నారు.
తెలంగాణ ప్రయోజనాలను కాపాడింది ఎన్టీఆరే అన్నారు. 610 జీవో తెచ్చింది అతడే అన్నారు. టెర్నినల్కు ఎన్టీఆర్ పేరు పెట్టినట్లే, ఇంటర్నేషనల్ టెర్నినల్కు పీవీ పేరు పెట్టాలన్నారు. రాజకీయాలు ఏమైనా ఉంటే బయట చూసుకుందామని చెప్పారు.
విపక్షాలకు సమయమివ్వడం లేదు
అధికార పార్టీ విపక్షాలకు సమయం ఇవ్వడం లేదని బీజేపీ నేత డాక్టర్ కే లక్ష్మణ్ అన్నారు. ప్రతిపక్షాలకు ఎప్పుడు సమయం ఇవ్వకుండా.. ఇవాళ మాత్రం జీవన్ రెడ్డికి మాత్రం ఇచ్చారన్నారు. తమ గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారన్నారు. తమకు మాట్లాడే అవకాశం ఇవ్వకుంటే ఎలా అన్నారు. సభను సజావుగా జరపాలనే బాధ్యత తెరాసకు ఉండాలన్నారు.
ఎన్టీఆర్ చావుకు కారకులెవరో చెప్పలేదు
ఎన్టీఆర్ గురించి ఎర్రబెల్లి దయాకర రావు బాగా చెప్పారని, కానీ ఆయన మరణానికి కారకులు ఎవరె చెప్పలేదన్నారు. ఎన్టీఆర్ గొప్ప నాయకుడే కానీ, ఆయన ఎలా చనిపోయారో చెప్పాలన్నారు. విమానాశ్రయం పేరు మార్చాలనుకుంటే రాష్ట్ర ప్రభత్వాన్ని సంప్రదించాలని, అన్ని పార్టీల అభిప్రాయాలు కేంద్రం తీసుకోవాలన్నారు.
ఏపీ కుట్ర: తాటి వెంకటేశ్వర్లు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కుట్ర చేస్తోందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యుడు తాటి వెంకటేశ్వర్లు అన్నారు. ఏపీలో టీడీపీ అధికారంలోకి వచ్చిందని, అక్కడ కొత్తగా విమానాశ్రయాలు, బస్టాండులు, ప్రాజెక్టులు కట్టి ఎన్టీఆర్ పేరు పెట్టుకోవచ్చన్నారు. తెలంగాణ వచ్చిన సంతోషంలో ఉంటే ఇప్పుడు ఇదేమిటన్నారు.
మేమే మార్చుకున్నాం
తామే విశాలాంద్ర పత్రికను నవ తెలంగాణ పత్రికగా మార్చుకున్నామని, ప్రజల మనోభావాలకు అనుగుణంగా మారామని కమ్యూనిస్టు పార్టీల సభ్యులు చెప్పారు. ప్రభుత్వంతో చర్చించకుండా ఈ పేరు పెట్టడం సరికాదన్నారు. తెలంగాణ సాయుధ పోరాటంలో పని చేసిన కొమురం భీమ్ తదితరుల పేర్లు పెట్టవచ్చునన్నారు.