రాష్ట్ర పరిస్థితిపై అక్బర్ నిలదీత, లెక్క చెప్పిన కేసీఆర్, కిషన్ రెడ్డి నిప్పులు
హైదరాబాద్: రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పైన ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని మజ్లిస్ పార్టీ శాసన సభా పక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ శుక్రవారం శాసన సభలో డిమాండ్ చేశారు. ప్రస్తుత ఆర్థిక పరిస్థితి పైన ప్రభుత్వం ఎదుట శ్వేతపత్రం ఉంచాలన్నారు. మైనార్టీల సంక్షేమం కోసం 11 శాతం నిధులను మాత్రమే కేటాయించాలన్నారు. బంజారాహిల్స్లో బంజారా భవన్లు నిర్మించడాన్ని స్వాగతిస్తామన్నారు. దళితులు, బంజారాల అభివృద్ధి కోసం ప్రభుత్వం కృషి చేయాలన్నారు.
ప్రభుత్వంపై కిషన్ రెడ్డి నిప్పులు
శాసనసభలో ఆరోపణలు చేసిన సభ్యుడిని మాట్లాడనివ్వకపోవడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే అన్ని భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు, అంబర్ పేట శాసన సభ్యులు కిషన్ రెడ్డి అన్నారు. శాసనసభలో ద్రవ్యవినిమయ బిల్లుపై చర్చలో భాగంగా ఆయన మాట్లాడారు.
ఎమ్మెల్యేల హక్కులను కాపాడాల్సిన బాధ్యత సభాపతిదే అన్నారు. మహారాష్ట్రలో గవర్నర్పై దాడి జరిగిందని, ఇక్కడ అలాంటి పరిస్థితి లేదన్నారు. ఆరోపణలను ఖండించాలి తప్ప సభ్యుల గొంతు నొక్కడం సరికాదన్నారు. తెలంగాణలో మీడియాపై దాడులు పెరిగిపోయాయని, గ్రామస్థాయిలోనూ మీడియా ప్రతినిధులపై దాడులు జరుగుతున్నాయన్నారు.
మీడియాను గౌరవించాల్సిన అవసరం ఉందన్నారు. తప్పు చేస్తే కఠిన చర్యలు తీసుకోవచ్చన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగులు, విద్యార్థులు సహా సకల జనులు పాల్గొన్నారన్నారు. అయితే, ఆవిర్భావ వేడుకలకు కనీసం బీజేపీని ఆహ్వానించలేదన్నారు. పాలకులు తెలిసి కొన్ని, తెలియక కొన్ని తప్పులు చేస్తున్నారన్నారు.
బోధన రుసుములు వస్తాయో రావోనని విద్యార్థులు ఆందోళనతో ఉన్నారన్నారు. దీనికి తోడు ప్రతి అంశంలో ప్రభుత్వం ఎదురు దాడికి దిగుతోందన్నారు. రాష్ట్ర సాధనలో తెలంగాణ రాజకీయ ఐకాస కీలక పాత్ర పోషించిందని, ఉద్యమంలో కీలకమైన ఓయు విద్యార్థుల పైన ఇఫ్పుడు కేసులు పెడుతున్నారని, జైలుకు పంపిస్తున్నారని మండిపడ్డారు.
సమగ్ర సర్వే వల్ల వచ్చిన ఫలితం ఎవరికీ తెలియదన్నారు. మెదక్ జిల్లాలో రైతులు ఆందోళన చేస్తే వారిని కొట్టించాల్సిన అవసరం ఏమొచ్చిందని నిలదీసినంత పని చేశారు. యువత ఆత్మత్యాగాల వల్లనే తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నామని, దీనిని అందరు గుర్తించాలన్నారు. కాగా, టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిని తెరాస మాట్లాడకుండా అడ్డుకుంటున్నదని టీడీపీ ఆరోపిస్తున్న విషయం తెలిసిందే.
ఆదాయ వివరాలు వెల్లడించిన కేసీఆర్
తెలంగాణ ఆదాయ వివరాలను శాసనసభలో కేసీఆర్ వెల్లడించారు. గత ఆరు నెలల కాలంలో రాష్ట్ర ఆదాయం రూ.25,947 కోట్లు అని తెలిపారు. ఇందులో ట్యాక్స్ ఆదాయం రూ.15,101 కోట్లు, పన్నేతర రెవెన్యూ ఆదాయం రూ.1,273 కోట్లు, సెంట్రల్ ట్యాక్స్ రెవెన్యూ రూ.3,969 కోట్లు, కేంద్రం నుంచి వచ్చిన గ్రాంట్లు రూ.2,514 కోట్లు, ఇతరములు రూ. 288 కోట్లు అని వెల్లడించారు.
రిజర్వ్ బ్యాంక్లో ఉన్న మొత్తం రూ.5 వేల కోట్లన్నారు. రాష్ట్రానికి ఉన్న అప్పులు రూ.2,800 కోట్లు అని చెప్పారు. పంపకాల్లో భాగంగా జూన్2, 2014న మిగులు నిల్వ కింద తెలంగాణకు రూ.2,544 కోట్లు వచ్చిందని కేసీఆర్ చెప్పారు. వచ్చే బడ్జెట్లో లెక్కలపై మరింత స్పష్టత ఇస్తామని చెప్పారు. కాగా, శుక్రవారం ద్రవ్య వినిమయ బిల్లుకు శాసన సభ ఆమోదం తెలిపింది.