అయ్యో అఖిలక్క.. అయ్యావా అడకత్తెరలో పోకచెక్క..! ఏంటీ తమరి రాజకీయ లెక్క..!!
కర్నూలు/హైదరాబాద్ : రాజకీయాలు ఎప్పుడూ ఒకే రకంగా ఉండవు. ముఖ్యంగా రాజకీయాల్లో తానొకటి తలిస్తే జరిగేది మాత్రం మరోలా ఉంటుంది. మాజీ మంత్రి అఖిల ప్రియ విషయంలో అచ్చం ఇలాగే జరిగింది. కర్నూలు జిల్లా రాజకీయాల్లో భూమా కుటుంబానికి ప్రత్యేక స్థానం ఉంది. భూమా నాగిరెడ్డి దంపతుల మృతి తరువాత, ఆ కుటుంబ రాజకీయ పూర్వ వైభవం దాదాపుగా కనుమరుగైంది. ప్రస్తుతం, వారి వారసత్వంగా సంతానం మాత్రమే మిగిలారు.
ఆ దంపతుల స్థాయిలో నిలవగల రాజకీయ వారసులు మాత్రం లేరు. 2014లో వైసీపీ నుంచి గెలిచిన భూమా అఖిలప్రియ, టీడీపీలోకి జంప్ చేసినప్పుడు నాన్న నాగిరెడ్డి అండగా ఉన్నారు. ఆ తరువాత, ఆయన కూడా దూరమవడంతో అఖిలప్రియకు డౌన్ ఫాల్ మొదలైంది. ఇప్పుడు టీడీపీలో కొనసాగేందుకు అఖిలప్రియకు ఏమాత్రం ఇష్టంగా లేదట. అలా అని వైసీపీలోకి వెళ్దామనుకుంటే... తన శత్రు శేషమంతా అక్కడే ఉంది.
Recommended Video
గంగుల, ఇరిగెల కుటుంబాలు వైసీపీలో ఉన్నాయి. ఆ రెండు కుటుంబాలో భూమా కుటుంబానికి ఎప్పటి నుంచో బద్ధ శతృత్వం ఉంది. టీడీపీలో ఉండలేక, వైసీపీలోకి వెళ్లలేక సతమతమవుతున్న అఖిలప్రియకు బీజేపీ నుంచి ఆహ్వానం అందినట్టు చర్చ జరుగుతోంది.బాబాయి ఎస్వీ మోహన్ రెడ్డికి టిక్కెట్ విషయంలో చివరి నిమిషంలో టీడీపీ హ్యాండ్ ఇచ్చింది. దీంతో, ఆయన వైసీపీలో చేరారు. ఇక నంద్యాల విషయానికి వస్తే అక్కడున్న ఆదిపత్య పోరు జిల్లాలోని ఏ నియోజకవర్గంలో కనిపించదు. ముచ్చటగా మూడు వర్గాలతో నడుస్తున్న అక్కడి రాజకీయంలో ఓ వైపు బ్రహ్మానందరెడ్డి,మరో వైపు మాజీ మంత్రి ఫరూక్ ఇంకో వైపు ఏవీ సుబ్బారెడ్డి ఇలా అక్కడ కూడా బ్రహ్మానందరెడ్డి భవిష్యత్ పై క్లారిటీ లేకుండా పోయిందట.
ఇప్పుడు అఖిలప్రియ పరిస్థితి అయోమయంగా మారింది. టీడీపీలోనే ఉండాలా....? చూస్తూ... చూస్తూ... మునిగిపోతున్న నావ నుంచి బయటకు గెంతకుండా ఎలా ఉండాలి...? వైసీపీలోకి వెళ్లాలా...? చూస్తూ... చూస్తూ... శతృవుల పక్కకు ఎలా చేరేది...? బీజేపీలోకి వెళ్లాలా...? చూస్తూ... చూస్తూ... ఏమీ లేని బీజేపీలోకి వెళ్లి సాధించేదేమిటి...? అయ్యయ్యో... అఖిలమ్మకు ఎంత కష్టమొచ్చిందో పాపం....! ఏం చేస్తుందో చూడాలి మరి..!!