అఖిలప్రియకు ఇగో ఎక్కువ,విభేదాలు నిజమే:ఎవి సుబ్బారెడ్డి
విజయవాడ:మంత్రి అఖిలప్రియ, టిడిపి నేత ఎవి సుబ్బారెడ్డి మధ్య విభేదాలు మరోసారి తేటతెల్లంఅయ్యాయి. తనకు మంత్రి అఖిల ప్రియతో విభేదాలు ఉన్న విషయం వాస్తవమేనని ఎవి సుబ్బారెడ్డి కుండబద్దలు కొట్టారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ విషయం స్పష్టం చేశారు.
మంత్రి అఖిల ప్రియకు ఇగో ఎక్కువని, ఇగో ప్రాబ్లమ్స్ వల్లే అఖిల ప్రియ తనపై విమర్శలు చేస్తున్నారని ఎవి సుబ్బారెడ్డి వ్యాఖ్యానించారు. "ఆమె నన్ను గుంట నక్కతో పోల్చడం బాధాకరం...మంత్రి విమర్శలకు కాలమే సమాధానం చెబుతుంది. సీనియర్లను మంత్రి ఎందుకు దూరం పెడుతున్నారో అర్థం కావడం లేదు. నేను ఆళ్లగడ్డ నుంచి పోటీ చేయాలా? నంద్యాల నుంచి పోటీ చేయాలా? అన్న విషయం పార్టీ నిర్ణయిస్తుంది"...అని ఎవి సుబ్బారెడ్డి చెప్పారు.
మరోవైపు తనకు మంత్రి అఖిల ప్రియకు ఉన్న విభేదాల నేపథ్యంలో తనను సీఎం చంద్రబాబు ఆళ్లగడ్డ వెళ్లవద్దని చెప్పారని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని ఎవి సుబ్బారెడ్డి స్ఫష్టం చేశారు. ఆ వార్తలన్నీఅవాస్తవమని, చంద్రబాబు కేవలం తామందరూ కలిసి పనిచేయాలని మాత్రమే చెప్పారని ఆయన వెల్లడించారు.
తాను సీఎం చంద్రబాబు నాయుడు మాటకు కట్టుబడి ఉంటానని ఈ సందర్భంగా ఎవి సుబ్బారెడ్డి వెల్లడించారు. అఖిల ప్రియ తండ్రి భూమా నాగిరెడ్డి ఏ నిర్ణయం తీసుకున్నా తనతో చర్చించేవారని...కానీ అఖిలప్రియ నాతో చర్చించాల్సిన అవసరం లేదనుకుంటున్నారని సుబ్బారెడ్డి తెలిపారు. చంద్రబాబు సింగపూర్ నుంచి వచ్చాక మరోసారి ఆయనతో భేటీ అవుతానని ఎవి సుబ్బారెడ్డి చెబుతున్నారు. అయితే ఎవి సుబ్బారెడ్డి మరోసారి సిఎం చంద్రబాబును కలవాలని అనుకోవడం వెనుక ఏదో కారణం ఉండే ఉంటుందని, ఆ సమావేశం తరువాత ఆయన సంచలన విషయాన్ని వెల్లడించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.