నంద్యాల ఎఫెక్ట్: బాలకృష్ణకు 'వైసిపి' చిక్కులు, భూమా బ్రహ్మానందరెడ్డి ప్రతిజ్ఞ
నంద్యాల ప్రచారంలో బాలకృష్ణ బహిరంగంగా ఓటర్లకు డబ్బులు పంచి పెట్టారని వైసిపి ప్రధాన కార్యదర్శి శివకుమార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.దీనిపై చర్యలు తీసుకునేలా ఈసీని ఆదేశించాలని కోరారు.
నంద్యాల: నంద్యాల ప్రచారంలో హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ బహిరంగంగా ఓటర్లకు డబ్బులు పంచి పెట్టారని, దీనిపై చర్యలు తీసుకునేలా ఈసీని ఆదేశించాలని వైసిపి ప్రధాన కార్యదర్శి శివకుమార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్, నంద్యాల రిటర్నింగ్ అధికారి, బాలకృష్ణలను ఆయన ప్రతివాదులుగా చేర్చారు. ఓటర్లను ప్రలోభ పెట్టాలని బాలకృష్ణ చూశారని, డబ్బు పంచుతున్న దృశ్యాలు మీడియాలో వచ్చాయని తెలిపారు.
వీడియోలు, ఫోటోలు వచ్చాయి
టీవీ చానళ్లు వీడియోలు చూపగా, పత్రికలు ఫోటోలు ప్రచురించాయని, ఈ విషయమై ఇంతవరకూ కేసు నమోదు కాలేదని శివకుమార్ అందులో పేర్కొన్నారు. ఎన్నికల నియమావళికి వ్యతిరేకమైన ఈ ఘటనపై చర్యలు తీసుకోవాలని కోరారు.
డబ్బు పంపకంపై భన్వర్ లాల్ ఇలా
ఆధారాలతో సహా ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయలేదన్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యే కావడంతో అధికారులు పట్టించుకోవడం లేదన్నారు.కాగా, ప్రచారంలో బాలకృష్ణ పంచింది డబ్బు కాదని, కరపత్రాలు మాత్రమేనని కలెక్టర్ నుంచి తనకు నివేదిక అందినట్టు ఎన్నికల అధికారి భన్వర్ లాల్ ఇటీవల వెల్లడించారు.
అమ్మానాన్న
నంద్యాల ఉప ఎన్నికలో గెలిచిన టిడిపి అభ్యర్థి భూమా బ్రహ్మానంద రెడ్డితో కలసి మంత్రి అఖిలప్రియ మంగళవారం సాయంత్రం ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసంలో చంద్రబాబును కలిశారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. నంద్యాల ఉప ఎన్నికల్లో తన సోదరుడు భూమా బ్రహ్మానంద రెడ్డి గెలుపు ద్వారా తన తండ్రి నాగిరెడ్డిని మళ్లీ బతికించుకున్నట్లుగా భావిస్తున్నట్లు తెలిపారు. తనకు నంద్యాల తండ్రి, ఆళ్లగడ్డ అమ్మ వంటిదన్నారు. ఈ రెండు నియోజకవర్గాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నానని తెలిపారు.
శిల్పాకు అఖిలప్రియ డిమాండ్
నంద్యాల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటామన్న హామీకి శిల్పా సోదరులు కట్టుబడి ఉండాలని అఖిలప్రియ డిమాండ్ చేశారు. ఓటు ద్వారా తన తండ్రిని బతికించినందుకు నంద్యాల ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. టిడిపిలో ఒక వ్యక్తి చనిపోతే పార్టీ ఏవిధంగా ఆ కుటుంబాన్ని ఆదుకుంటుందో, అండగా ఉంటుందో చెప్పడానికి ఇదే నిదర్శనం అన్నారు. తమకు అందరూ అండగా నిలిచారన్నారు.
చంద్రబాబు ఆదేశం
కాగా, ఎన్నికలయ్యాక మంత్రులు మళ్లీ వస్తారా? రారా? అన్న ఆలోచన ప్రజల్లో రాకూడదని, వెంటనే నియోజకవర్గానికి వెళ్లి ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని చెప్పాలని, కలెక్టర్తో మాట్లాడి సమన్వయం చేసుకోమని ముఖ్యమంత్రి చంద్రబాబు.. అఖిలకు చెప్పారు.
బ్రహ్మానంద రెడ్డి ప్రతిజ్ఞ
నంద్యాల ప్రజలు తన బాబాయి నాగిరెడ్డిపై పెంచుకున్న ప్రేమాభిమానాల్ని ఓటు ద్వారా తెలియజేయడం చాలా సంతోషంగా ఉందని, బాబాయిలాగా తాను కూడా నంద్యాల ప్రజలకు అన్ని సమయాల్లో అండగా ఉంటామని బ్రహ్మానంద రెడ్డి చెప్పారు. పేదలకు 13 వేల ఇళ్లు కట్టించకపోతే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనన్నారు.