జగన్ లేదు.. పవన్ కళ్యాణ్ లేదు!: పార్టీ మారడంపై అఖిలప్రియ ఏమన్నారంటే?
ఆళ్లగడ్డ: కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ ఎమ్మెల్యే, మంత్రి భూమా అఖిలప్రియ పార్టీ మారుతారనే ప్రచారం జోరుగా సాగుతోన్న విషయం తెలిసిందే. ఆమె పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీలోకి వెళ్తారని ఎక్కువ మంది భావిస్తున్నారు. అలాగే, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లే అంశాన్ని కొట్టి పారేయలేమని సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది.
లోకేష్ సీఎం పదవి కోసం చంద్రబాబు ప్రయత్నాలు అవసరం లేదు, మోడీకి నేనొక్కడిని చాలు'
ఆమె తల్లిదండ్రులు ప్రజారాజ్యం పార్టీలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్తో, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు వైయస్ జగన్మోహన్ రెడ్డితో మంచి సంబంధాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆమె ఆ రెండు పార్టీల్లో ఏదోవైపు వెళ్తారని అంటున్నారు. దీనిపై అఖిలప్రియ శుక్రవారం స్పందించారు.
నాపై అసత్య ప్రచారం
తాను తెలుగుదేశం పార్టీ పైన, తమ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై అసంతృప్తితో ఉన్నట్లుగా ప్రచారం సాగుతోందని, పార్టీ మారుతానని చెబుతున్నారని, కానీ అలాంటిదేమీ లేదని అఖిలప్రియ స్పష్టం చేశారు. కొందరు పనిగట్టుకొని తనపై అసత్య ప్రచారం చేస్తున్నారని వాపోయారు.
చంద్రబాబుకు కానుకగా ఇస్తా
2019 సార్వత్రిక ఎన్నికల్లో ఆళ్లగడ్డ అసెంబ్లీ స్థానంలో మరోసారి గెలిచి చంద్రబాబు నాయుడుకు కానుకగా ఇస్తానని చెప్పారు. చంద్రబాబు నాయుడు కారణంగానే ఆళ్లగడ్డకు నీళ్లు వచ్చాయని ఆమె చెప్పారు. తాము పార్టీ మారడం లేదని, ఏ పార్టీలోకి వెళ్లడం లేదని తేల్చి చెప్పారు. మొత్తానికి తాను పవన్ కళ్యాణ్ లేదా జగన్మోహన్ రెడ్డిలతో వెళ్తున్న వార్తలు అవాస్తవమని ఆమె చెప్పారు.
నిర్వాసితులపై అఖిలప్రియ
ఆమె ఇంకా మాట్లాడుతూ... భూనిర్వాసితులకు ప్రస్తుతం ఉన్న ధరకు అయిదు రెట్లు ఇవ్వాలని అఖిలప్రియ చెప్పారు. నిర్వాసితులకు ఉద్యోగాలు కల్పించాలన్నారు. నిర్వాసితుల కాలనీలలో మౌలిక సదుపాయాలు కల్పించాలని చెప్పారు.