ముగిసిన ఆళ్లగడ్డ పంచాయతీ: కలిసి పనిచేస్తామన్న అఖిల, పేరెత్తని ఏవీ సుబ్బారెడ్డి
అమరావతి: రెండు మూడు రోజులుగా ఉత్కంఠగా కొనసాగుతున్న ఆళ్లగడ్డ పంచాయితీ శుక్రవారం ముగిసింది. ఇరువర్గాలైన భూమా, ఏవీ సుబ్బారెడ్డి వర్గాలతో సుదీర్ఘ సమావేశం నిర్వహించిన ఏపీ సీఎం చంద్రబాబునాయుడు సమస్యను సామరస్యంగా పరిష్కరించారు.
భేటీ అనంతరం వర్ల రామయ్యతో కలిసి మంత్రి అఖిల ప్రియ-ఏవీ సుబ్బారెడ్డిలు మీడియా ముందుకు వచ్చారు. ఇరు వర్గాలతో విడివిడిగానూ.. కలిసి సీఎం మాట్లాడారని.. ఆళ్లగడ్డ పంచాయితీ టీ-కప్పులో తుపానులా ఎగిరిపోయిందని వర్ల రామయ్య వెల్లడించారు.
ఏవీ సుబ్బారెడ్డితో కలిసి పనిచేస్తా
ఆ తర్వాత అఖిల ప్రియ మాట్లాడుతూ.. గత కొన్ని రోజులుగా ఆళ్లగడ్డ కేంద్రంగా జరిగిన పరిణామాలు బాధాకరమని అన్నారు. ఆళ్లగడ్డ అంటే అభివృద్ధి గుర్తుకు రావాలని చంద్రబాబు చెప్పారని తెలిపారు. గొడవలుంటే మాట్లాడుకుని సర్దుబాటు చేసుకోవాలని సీఎం సూచించారని ఆమె తెలిపారు. పార్టీ కోసం కలిసి పని చేస్తామని తాను, సుబ్బారెడ్డి హామీ ఇచ్చామని మంత్రి వెల్లడించారు.
చెడ్డ పేరు తీసుకురాం
కూతురుగా తనకు ఇవ్వాల్సిన సలహాలు ఇచ్చారని.. చంద్రబాబే తమ కుటుంబానికి పెద్ద దిక్కని అఖిలప్రియ చెప్పారు. పార్టీకి, చంద్రబాబుకు చెడ్డ పేరు తీసుకురామని అఖిలప్రియ స్పష్టంచేశారు. నంద్యాలలో కూడా చంద్రబాబు సలహాతో ముందుకెళ్తామన్నారు.
ఏవీ సూచనలు తీసుకుంటాం
నాలుగేళ్ల రాజకీయ జీవితంలో ఎన్నో పరిణామాలు చోటు చేసుకున్నాయని ఇచ్చిన బాధ్యతలను నెరవేరుస్తానని అఖిలప్రియ చెప్పారు. దివంగత తల్లిదండ్రులు నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డి తరహాలోనే తామూ మంచి పేరు తెచ్చుకుంటామని తెలిపారు. ఏవీ సుబ్బారెడ్డితో కలిసి పని చేస్తామని తెలిపారు. ఏవీ సుబ్బారెడ్డి ఇచ్చే సూచనలు, సలహాలు తీసుకుంటామని చెప్పారు.
అఖిలప్రియ పేరెత్తని ఏవీ
పార్టీ కోసం కలిసి పని చేస్తామని.. చంద్రబాబు చెప్పినట్టు చేస్తానని టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డి అన్నారు. అయితే, సుబ్బారెడ్డి అఖిలప్రియ పేరు కూడా ఎత్తకుండా.. పార్టీ కోసం కలిసి పనిచేస్తామని వ్యాఖ్యానించడం గమనార్హం. అయితే, పార్టీ తగిన ప్రాధాన్యత ఇస్తుందని ఏవీ సుబ్బారెడ్డికి చంద్రబాబు చెప్పినట్లు తెలిసింది.