శ్రీవారి భక్తులకు శుభవార్త! అక్షయ తృతీయ డాలర్లు సిద్ధం!
తిరుమల: శ్రీవారం భక్తులకు శుభవార్త! అక్షయ తృతీయ నాడు ఎంతో కొంత బంగారాన్ని కొనుగోలు చేయాలనుకునే వారి కోసం తిరుమల తిరుపతి దేవస్థానం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. భక్తుల కోసం బంగారు డాలర్లను అందుబాటులోకి తీసుకొని వచ్చింది. మంగళవారం అక్షయ తృతీయను పురస్కరించుకుని విక్రయాలను ఆరంభించనున్నారు టీటీడీ అధికారులు. తిరుమలలో శ్రీవారం ఆలయం ఎదుట ఈ డాలర్లను విక్రయించబోతున్నారు. ఈ బాధ్యతను ఆంధ్రాబ్యాంకునకు అప్పగించారు.
డాలర్ల విక్రయాల కోసం ఆంధ్రాబ్యాంకు అధికారులు శ్రీవారి ఆలయం ఎదుట ప్రత్యేకంగా ఓ కౌంటర్ను ఏర్పాటు చేయనున్నారు. ఈ డాలర్లకు ఒకవైపు కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామి, మరోవైపు శ్రీపద్మావతి అమ్మవారి ప్రతిమలను ముద్రించారు. బంగారం మాత్రమే కాకుండా- వెండి, రాగి డాలర్లను కూడా విక్రయిస్తామని టీటీడీ అధికారులు తెలిపారు. అందరికీ బంగారాన్ని కొనుగోలు చేసే తాహతు ఉండకపోవచ్చని, అలాంటి భక్తులకు నిరాశ కలిగించకుండా వెండి, రాగి డాలర్లను కూడా అమ్మకానికి ఉంచుతామని అన్నారు. 10, 5, 2 గ్రాముల బరువు మేర బంగారం డాలర్లు అందుబాటులో ఉంటాయని తెలిపారు.
10 గ్రాముల బంగారం డాలర్ ధర 32,178 రూపాయలుగా నిర్ధారించారు. అయిదు గ్రాముల డాలర్-రూ.16,311, రెండు గ్రాముల డాలర్-6,754 రూపాయలుగా నిర్ధారించారు. వెండి 10 గ్రాముల డాలర్ ధరను 593 రూపాయలుగా, అయిదు గ్రాముల వెండి 320 రూపాయలుగా నిర్ణయించారు. అలాగే- రాగి 10 గ్రాముల డాలర్ 26 రూపాయలు, అయిదు గ్రాముల బరువున్న డాలర్ 20 రూపాయలకు విక్రయిస్తామని అధికారులు తెలిపారు.