ఏపీ బీజేపీ కొత్త సారథి: తెరపైకి ఆకుల, కేంద్రంలోకి హరిబాబు!, బాబుపై అమిత్ షా ఏమన్నారంటే?
అమరావతి: ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ అధ్యక్ష పదవికి కంభంపాటి హరిబాబు ఆకస్మిక రాజీనామా చేసిన నేపథ్యంలో ఆ పార్టీ కొత్త సారథి ఎవరనేది చర్చనీయాంశంగా మారింది. మాజీ కేంద్రమంత్రి పురంధేశ్వరి, మాజీ మంత్రులు కన్నా లక్ష్మినారాయణ, పైడికొండల మాణిక్యాల రావు, ఎమ్మెల్సీలు విష్ణుకుమార్ రాజు, మాధవ్ల పేర్లు ఇప్పటికే వినిస్తున్నాయి.
Recommended Video
కాగా, ఇప్పుడు మరో కొత్త పేరు వెలుగులోకి వచ్చారు. ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ పేరును కూడా అధిష్ఠానం పరిశీలించే అవకాశాలున్నట్లు పార్టీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. రాష్ట్ర విభజన సమయంలో హరిబాబును ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా నియమించారు. ఎన్డీయే భాగస్వామ్య పక్షంగా తెలుగుదేశం కొనసాగిన ఈ నాలుగేళ్లు హరిబాబు కీలకంగా వ్యవహరించారు. ఏ క్షణమైనా కొత్త అధ్యక్షుడి నియామకంపై అధికార ప్రకటన రావచ్చని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
సోము వీర్రాజుపై వ్యతిరేకత?
మాజీ మంత్రులు కన్నా లక్ష్మినారాయణ, మాణిక్యాలరావుతో పాటు సోమువీర్రాజు పేర్లు అధ్యక్ష పదవికి చర్చకు వచ్చాయి. సోమువీర్రాజు వైఖరిపై పార్టీలోని కొన్ని వర్గాలు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నందున ఇప్పుడు మాణిక్యాలరావు, కన్నా లక్ష్మినారాయణలకే అవకాశాలున్నాయనే వ్యాఖ్యలు వస్తున్నాయి. తెలుగుదేశంపై దూకుడుగా వెళ్లాలంటే కన్నా లక్ష్మినారాయణే మేలన్న అభిప్రాయాన్ని కొందరు ముఖ్యులు అమిత్షా దృష్టికి తీసుకెళ్లినట్లు చెబుతున్నారు. ఇదే సమయంలో దూకుడుగా కనిపించే సోమువీర్రాజు ఇటీవల మౌనం వహించడం చర్చనీయాంశమవుతోంది.
ఏపీ బీజేపీ అధ్యక్ష పదవికి హరిబాబు రాజీనామా: ఆకస్మిక నిర్ణయం చర్చ
ఆసక్తి చూపుతున్న కన్నా
తెలుగుదేశం పార్టీని ఇబ్బంది పెట్టడంతో పాటు కాపు సామాజిక వర్గాన్ని కొంతమేర పార్టీ వైపు తిప్పగలిగే శక్తి ఉన్న నాయకుడు కన్నానే అని, ఆయనకే అధ్యక్ష పదవి ఇవ్వాలని కావూరి సాంబశివరావులాంటి కొందరు సీనియర్లు పట్టుబడుతున్నట్లు సమాచారం. అధిష్ఠానం ఎలాంటి పదవి అప్పగించినా స్వీకరిస్తానని కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు.
తెరపైకి ఆకుల సత్యనారాయణ
అయితే, లక్ష్మీనారాయణ, మాణిక్యాలరావుతో పాటు ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ పేరును కూడా అధిష్ఠానం పరిశీలించే అవకాశాలున్నట్లు పార్టీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. కాపు సామాజిక వర్గానికి చెందిన సత్యనారాయణ బుధవారం ఢిల్లీలో పలువురు పార్టీ ముఖ్య నేతలను కలుసుకోనున్నారు. సమైక్య ఉద్యమం సమయంలో ఆయన బీజేపీలో చేరారు.
హరిబాబు రాజీనామా, బీజేపీ లెక్కలు: బాబుకు షాక్, తెరపైకి పురంధేశ్వరి? రేసులో వీరే!
చేరిన వారికి ప్రాధాన్యతా?
నాలుగేళ్ల కిందట పార్టీలోకి వచ్చిన కన్నా లక్ష్మీనారాయణను అధ్యక్ష స్థానంలో కూర్చోబెడితే దశాబ్దాల తరబడి పార్టీ కోసం పనిచేస్తున్న కార్యకర్తలు ఆయన వద్దకు ఎలా వెళ్లగలుగుతారన్న ప్రశ్న ఆయన్ను వ్యతిరేకించే వర్గాల నుంచి వస్తోంది. మాజీ మంత్రి మాణిక్యాలరావుకు ఆర్ఎస్ఎస్తో సుదీర్ఘ అనుబంధం ఉన్నందున ఆయన పేరును ఖరారు చేయడమే మంచిదని బీజేపీ సీనియర్లు కొందరు అంటున్నారు. కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన కాటసాని రాంభూపాల్రెడ్డి, సీకేబాబులాంటి వారు ఎన్నాళ్లు పార్టీలో ఉంటారో తెలియదని, కన్నా లక్ష్మినారాయణ తీరు కూడా ఇందుకు భిన్నమేమీ కాదని ఆ పార్టీ వర్గాలే వాదిస్తున్నాయి. అయితే, కన్నాకు మద్దతుగా నిలిచేవారు కూడా ఉన్నారు. అయితే, అసోంగణపరిషత్ నుంచి వచ్చిన శర్బానంద్ సోనోవాల్ను మూడేళ్లకే పార్టీ అధ్యక్షుడిని చేసి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిని చేసిన దాఖలాలు లేవా? అని కన్నాను బలపరుస్తున్న వర్గాలు ప్రశ్నిస్తుండటం గమనార్హం.
కొత్త అధ్యక్షుడిపై అమిత్ షా కసరత్తు
ఏపీ బీజేపీ కొత్త అధ్యక్షుడి ఎంపికకు అవకాశం కల్పించడానికే కంభంపాటి రాజీనామా చేశారని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్షా పేర్కొన్నారు. మంగళవారం ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. త్వరలోనే కొత్త అధ్యక్షుడిని ప్రకటిస్తామన్నారు. బీజేపీతో చంద్రబాబు తెగదెంపులు చేసుకోవడంపై మీడియా ప్రశ్నించగా.. ఆయనతో గొడవలు లేవని, ఆయనే బయటికెళ్లారని స్పష్టం చేశారు.
కేంద్రమంత్రిగా హరిబాబు?
ఏపీ బీజేపీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన ఎంపీ కంభంపాటికి కేంద్ర మంత్రివర్గ విస్తరణలో అవకాశం కల్పించవచ్చని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. తెలుగుదేశం మంత్రులు వైదొలిగాక తెలుగు రాష్ట్రాల నుంచి కేంద్ర మంత్రివర్గంలో ప్రాతినిధ్యం కరవైంది. ఈ నేపథ్యంలో హరిబాబుకు కేంత్రమంత్రి పదవి వరించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అంతేగాక, గత మంత్రివర్గ విస్తరణ సమయంలోనే హరిబాబు పేరు చర్చకు వచ్చిందని వెల్లడించారు.