సకల హింసలకు మద్యమే కారణం..! తాజాగా నిరూపించిన ఏపి ఉందంతాలు..! ఇప్పుడేం చేయాలి..?
అమరావతి/హైదరాబాద్ : కరోనా మహమ్మారి పడగవిప్పి బుసలు కొడుతున్న తరుణంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. కరోనా ప్రభావం ఉన్న దేశాలు లాక్ డౌన్ ఆంక్షలను సడలిస్తే తద్వారా తలెత్తే విపత్కర పరిణామాలకు బాద్యత వహిస్తారా అని ప్రపంచ ఈరోగ్య సంస్ధ కూడా హెచ్చరికలు జారీ చేస్తోంది. సరిగ్గా ఇదే సమయంలో దేశంలోని వివిధ ప్రాంతాలను కరోనా తీవ్రత ఆధారంగా రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లుగా విభజించింది. ఆరెంజ్, గ్రీన్ జోన్లు అంత ప్రమాదవకరం కాదంటూ ఆంక్షలను సడలించాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. ఆంధ్ర ప్రదేశ్ లో మాత్రం గ్రీన్ జోన్లలో మద్యం షాపులకు కూడా ప్రభుత్వం అనుమతులు మంజూరి చేసింది. అసలు సమస్య ఇక్కడే ఉత్పన్నమవుతోంది.
మద్యానికి దూరంగా 40రోజులు.. మందు బాబులకు ఒక్కసారిగా నషాలానికెక్కిన కిక్కు..
తాజాగా సోమవారం నుండి మందు అమ్మకాలు మొదలుపెట్టడం వల్ల రెండు అమాయక ప్రాణాలు అనంతవాయువుల్లో కలిసిపోయాయి. చిత్తూరు జిల్లా పలమనేరులో మద్యం తాగొద్దని వారించినందుకు పెళ్లాన్ని విపరీతంగా కొట్టాడు ఓ భర్త. తాగుడుకు బానిసైతే కుటుంబం నాశనం అవుతుందని చెప్పినందుకు కొట్టాడని స్థానికులు, ఇరుగుపొరుగు వారు చెప్పుకొస్తున్నారు. భర్త కొట్టడంతో మనస్తాపానికి గురైన తల్లీబిడ్డలు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ముఖ్యమంత్రి మందు అమ్మకాలు తెరవకపోతే ఈ రెండు ప్రాణాలు కచ్చితంగా మిగిలేవనే చర్చ జరుగుతోంది.
మద్యం మత్తులో పైశాచికం.. భార్యబిడ్డలను చితకబాదుతున్న తాగుబోతులు..
లాక్ డౌన్ ఆంక్షల సమయంలో కూడా మద్యం షాపులు ఓపెన్ చేయడంతో 40 రోజుల లాక్ డౌన్ వృథా అయిపోయిందనే స్వరాలు కూడా వినిపిస్తున్నాయి. స్వయంగా ప్రభుత్వమే కరోనాను ఆహ్వానించినట్టు అయ్యిందనే చర్చ కూడా తెర మీదకు వస్తోంది. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి తొలి అసెంబ్లీ సమావేశాల్లో మద్యం తాగడం వల్ల ప్రజల జీవితాలు ప్రశ్నార్థకంగా మారుతాయని, అందుకే మద్యపాన నిషేధాన్ని దశల వారీగా అమలులోకి తెస్తామని ప్రకటించారు. లాక్ డౌన్ ఆంక్షల నేపథ్యంలో 40రోజులుగా మద్యానికి దూరంగా ఉన్న ప్రజలకు దాన్ని శాశ్వతంగా దూరం చేస్తే శ్రేయస్కరంగా ఉండేదనే చర్చ కూడా అమరావతిలో చోటుచేసుకుంటోంది.
ఏపిలో మద్యం అమ్మకాల జోరు.. సామాన్యుల బేజారు..
ఇక ఏపిలో లాక్డౌన్ ఆంక్షల సడలింపు నిర్ణయం ద్వారా ఏపీలో పలుచోట్ల హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్నాయి. మద్యం అతిగా సేవించి వెళుతున్న వ్యక్తిని గుర్తు తెలియని వాహనం ఢీ కొనడంతో మరణించిన సంఘటన కృష్ణా జిల్లాలో జరిగింది. మద్యం అమ్మకాలు ప్రారంభించిన తొలి రోజునే ఈ విషాద సంఘటన చోటు చేసుకోవడం అత్యంత శోనీయమని తెలుస్తోంది. మైలవరం గ్రామానికి చెందిన వ్యక్తి మద్యం అతిగా సేవించి ఇంటికి తిరిగి వెళుతుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొంది. ఈ ఘటనలో అతడు అక్కడికక్కడే మరణించారు. జిల్లాలోని మొవ్వ మండలం కూచిపూడి పోలీసు స్టేషన్ సమీపంలోని వైన్ షాపు వద్ద సోమవారం రాత్రి జరిగిన దాడిలో అయ్యంకి మాజీ ఎంపీటీసీ మరణించారు.
సకల రుగ్మతలకు మద్యమే కారణం.. నిషేదించాలంటున్న ప్రజా సంఘాలు..
అటు చిత్తూరు జిల్లాలోనూ విషాద సంఘటన చోటు చేసుకుంది. మద్యం మత్తులో భార్య, కూతురిపై భర్తే దాడి చేయగా, విరక్తిచెందిన భార్య, కూతురు వారి ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. పెంకులకిట్టన్నమిషన్ వీధిలో నివాసం ఉంటున్న ఓ వ్యక్తి పట్టపగలే పీకలదాకా తాగేసి ఇంటికి రాగా, మద్యం ఎందుకు తాగావని భార్య, భర్తల మధ్య గొడవ జరిగింది. మద్యం మత్తులో భార్య, కూతురిపై తాగుబోతు బౌతిక దాడి చేసాడు. దీంతో మనస్తాపానికి గురైన భార్య, కుమార్తె ఇద్దరూ ఇంట్లోనే ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకొన్నారు. నెల్లూరు జిల్లాలో తప్పతాగి ఇంటికి చేరుకున్న ఓ తాగుబోతు భార్యా పిల్లలను చితకబాదాడు. మొత్తానికి లాక్డౌన్ ఆంక్షల తర్వాత తిరిగి మొదలైన మద్యం అమ్మకాలతో పలుచోట్ల హింసాత్మక ఘటనలకు కారణమయ్యాయి. ఇందుకు బాద్యత ఎవరిదనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది.
Recommended Video