ఏపీలో మద్యం కొరత .. వారం రోజులకే ఉన్న స్టాక్ .. అసలు కథ ఇదే !!
ఏపీలో మందుబాబులకు పెద్ద చిక్కు వచ్చి పడింది. ఏపీలో ఇక మద్యం వారం తర్వాత లభించదేమో అన్న పరిస్థితి తాజాగా నెలకొంది. ఏపీ సర్కార్ ఇప్పటికే మద్యపాన నిషేధం దిశగా ఒక్కొక్క అడుగు వేస్తున్న తరుణంలో, ఏపీ సర్కార్ ఊహించనటువంటి పరిణామం ఇప్పుడు చోటు చేసుకుంది. దీంతో మందుబాబులకు ముందు ముందు లిక్కర్ కష్టాలు కలగనున్నాయా అన్న అనుమానం వ్యక్తమవుతోంది.
డిస్టలరీలకు 1700 కోట్ల ప్రభుత్వ బకాయిలు
ఇక అసలు విషయానికి వస్తే ఏపీలోమద్యం ఉత్పత్తి చేసే ఉత్పత్తిదారులు (డిస్టిలరీలు)కు ప్రభుత్వం బకాయిలు చెల్లించకపోవడంతో డిస్టిలరీలు తాము లిక్కర్ ఉత్పత్తి చేయలేమంటూ ప్రభుత్వానికి తేల్చి చెబుతున్నాయి. ప్రభుత్వం డిస్టిలరీల వద్ద మద్యం తీసుకొని వైన్ షాపుల ద్వారా అమ్మి సొమ్ము చేసుకుంటుంది. కానీ డిస్టిలరీలకు మాత్రం సంబంధిత మద్యానికి డబ్బు చెల్లించడం లేదని సమాచారం . దీంతో 1700 కోట్ల వరకు డిస్టలరీలకు సంబంధించిన బకాయిలు పేరుకుపోయాయని తెలుస్తుంది.
మద్యం సరఫరా నిలిపివేసిన డిస్టలరీలు
ఇక ఈ నేపథ్యంలోనే డిస్టిలరీలు బకాయిలు ఇవ్వకుంటే ఉత్పత్తి తమ వల్లకాదని,పెట్టుబడి పెట్టలేమని ప్రభుత్వానికి తేల్చేశాయి. ఇప్పటికే కొన్ని కంపెనీలు పూర్తిగా సరఫరాను నిలిపివేశాయి. ఏపీలో బాగా డిమాండ్ ఉన్న లిక్కర్ ఉత్పత్తి సంస్తలు కూడా మద్యంసరఫరాను నిలిపివేశాయి. ప్రస్తుతం ఏపీలో మద్యం షాపుల్లో ఉన్న నిల్వలు ఒక వారం రోజులకే వస్తాయని మద్యం పంపాలని ఎక్సైజ్ అధికారులు డిస్టిలరీ లను కోరుతున్నారు. కానీ వారు బకాయిలు చెల్లించే వరకు మద్యం పంపించేది లేదని తేల్చి చెబుతున్నారు.
బకాయిలు చెల్లించకుంటే ఉత్పత్తి చెయ్యలేమంటున్నడిస్టలరీలు
అటు ప్రభుత్వం నుంచి నిధులు రాక, డిస్టలరీలకు బకాయిలు చెల్లించక, మద్యం కొరతను తీర్చలేక ఎక్సైజ్ అధికారులు మధ్యలో నానా ఇబ్బందులు పడుతున్నారు. ఏపీ లో ఉన్న మొత్తం 15 డిస్టిలరీలలో ఆరు డిస్టిలరీలు ఉత్పత్తిని ఈ నెలలో ఆపేశాయి. బకాయిలు చెల్లించకుంటే మిగతా వారు కూడా సరఫరా చేయడానికి సిద్ధంగా లేరని తెలుస్తుంది. దీంతో మద్యం షాపుల్లో మద్యం కొరత ఏర్పడనుంది.
వారం రోజులకే ఉన్న స్టాక్ ..ఎక్సైజ్ అధికారుల పరేషాన్
కేవలం మరో వారం వరకు మాత్రమే ఏపీలోని లిక్కర్ షాపుల్లో మద్యం నిల్వలున్నాయి. ఈలోపు బకాయిలు చెల్లించకుండా ఇలాగే తాత్సారం చేస్తే ఆ తర్వాత మద్యం షాపుల్లో లిక్కర్ నిల్ అవుతుంది. ఒకవేళ అదే జరిగితే ఏపీలో మద్యం దొరక్క మందుబాబులు ఎన్ని చుక్కలు చూస్తారో ... ప్రభుత్వానికి ఇంకెన్ని చుక్కలు చూపిస్తారో అని ఎక్సైజ్ అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. ఇప్పటికే పలు నిబంధనల మధ్య మద్యం షాపులు నిర్వహిస్తున్న ఏపీ సర్కార్ పట్ల కాస్త విముఖతతో ఉన్న మందుబాబులు అసలు లిక్కర్ దొరక్కపోతే రచ్చ రచ్చ చేస్తారని, ఈ వారంలోగా సమస్య పరిష్కరించాలని ఎక్సైజ్ అధికారులు భావిస్తున్నారు.