ఎవరు ఆఫర్ ఇస్తే వారివైపు: మంత్రి గంటా ముందే గుట్టువిప్పిన అలీ, పార్టీలకు షాకింగ్ షరతులు?
విశాఖపట్నం: విమానాశ్రయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి, ఆ తర్వాత రెండు రోజుల క్రితం ఉదయం జనసేన అధినేత పవన్ కళ్యాణ్, సాయంత్రం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో భేటీ అయిన ప్రముఖ తెలుగు కమెడియన్ అలీ తాజాగా, మంగళవారం ఏపీ మంత్రి గంటా శ్రీనివాస రావుతో భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా ఓ టీవీ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అలీ మాట్లాడారు. గంటాతో తనకు ఇరవై ఏళ్లుగా పరిచయం ఉందని, తాను అప్పుడప్పుడు వచ్చి మాట్లాడుతుంటానని చెప్పారు. గంటా చాలా మంచి వ్యక్తి అన్నారు. తాను వ్యక్తిగతంగానే కలిశానని చెప్పారు.
రెండింట్లో ఏం జరిగినా వైసీపీదే గెలుపు!: పవన్ కళ్యాణ్ మీద జగన్ అంచనా ఏమంటే?
ఈ ప్రశ్న అడుగుతారనుకోలేదు
సార్వత్రిక ఎన్నికలకు కొద్ది రోజుల ముందు ఇలా భేటీ కావడంపై చర్చలు జరుగుతున్నాయని సదరు మీడియా ప్రతినిధి అడగగా.. అలీ, గంటా శ్రీనివాస రావులు నవ్వారు. అనంతరం అలీ స్పందిస్తూ... మీరు ఈ ప్రశ్న అడుగుతారని అనుకోలేదని, లేదంటే వచ్చేవాడిని కాదని నవ్వుతూ సరదాగా చెప్పారు.
ఏ పార్టీ ఆఫర్ ఇస్తే అటువైపు ఓటు
ఇటీవల జగన్ను కలిసిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోందని, దానిపై కండిషన్స్ అప్లైడ్ అని కూడా మీరు చెప్పారని మీడియా ప్రతినిధి అన్నారు. దానికి అలీ స్పందిస్తూ.. నాకు ఏ పార్టీ వారు అయితే ఆఫర్ ఇస్తారో అటువైపే నా ఓటు అన్నారు.
16వ తేదీ తర్వాత చెప్తా, చంద్రబాబు ఏమంటారో చూద్దాం
తనకు ఓ గురువు ఉన్నారని, ఈ నెల 16వ తేదీ లోపు ఏదీ చేయవద్దని చెప్పారని, ఆ తర్వాత ఏం చేసినా శుభం జరుగుతుందని చెప్పారని అలీ అన్నారు. కాబట్టి 16వ తేదీ తర్వాత నేను స్వయంగా బయటకు వచ్చి ఏ పార్టీకి మద్దతిస్తానో చెబుతానని అన్నారు. పార్టీలో చేరే విషయమై తన కండిషన్స్ గురించి అలీ మాట్లాడుతూ.. గంటా తప్పకుండా రికమెండ్ చేస్తారని, చంద్రబాబు ఆమోదిస్తారని అన్నారు. గంటా చెప్పిందానికి చంద్రబాబు ఓకే అంటారన్నారు. గంటా వెళ్లి, సీఎంకు ఏం చెప్తారో, ఏం సమాధానం వస్తుందో చూడాలన్నారు.
అందుకే పార్టీ ముందు ఆ షరతులు పెట్టా
మంత్రి పదవి, గుంటూరు టిక్కెట్ ఇస్తామని చెబితే టీడీపీలో కొనసాగుతారా అని సదరు మీడియా ప్రతినిధి అడగా... తనకు కాల్ రాగానే కలుస్తానని అలీ చెప్పారు. ఏ పార్టీలో చేరే అంశంపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోందని చెప్పారు. ప్రజలు తనకు (సినిమాల ద్వారా) మంచి లైఫ్ ఇచ్చారని, అలాంటి ప్రజలకు ఏదో చేయాలనే తాను పార్టీల ముందు కండిషన్స్ (గుంటూరు సీటు, మంత్రి పదవి పెట్టినట్లుగా తెలుస్తోంది) పెట్టానని అలీ చెప్పారు. అంతే కానీ తాను పదవులు అనుభవించేందుకు కాదన్నారు. తనకు గ్రీన్ సిగ్నల్ వచ్చాక క్లారిటీగా చెబుతానని అన్నారు.
టీడీపీ అంటే ఇష్టం, టీడీపీ కార్యకర్తను, ఇప్పుడు అభ్యర్థిగా
తనకు తెలుగుదేశం అంటే ఇష్టమని, ఈ పార్టీలోని చంద్రబాబు, ఇతర మంత్రులకు నేను బాగా తెలుసునని, తనను తమ్ముడులా చూసుకుంటారని అలీ చెప్పారు. అరకు వచ్చి వెళ్లావని తెలిస్తే గంటా అంటారని తాను కలిసి వెళ్లేందుకు వచ్చానని చెప్పారు. తన రాజకీయ ఆరంగేట్రాన్ని పక్కన పెడితే టీడీపీకి సపోర్ట్ చేస్తానని, ఇరవై ఏళ్లు కార్యకర్తగా ఉన్నానని చెప్పారు. ఇప్పుడు కార్యకర్తగా కాకుండా అభ్యర్థిగా ఉండాలని అనుకుంటున్నానని చెప్పారు.
అలీ.. మొత్తానికి గుట్టు బయటపెట్టారు
ఇరవై ఏళ్లు టీడీపీ కార్యకర్తగా ఉన్నారని, అడగనిది అమ్మ అయినా పెట్టదని, కాబట్టి మీకు ఏం కావాలో అడగాలి కదా అని మీడియా ప్రతినిధి ప్రశ్నించగా... అలీ స్పందిస్తూ.. చెప్పమని అడిగేందుకే గంటా వద్దకు వచ్చానని చెప్పారు. దానికి మీడియా ప్రతినిధి స్పందిస్తూ.. మొత్తానికి అసలు గుట్టు బయటపెట్టారని వ్యాఖ్యానించారు. ఏమి అడిగారని కూడా అలీని ఆయన ప్రశ్నించారు. గుంటూరుకు గ్రీన్ సిగ్నల్ పడిందా అని అడగ్గా.. అక్కడి (చంద్రబాబు) నుంచి గ్రీన్ సిగ్నల్ రావాలని, ఆయన ఎవరికి కమిట్మెంట్ ఇచ్చారో తెలియదన్నారు.
గంటా ఏమన్నారంటే
అనంతరం గంటా మాట్లాడుతూ.. అలీ వ్యక్తిగతంగా తనకు ఆప్తుడు అని చెప్పారు. తన విజయానికి కూడా ఆయన పని చేశారని చెప్పారు. అలీ ఏ పార్టీలో చేరుతారనే అంశంపై వారం రోజులుగా చర్చ సాగుతోందన్నారు. తాను అలీకి రాయబారిగా కాదని, అలీ బలం చంద్రబాబుకు తెలుసునని, ఆయన అవసరం పార్టీకి ఎంతనో తెలుసునని చెప్పారు.