అలిపిరి ఘటన:ఇంకా కాక మీదే కేంద్రం;పోలీస్ బాస్ లపై వేటు తప్పదా?
తిరుమల:శ్రీవారి దర్శనానికి వచ్చిన బిజెపి జాతీయ అధ్యక్షులు అమిత్షా కాన్వాయ్ పై టిడిపి కార్యకర్తలు దాడికి పాల్పడిన ఘటనని కేంద్ర హోంశాఖ చాలా తీవ్రంగా పరిగణిస్తున్నట్లు తెలిసింది. అధికార పార్టీకి సంబంధించిన జాతీయ అధ్యక్షుడు శ్రీవారి దర్శనానికి వస్తే రక్షణ కల్పించలేని పోలీసు వ్యవస్థపై ఆ శాఖ అధికారులు బాగా సీరియస్ అయ్యారని సమాచారం.
మరోవైపు ఈ ఘటన అనంతర పరిణామాలపై కూడా కేంద్ర హోం శాఖ ఆరా తీసిందని, అవి కూడా వారికి ఏమాత్రం రుచించలేదని తెలిసింది. అమిత్ షా పై దాడికి సంబంధించి ఈ ఘటనకు పాల్పడిన ముగ్గురు టిడిపి కార్యకర్తలను పోలీసులు తొలుత అరెస్టు చేశారు. అయితే ఇందులో ఇద్దరిని కేసు నుంచి సంబంధం లేదని తప్పించారు. మూడో వ్యక్తి సుబ్రమణ్యం యాదవ్పై కేసు నమోదై ఉంది. అయితే ఇంత పెద్ద ఘటన జరిగితే పోలీసులు కంటితుడుపు చర్యలు చేపట్టారే తప్ప సీరియస్ గా చర్యలు తీసుకోలేదనేది కేంద్రం ఆగ్రహంగా తెలుస్తోంది.
ఈ నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం ఎపి పోలీస్ శాఖపై కూడా గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఎపి బిజెపి నాయకులు కూడా ఈ దాడి విషయాన్ని విడిచిపెట్టడం లేదు. తమ పార్టీ జాతీయ అధ్యక్షుడిపై దాడికి బాధ్యులుగా అర్బన్ జిల్లా ఎస్పి అభిషేక్ మహంతి, ఈస్టు డిఎస్పి మునిరామయ్యపై చర్యలు తీసుకోవాలని వారు పట్టుపడుతున్నారు. దీంతో ఈ రగడ ఇంకా సద్దుమణగకపోతుండటంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి అర్బన్ ఎస్పి, డిఎస్పిని బాధ్యులను చేస్తూ బదిలీ, సస్పెన్షన్ వేటు వేయనున్నట్లు తెలిసింది.
తద్వారా ఎపి బిజెపి నేతలు ఇంకా ఈ వివాదాన్ని కొనసాగించే అవకాశం లేకుండా చేయడం, మరోవైపు కేంద్ర హోం శాఖకు కూడా తాము తీసుకున్న చర్యలను తెలియబరిచి వారిని కూడా చల్లబరచడం చేయాలని బావిస్తున్నట్లు సమాచారం. ఆ రకంగా అర్బన్ జిల్లా ఎస్పి అభిషేక్ మహంతి, ఈస్టు డిఎస్పి మునిరామయ్యపై చర్యలు తప్పవనేది అభిజ్ఞ వర్గాల భోగట్టా.