కరోనా: జగన్ కీలక సమీక్ష, ఏపీలోనూ అన్ని విద్యాసంస్థలకు సెలవులు, వార్నింగ్
అమరావతి: కరోనావైరస్ మనదేశంలో వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే గురువారం(మార్చి 19) నుంచి రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించింది.
గురువారం నుంచి సెలవులు
ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. కరోనావైరస్ కట్టడిపై గురువారం క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలోని పిల్లలు, యువకుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని విద్యా సంస్థలకు గురవారం నుంచి సెలవులు ఇవ్వాల్సిందిగా ఆదేశించారు.
విరుద్ధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు
కోచింగ్ సెంటర్లతోపాటు అన్ని రకాల విద్యా సంస్థలను మూసివేయాల్సిందిగా ఆదేశించారు. ప్రభుత్వ ఆదేశాలకు విరుద్ధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించినా.. ఏపీలో మాత్రం ఇవ్వలేదని, ప్రజల ఆరోగ్యంతో సర్కారు చెలగాటమాడుతోందని విపక్షాలు ఆరోపిస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. కాగా, పలు జిల్లాల్లో సినిమా థియేటర్లు స్వచ్ఛందంగా మూసివేస్తున్నారు.
Recommended Video
ఎన్నికలు వాయిదా..
కరోనా తీవ్రత దృష్ట్యా స్థానిక సంస్థల ఎన్నికలను రద్దు చేస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. కాగా, ఏపీలో కరోనా తీవ్రత అంతగా లేదని, ఎన్నికలు వాయిదా వేయాల్సిన అవసరం లేదని జగన్ సర్కారు సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే, ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఎన్నికల వాయిదాను సుప్రీంకోర్టు సమర్థించింది. కాగా, ఏపీలో ఒక కరోనా పాజిటివ్ కేసు నమోదైన విషయం తెలిసిందే. సుమారు 20 మంది వరకు అనుమానితులు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా, ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం విద్యాసంస్థలు, సినిమా థియేటర్లను మార్చి 31 వరకు మూసివేస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.