అన్ని వేళ్లు మోడీ వైపు.. ఆ రెండు పార్టీల వేళ్లు నా వైపు: చంద్రబాబు ఆవేదన
అమరావతి: 'అన్ని వేళ్లు మోడీ వైపు చూపిస్తుంటే.. వైసీపీ, జనసేన పార్టీలు మాత్రం నా వైపు వేళ్లు చూపిస్తున్నాయి..' అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం తన నివాసంలో ఏర్పాటు చేసిన టీడీపీ సమన్వయ కమిటీ సమావేశంలో మాట్లాడుతూ ఆయన ఈ మేరకు వ్యాఖ్యానించారు. ఈ సమావేశంలో తాజా రాజకీయ పరిణామాలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు.
'నాపై దాడి చేయడం అంటే రాష్ట్రాన్ని బలహీనపరచడమే. నాపై దాడికి చూపిస్తున్న శ్రద్ధలో కొంతైనా ఏపీ అభివృద్ధిపై చూపితే ఈరోజున ఇలాంటి పరిస్థితి వచ్చేదే కాదు. అవిశ్వాసం నోటీసులసు అనుమతించకుండా మూడు రోజులుగా లోక్సభలో వాయిదాలు వేస్తున్నారు. వైసీపీ, జనసేన పార్టీలు బీజేపీ తరపున మాట్లాడుతున్నాయి..' అని చంద్రబాబు అన్నారు.
బీజేపీ నాలుగేళ్ల సమయాన్ని సద్వినియోగం చేసుకోలేదని సీఎం అన్నారు. తాము నాలుగేళ్లపాటు ఓపికగా ఎదురుచూశామని, రాష్ట్రానికి న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతోనే బీజేపీతో పొత్తు పెట్టుకున్నామని, తాము ఎక్కడా తొందరపడలేదని, ప్రతి అడుగు జాగ్రత్తగా వేస్తున్నామని తమ పార్టీ నేతలతో చంద్రబాబు అన్నారు.
తనకు పదవులు ముఖ్యం కాదని, రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని చంద్రబాబు పార్టీ నేతలతో వ్యాఖ్యానించారు. ఇప్పుడు ప్రజల హక్కుల సాధనే తన లక్ష్యమని చెప్పారు. తొలి ఏడాదిలో ఇవ్వాల్సిన లోటు నిధులను కూడా ఐదేళ్ల పాటు నాన్చారని, ఇప్పుడు లోటు కింద రూ.138 కోట్లే ఇస్తామంటున్నారని, ఏపీకి అన్యాయం చేయడమే కాకుండా, ఎదురుదాడికి కేంద్ర ప్రభుత్వం సిద్ధపడిందని సమావేశంలో చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.