హోదా, విభజన హామీలపై తేల్చేశారు: కేంద్రమంత్రులు ఏమన్నారంటే..,?
న్యూఢిల్లీ: విభజన చట్టంలోని 90 శాతం హామీలు అమలు చేశామని, మిగిలిన హామీలను కూడా అమలు చేసేందుకు కట్టుబడి ఉన్నామని హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం అమలుపై మంగళవారం రాజ్యసభలో సుమారు నాలుగు గంటల పాటు వాడీవేడిగా చర్చ జరిగింది.
Recommended Video
ఈ సందర్భంగా హోంమంత్రి రాజ్నాథ్ మాట్లాడుతూ.. విశాఖ రైల్వేజోన్ విషయంలో ఏర్పాటైన కమిటీ జోన్ ఏర్పాటుకు సానుకూలత వ్యక్తంచేయనప్పటికీ.. తాము జోన్ను ఏర్పాటు చేసి తీరుతామని చెప్పారు.
90శాతం హామీలు నెరవేర్చాం.. మిగితావి కూడా..
‘మా ప్రధాని, నాటి ప్రధాని ఇచ్చిన హామీలను తప్పకుండా అమలు చేస్తాం. ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తున్నాం. విభజన చట్టంలోని 90 శాతం హామీలు అమలు చేశాం. మిగిలిన హామీలను అమలు చేసేందుకు కట్టుబడి ఉన్నాం. కడప స్టీల్ప్లాంట్, దుగరాజపట్నం పోర్టు, రైల్వేజోన్, ఇతర అంశాలపై కమిటీ ఏర్పాటు చేస్తాం. రెండు తెలుగు రాష్ట్రాల్లో స్టీల్ప్లాంట్ల ఏర్పాటుకు టాస్క్ఫోర్స్ కమిటీ ఏర్పాటు చేశాం. రైల్వేజోన్కు సంబంధించి ఏర్పాటు చేసిన కమిటీ సానుకూలత చూపలేదు. అయినా పరిశీలిస్తాం. రైల్వేజోన్ను ఏర్పాటు చేసి తీరుతాం. ప్రత్యేక హోదా, ప్రత్యేక కేటగిరీ మధ్య నిధులు కేటాయింపులో ఎలాంటి వ్యత్యాసమూ లేదు. ప్యాకేజీ ద్వారా ఇంకా ఎక్కువ నిధులే ఇస్తున్నాం. పోలవరం ఆంధ్రప్రదేశ్ జీవనాడి, తెలంగాణలోని ఏడు మండలాలను తొలి కేబినెట్ భేటీలోనే ఏపీలో కలిపాం. పోలవరం ప్రాజెక్టును రికార్డు సమయంలో పూర్తి చేస్తామని హామీ ఇస్తున్నాం' అని రాజ్నాథ్ వివరించారు.
చంద్రబాబు ఆమోదంతోనే ప్యాకేజీ ఇచ్చాం
‘ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆమోదం తీసుకున్న తర్వాతే ప్రత్యేక ప్యాకేజీకి తుదిరూపు ఇచ్చాం. ఏపీకి ప్రత్యేకంగా నిధులు సమకూర్చేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నాం. రెవెన్యూ లోటు భర్తీ చేస్తామని చెప్పాం. రెవెన్యూ లోటు కింద ఐదేళ్లలో రూ.22,123 కోట్లు ఇస్తాం. ఈఏపీలకు సంబంధించిన రుణాలను కేంద్రమే చెల్లిస్తుంది. ప్రత్యేక హోదా కంటే ప్రత్యేక ప్యాకేజీ ద్వారానే ఎక్కువ లాభం చేకూరుతుందని సీఎం చంద్రబాబు కూడా చెప్పారు. ప్యాకేజీ ఇచ్చినందుకు అసెంబ్లీలో కూడా తీర్మానం చేసి, కేంద్రమంత్రులకు సన్మానాలు కూడా చేశారని గుర్తు చేశారు. వెనుకబడిన జిల్లాలకు రూ.1,050 కోట్లు ఇచ్చాం. రాజధానిని రైల్వే, రోడ్డు మార్గాల ద్వారా అనుసంధానం చేసేందుకు అవసరమైన ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తాం' అని రాజ్నాథ్ చెప్పారు.
తెలుగు రాష్ట్రాల సీఎంలు కలిసి..
‘ఎన్డీయే నుంచి టీడీపీ బయటకు వచ్చింది. ఒక రాజకీయ పార్టీగా టీడీపీ ఏ నిర్ణయమైనా తీసుకోవచ్చు. దానిపై నేను వ్యాఖ్యలు చేయను. విభజన చట్టం అమలుకు ఏమీ చేయలేదని రాజకీయ పార్టీలు చెప్పడం సరికాదు. విభజన హామీలకు సంబంధించి వ్యక్తిగతంగా చొరవ తీసుకుని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా. తెలుగు రాష్ట్రాల సీఎంలు ఒక ఒప్పందానికి వచ్చి సమస్యలు పరిష్కరించుకోవాలి. ఆంధ్రప్రదేశ్కు అన్ని విధాలుగా సాయం చేస్తాం' అని రాజ్నాథ్ స్పష్టం చేశారు.
హోదాపై తేల్చేసిన రాజ్నాథ్..
రాజ్నాథ్ ప్రసంగిస్తున్న సమయంలో కాంగ్రెస్ సభ్యులు గులాం నబీ ఆజాద్, జైరాం రమేష్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తారా? లేదాణి అని కేంద్రాన్ని నిలదీశారు. దీంతో హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ సమాధానమిస్తూ.. ప్రత్యేక ప్యాకేజీ ద్వారా హోదా కంటే ఎక్కువ నిధులు ఇస్తున్నప్పుడు.. ఇక హోదా ఎందుకని ఎదురుప్రశ్నించారు. ఇప్పటికే హోదాపై స్పష్టం చేశామని, హోదా కాకుండా ప్యాకేజీ ద్వారానే ఏపీకి నిధులు మంజూరు చేస్తామని తేల్చి చెప్పారు.
చంద్రబాబు అప్పుడు ధన్యవాదాలు చెప్పారు
కేంద్ర ఆర్థిక మంత్రి, రైల్వే మంత్రి పీయూష్ గోయల్ సభలో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం హామీల అమలుకు కట్టుబడి ఉన్నామని అన్నారు. ఏపీ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందన్నారు. ఏ రాష్ట్రానికీ హోదా ఇవ్వొద్దని 14వ ఆర్థిక సంఘం చెప్పిందన్నారు. ఏపీకి చేస్తున్న సాయానికి ధన్యవాదాలు చెబుతూ సీఎం చంద్రబాబు లేఖ రాశారని గుర్తుచేశారు. రెవెన్యూ లోటు కింద ఏపీకి ఐదేళ్లలో రూ.22వేల కోట్లు ఇవ్వాలని 14వ ఆర్థిక సంఘం చెప్పిందన్నారు. ఏపీపై కేంద్రం ప్రత్యేక దృష్టి సారించిందని చెప్పారు.
విజయనగరం, అనంతపురంలలో యూనివర్సిటీలు
మరో కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ మాట్లాడుతూ.. టీడీపీ మా కూటమి నుంచి బయటకు వెళ్లిపోయినా ఏపీ అభివృద్ధి ఆగదని, కేంద్ర సాయంతో ఏపీలో జాతీయ విద్యా సంస్థలు ప్రారంభమయ్యాయని అన్నారు. విజయనగరంలో ట్రైబల్ యూనివర్శిటీ ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. అనంతపురంలో సెంట్రల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని చెప్పారు.