ఇకపై భూ రికార్డులన్నీ డిజిటలైజేషన్...మోసాలకు తావుండదు:మంత్రి లోకేష్
అమరావతి:మోసాలకు తావు లేకుండా భూ రికార్డులన్నీ డిజిటలైజేషన్ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఐటీ శాఖా మంత్రి లోకేశ్ వెల్లడించారు. ఇందుకోసం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లోని దస్త్రాలను డిజిటలీకరణ చేయడం, బ్లాక్ చైన్ టెక్నాలజీ వేదిక మీదకు తేవడం జరుగుతుందన్నారు.
మంగళవారం మంత్రి లోకేష్ బ్లాక్ చైన్ టెక్నాలజీ విషయమై చర్చించేందుకు రెవెన్యూ అధికారులు, ఫస్ట్ అమెరికా సంస్థ ఇండియా విభాగం ఉపాధ్యక్షులు రఘు, సీనియర్ మేనేజర్ శ్రీనివాసరావుతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా భూ రికార్డుల డిజిటలైజేషన్ తో సహా వివిధ టెక్నాలజీ డెవలప్ మెంట్ అంశాలను ఈ సమావేశంలో చర్చించారు.
రైతులకు...ప్రయోజనకరం
భూ రికార్డుల డిజిటలీకరణ వల్ల రైతులు తక్కువ సమయంలోనే టైటిల్ బీమా, రుణాలు పొందే అవకాశం లభిస్తుందన్నారు. పైలెట్ ప్రాజెక్టు కింద ఇప్పటికే గన్నవరం కార్యాలయంలో చేపట్టిన ప్రక్రియలో 3,47,862 రికార్డులను విజయవంతంగా డిజిటలీకరణ చేసినట్లు లోకేష్ తెలిపారు. దేశంలోనే తొలి డిజిటలైజ్డ్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుగా గన్నవరం కార్యాలయం నిలిచిందని మంత్రి లోకేశ్ చెప్పారు.
Recommended Video
తొలిదశలో ఇలా...ఆపై
మొదటి దశలో 25 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో, ఆపై రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 290 కార్యాలయాల్లో దీన్ని అమలు చేస్తామన్నారు. ఇందుకోసం రాష్ట్రంలో అభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటుచేయాలని ఫస్ట్ అమెరికా ప్రతినిధులను మంత్రి లోకేష్ కోరారు.
ఫైబర్ గ్రిడ్...గ్రామీణ యువత
అలాగే గ్రామీణ యువత ఫైబర్ గ్రిడ్ని వినియోగించుకుని ఇంటి నుంచే పని చేసుకునేలా ఒక నమూనాను అభివృద్ధి చేయాలని మంత్రి లోకేష్ వారికి సూచించారు. రికార్డుల డిజిటలీకరణ కార్యక్రమంలో భాగంగా డ్వాక్రా మహిళలు, గృహిణులు, యువతకు శిక్షణ ఇచ్చి ఇంటి నుంచే పని చేసుకునే విధంగా కార్యాచరణ రూపొందించాలన్నారు.
పైలెట్ ప్రాజెక్ట్...అమలు
మంత్రి సూచనలపై స్పందించిన ఫస్ట్ అమెరికా ప్రతినిధులు సంబంధిత పైలెట్ ప్రాజెక్టును కొన్ని గ్రామాల్లో అమలుపరిచి చూస్తామన్నారు. ఏపీటీఎస్ భాగస్వామ్యంతో గన్నవరంలో చేపట్టిన భూ దస్త్రాల డిజిటలీకరణ మంచి ఫలితాలను ఇచ్చిందని, త్వరలోనే విజయవాడలో కంపెనీ ఏర్పాటుచేసి కార్యకలాపాలు విస్తరిస్తామని వారు మంత్రి లోకేష్ కు హామీ ఇచ్చారు.