అన్ని పార్టీల చూపు మే 23 వైపే..! ఏపికి మాత్రం ప్రత్యేకం.. ప్రమాదం..!!
అమరావతి/హైదరాబాద్ : అవును మే 23న ఎన్నికల ఫలితాలు వస్తాయి. విజేత ఎవరో తెలుస్తుంది. తరువాత రెండుమూడ్రోజుల్లో కొత్త ప్రభుత్వ ఏర్పాటవుతుందనేది సహజంగా అందరి నుంచి వినిపించే అభిప్రాయం. కానీ.. అంతకుమించి ఇంకేమైనా జరిగే అవకాశం లేకపోలేదా! అంటే జరగొచ్చు. ఏప్రిల్ 11న ఎన్నికల రోజున ఏపీలో రగిలిన హింస.. మే 23న పునరావృతం కావచ్చనేది నిఘావర్గాల అంచనా. నిజమే.. టీడీపీ, వైసీపీ లకు ఈ ఎన్నికలు జీవన్మరణ సమస్య. పార్టీ మనుగడకు.. నేతల ఎదుగుదలకు ఇవి చాలా కీలకమైన ఎన్నికలు. అందుకే ఏపిలో ని ప్రధాన పార్టీలు మే 23కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. ఆ రోజు రాజకీయ పార్టీలకు ఎంత ప్రత్యేకమో అంతే ప్రమాదమనే చర్చ కూడా జరుగుతోంది.
అందరి ద్రుష్టి మే 23పైనే..! ఆసక్తిగా ఎదురుచూస్తున్న పార్టీలు..!!
అయితే.. ఏపీ జనం ఎటువైపు మొగ్గుచూపారు. ఎవరిని గద్దెనెక్కిస్తారనేది ఉత్కంఠతగా మారింది. ఇప్పటికే రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో గ్రామాల్లో పరిస్థితులు చాలా గంబీరంగా ఉన్నాయి. ఎన్నికలు ముగిసిన వారంరోజుల వరకూ గొడవలు, తగాదాలతో మార్మోగాయి. పరిస్థితి అదుపులోకి వచ్చినట్టుగా కనిపించినా చాపకిందనీరులా లోలోపల కోపతాపాలు రగులుతూనే ఉన్నాయి. దీనికి వేదికగా మే 23న తేల్చుకోవచ్చనే ఆలోచనతో ఉన్న వారితో మున్ముందు సమస్య తప్పకపోవచ్చనేది పోలీసువర్గాల అభిప్రాయంగా తెలుస్తోంది.
గెలిచిన పార్టీ సంబరాలు..! గెలవని పార్టీ బెంబేలేనా..!!
ఏపీలో ఎన్నికలు సవాల్గా మారతాయని ముందుగానే ఊహించింది. ఎందుకంటే వైసీపీ ఎలాగైనా గెలిచి ప్రతిపక్ష పాత్ర నుంచి అధికారపక్షంలోకి వచ్చేందుకు అనువైన అన్నిమార్గాలను ఎంచుకుంది. అదే సమయంలో టీడీపీ కూడా మరోసారి అధికారం చేపట్టి వైసీపీ, జనసేనలను పూర్తిగా తుడిచిపెట్టాలనే పథక రచనతో పావులు కదిపింది. దీనిద్వారా చంద్రబాబు జాతీయరాజకీయాల్లో చక్రం తిప్పటమేగాకుండా.. నరేంద్రమోదీను దెబ్బతీసినట్లవుతుందనేది టీడీపీ అంతరంగం. కానీ వైసీపీ మాత్రం బాబును బోనులో నిలబెట్టి.. జగన్కు అంటించిన అవినీతి ముద్రను అంటించేందుకు అనువైన మార్గం అధికారంలోకి రావటమే అనేంత వరకూ చేరింది.
ఫలితాల తర్వాత ఉద్రిక్త పరిస్థితులు..! అప్రమత్తమైన యంత్రాంగం..!!
వైసీపీ, టీఆర్ఎస్, బీజేపీ ఉమ్మడి ప్రత్యర్థిగా టీడీపీ మారటంతో.. దీన్ని అవకాశంగా మలుచుకుని ఏపీ ప్రజల్లో సెంటిమెంట్ రగిలించేందుకు చంద్రబాబు చివరి నిమిషం వరకూ ప్రయత్నించారు. కానీ.. రాజకీయ చైతన్యం గల ఏపీ ప్రజలు తమ తీర్పు ఎలా ఉండబోతుందనేది మాత్రం బహిర్గతం చేసేందుకు ఇష్టపడలేదు.. ఇప్పుడూ ఇష్టపడట్లేదు. దీంతో ఎన్నికల రోజు గొడవకు దారితీయటంలో ఇది కూడా ప్రధాన కారణమని తెలుస్తోంది. కానీ గత సంప్రదాయానికి భిన్నంగా ఓటర్లు హుందాగా వ్యవహరించటంతో ప్రధానపార్టీల గొంతులో వెలక్కాయపడినట్టుగా మారింది.
హుందాగా వ్యవహరించాలి..! రాజకీయ పార్టీలకు సూచనలు..!!
దీంతో తమ అక్కసును ఒకర్నొకరు రెచ్చగొట్టుకోవటం ద్వారా వ్యక్తపరిచారు. మరి మే 23న ఫలితాలు.. ప్రతికూలంగా వచ్చిన పార్టీ, నాయకులు ఊరకనే ఉంటారా.. ప్రజాతీర్పును గౌరవిస్తారా! అంటే కష్టమే అనేది పోలీసువర్గాల అంచనా. ఈ లెక్కన.. ఏపీలో మే 23వ తేదీ శాంతిభద్రతల పరిస్థితి ఎలా ఉండబోతుందనేది అంచనా వేయటం కూడా కష్టంగా మారింది. దీనికోసం ముందుగానే పారామిలటరీ ఫోర్స్ను రంగంలోకి దింపేందుకు అధికార యంత్రాంగం సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. అందుకే ఫలితాలు వెలువడే రోజు రాజకీయ పార్టీలకు ఎంత ప్రత్యేకమో అంతే ప్రమాదమనే చర్చ కూడా జరుగుతోంది.