రాజు గారు..వెల్డన్: వైసీపీ ఎంపీకి అఖిలపక్ష నేతల అభినందనలు: బీజేపీ తర్జన భర్జన వేళ..!
వైసీపీ నుండి నర్సాపురం లోక్ సభ సభ్యుడిగా గెలిచిన కనుమూరి రఘురామ కృష్ణంరాజు ఈ పార్లమెంట్ సమావేశాల్లో..ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ అవుతున్నారు. ఇంగ్లీషు మీడియం స్కూళ్ల మీద చేసిన వ్యాఖ్య ల పైన సీఎం జగన్ సీరియస్ అవ్వటంతో..స్వయంగా ముఖ్యమంత్రికి వివరణ ఇచ్చి ఆ వివాదానికి ముగింపు పలికారు. పార్లమెంట్ సెంట్రల్ హాల్ లో స్వయంగా ప్రధాని పలకరించటం ద్వారా..తనకు ప్రధానితో ఉన్న సాన్నిహిత్యాన్ని చాటుకున్నారు.
బీజేపీ పార్టీ ఆఫీసులో కూర్చొని మరో చర్చకు కారణమయ్యారు. ఇక, ఇప్పుడు అఖిలపక్ష సమావేశంలో వైసీపీ నుండి హాజరై అక్కడ కీలక అంశంలో చొరవ తీసుకొని మరో సారి వార్తల్లో నిలిచారు. బీజేపీ తర్జన భర్జన పడుతున్న సమయాన చొరవ చూపించి..సమస్య పరిష్కరించారంటూ అఖిల నేతలు అభినందించినట్లు తెలుస్తోంది.
రాజు గారు...శభాష్..!
వైసీపీ ఎంపీ రఘురామ రాజుకు పార్లమెంట్ అఖిలపక్ష భేటీలో వ్యవహరించిన తీరు ఇప్పుడు జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. బీజేపీ ఎంపీ ప్రజ్ఞాసింగ్ తాజాగా వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు. నాథూరామ్ గాడ్సేను దేశభక్తుడిగా కొనియాడారు. దీంతో..బీజేపీ అధినాయకత్వం తమ పార్టీకే చెందినప్పటికీ..వివాదాస్పద వ్యాఖ్యల ఫలితంగా.. పార్లమెంటరీ కమిటీ నుండి తొలిగించింది. ఇక, ఆ వ్యాఖ్యల పైన రభస సాగుతుండటంతో స్పీకర్ అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసారు. ఆ సమయంలో చాలా సేపటి వరకు వ్యవహారం కొలిక్కి రాకపోవటంతో...జోక్యం చేసుకున్న రఘురామ రాజు తన ప్రయత్నంతో ఆ అంశాన్ని కొలిక్కి తేవటంలో సక్సెస్ అయ్యారు. దీంతో..ఆయన్న అఖిల పక్ష నేతలు అభినందించినట్లు సమాచారం.
వైసీపీ నుండి హాజరైన రఘురామరాజు..
లోక్ సభ స్పీకర్ ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశానికి వైసీపీ లోక్సభ నాయకుడు మిథున్రెడ్డి బదులు ఈ సమావేశానికి రఘురామకృష్ణంరాజు హాజరయ్యారు. ప్రజ్ఞా క్షమాపణ కోసం శుక్రవారం కూడా పార్లమెంటులో ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. సభ నడిచే పరిస్థితి లేకపోవడంతో సభాపతి ఈ అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ప్రజ్ఞాతో క్షమాపణ చెప్పించే విషయమై బీజేపీ నాయకులు చాలాసేపు తర్జనభర్జనపడ్డారు. అది గమనించిన రఘురామకృష్ణంరాజు.. అఖిలపక్ష నాయకుల ఎదుట క్షమాపణ చెప్పేలా సాధ్వీని ఒప్పించారని తెలిసింది. ఆ సమావేశం నుంచి బయటకొచ్చిన పలు పార్టీల సభ్యులు.. చాలా బాగా సమన్వయం చేశారంటూ రఘురామకృష్ణంరాజును అభినందించినట్టు సమాచారం.
బీజేపీ నేతలు తర్జన భర్జన పడుతున్నా..
పార్లమెంట్ సమావేశాల్లో తమ సహకారం కావాలంటే ప్రజ్ఞా క్షమాపణ చెప్పాల్సిందేనని పట్టు బట్టాయి. ప్రజ్ఞా వ్యాఖ్యల మీద బీజేపీ అధినాయకత్వం సైతం ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే, ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్న విధంగా క్షమాపణ చెప్పించే విషయంలో తర్జన భర్జన పడింది. దీంతో..వైసీపీ నుండి హాజరైన రఘురామ రాజు చొరవ చూపించారు. అఖిలపక్ష నాయకుల ఎదుట క్షమాపణ చెప్పేలా సాధ్వీని ఒప్పించటం సక్సెస్ అయ్యారు. దీంతో..బీజేపీ ప్రతిక్షాల ముందు వివరణ ఇచ్చుకోవాల్సిన అవసరం లేకుండానే ప్రజ్ఞాసింగ్ క్షమాపణ చెప్పటానికి సిద్దపడటంతో వివాదం ముగిసింది. దీంతో..ఇప్పుడు వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు అఖిల పక్ష నేతల అభినందనలు అందుకోవటం ద్వారా.. జాతీయ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా నిలిచినట్లు ప్రచారం జరుగుతోంది.