రాజ్యసభకు ఆ మంత్రి- నియోజకవర్గంలో వైసీపీ, టీడీపీ నేతలు హ్యాపీ- ఎందుకంటే.... !
ఏపీలో కులం, ప్రాంతం, వర్గం పేరుతో జరిగే రాజకీయాలు సామాన్యులకు ఓ పట్టాన అర్ధం కావు. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురంలో పిల్లి సుభాష్ చంద్రబోస్ రాజకీయం కూడా అలాంటిదే. సొంత పార్టీ వైసీపీతో పాటు ప్రత్యర్ది పార్టీ టీడీపీలో నేతలు కూడా ఆయన పేరు చెబితేనే మండిపడుతుంటారు. గతేడాది అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయినా ఆయనకు రెవెన్యూ మంత్రి కమ్ డిప్యూటీ సీఎం పదవులు దక్కడం ఆయన ప్రత్యర్ధులకు రుచించడం లేదు. కానీ తాజాగా మండలి రద్దు నేపథ్యంలో ఆయన్ను రాజ్యసభకు పంపాలన్న సీఎం జగన్ నిర్ణయం తిరిగి వారిలో సంతోషం నింపుతోంది.
బోస్ రాజకీయ ప్రస్ధానం..
తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురంలో తన రాజకీయ ప్రస్ధానం ప్రారంభించిన పిల్లి సుభాష్ చంద్రబోస్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబానికి అత్యంత సన్నిహితుడు. 2004కు ముందే వైఎస్ కుటుంబంతో ఆయనకున్న పరిచయం ఆయన్ను రాజశేఖర్ రెడ్డి కేబినెట్ లో రెండుసార్లు మంత్రి అయ్యేందుకు పనికొచ్చింది. రామచంద్రపురం నియోజకవర్గం నుంచి 2004, 2009లో వరుసగా గెలిచిన బోస్.. వైఎస్ మరణం తర్వాత ఏర్పడిన రోశయ్య కేబినెట్ లోనూ మంత్రిగా ఉన్నారు. అయితే జగన్ వైసీపీ స్ధాపించిన తర్వాత బోస్.. కేబినెట్ మంత్రి, ఎమ్మెల్యే పదవులను వదులుకుని ఆ పార్టీలో చేరిపోయారు. తద్వారా వైఎస్ కుటుంబం కోసం తన నిబద్ధత ఏంటో చాటుకున్నారు.
వైసీపీలో బోస్ ప్రస్ధానం..
పేరుకు వైసీపీలో చేరారనే కానీ తన సొంత నియోజకవర్గం రామచంద్రపురంలో మాత్రం బోస్ తన పునర్ వైభవాన్ని కోల్పోయారు. అప్పట్లో జగన్ కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంతో టీడీపీ జట్టు కట్టిందన్న కారణంతో జగన్ తనకు మద్దతుగా వచ్చిన 18 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించి ప్రజాతీర్పు కోరారు. ఉప ఎన్నికల్లో తన తల్లి విజయమ్మతో పాటు 16 మందిని గెలిపించుకున్న జగన్... తన కుటుంబానికి అత్యంత విధేయుడైన బోస్ ను మాత్రం గట్టెక్కించలేకపోయారు. దీనికి గతంలో మంత్రిగా ఉన్నప్పుడు బోస్ వ్యవహారశైలే అంటారు.
కలిసిరాని సమీకరణాలు...
బీసీల్లోని శెట్టిబలిజ సామాజికవర్గానికి చెందిన బోస్.. మంత్రిగా ఉన్న కాలంలో తన వాళ్లకు మాత్రమే మేలు చేశారని, మిగిలిన కులాలను పట్టించుకోలేదనే ప్రచారం ఉంది. చివరకు అదే ఆయన్ను కొందరివాడిగా మిగిల్చింది. అదీ ఏ స్ధాయిలో అంటే రెండుసార్లు ప్రాతినిధ్యం వహించిన రామచంద్రపురంలో తర్వాత రెండుసార్లు ఓడిపోయారు. చివరికి 2019లో అధినేత జగన్ ఆదేశంతో రామచంద్రపురం పక్కనే ఉన్న మండపేటకు మారినా అక్కడ కూడా ఓడిపోయారు. అయితే అప్పటికే ఎమ్మెల్సీగా ఉన్న బోస్ ను జగన్ తన కేబినెట్ లో రెవెన్యూ మంత్రిగా తీసుకుని డిప్యూటీ సీఎం హోదా కట్టబెట్టారు.
ఓడినా పదవులు రావడం మరో శాపం..
అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా మూడు సార్లు ఓటమి పాలయ్యారు బోస్. రామచంద్రపురం నుంచి ఉప ఎన్నికలో ఓసారి, సాధారణ ఎన్నికల్లో మరోసారి, తాజాగా మండపేట నుంచి ఇంకోసారి బోస్ ఓటమి పాలయ్యారు. అయినా వైఎస్ కుటుంబంపై విశ్వాసంతో గతంలో చేసిన రాజీనామా ఆయన విధేయత దృష్ట్యా జగన్ రెవెన్యూ మంత్రితో పాటు డిప్యూటీ సీఎం పదవి ఇచ్చి గౌరవించారు. అదే ఆయన ప్రత్యర్దులకు కంటగింపుగా మారింది. పేరుకు డిప్యూటీ సీఎం అయినా కానీ ఆయన పెత్తనాన్ని సహించలేక సొంతపార్టీ నేతలు సైతం ప్రత్యర్ధులతో కలిసి నియోజకవర్గంలో గ్రూపులు కట్టడం మొదలుపెట్టారు. చివరికి ఆయనకు చిరకాల ప్రత్యర్ధిగా ఉన్న రామచంద్రపురం మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులును సైతం వైసీపీలోకి తీసుకొఛ్చేశారు. చివరకు దాన్ని కూడా బోస్ వ్యతిరేకించినా ఫలితం లేకుండా పోయింది.
Recommended Video
వైసీపీలోకి తోట రాకతో....
గతంలో రామచంద్రపురంలో తనను వరుసగా రెండుసార్లు ఓడించిన తోట త్రిమూర్తులును బోస్ ప్రత్యర్ధులు ఏకంగా వైసీపీలోకి తీసుకొచ్చారు. దీంతో ఆయన వైసీపీలోకి రాగలరేమో కానీ రాజకీయం మాత్రం తన నుంచి లాక్కోలేరని పలుమార్లు తన అభిమానుల వద్ద తేల్చిచెప్పారు. అయినా ఆయన ప్రత్యర్దులు ఇన్నాళ్లూ అవకాశం కోసం ఎదురుచూస్తూ వచ్చారు. చివరకు మండలి రద్దు, రాజ్యసభకు ఆయన్ను జగన్ ఎంపిక చేసిన రూపంలో వారికి అవకాశం వచ్చింది. ఇప్పుడు బోస్ రాజ్యసభకు వెళ్లనుండటంపై సొంత పార్టీలోని తోట త్రిమూర్తులతో పాటు టీడీపీ నేతలు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అంటే ఓడినా, గెలిచినా బోస్ నియోజకవర్గంలో ఉంటే తమకు ఎప్పటికైనా ఇబ్బందేనని భావించే నేతలు ఉండటం ఆయన రాజకీయం ఏ స్ధాయిదో స్పష్టం చేస్తోంది.