రైతులను సంతోషపరిచేలా నిర్ణయం..? అన్నీ ప్రాంతాల అభివృద్ధే ధ్యేయం: పార్థసారధి
ఏపీలో రాజధాని హీట్ సెగలు రేపుతోంది. మరికొన్ని గంటల్లో మంత్రివర్గ సమావేశం జరగనుండటంతో.. వేడి పీక్కి చేరింది. ఈ క్రమంలో వైసీపీ నేత పార్ధసారథి స్పందించారు. రైతులను సంతోషపరిచేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. దీంతో క్యాబినెట్లో జీఎన్ రావు కమిటీ సూచనలపై ఏ నిర్ణయం తీసుకుంటారనే ఉత్కంఠ నెలకొంది.
రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలని సీఎం జగన్ ఆలోచిస్తున్నారని పార్థసారథి పేర్కొన్నారు. అందుకోసమే రాజధానిపై కమిటీ వేశారని గుర్తుచేశారు. రాజధానికలో సకల వసతులు ఉండాలంటే రూ.లక్ష 10 వేల కోట్లు అవసరమవుతాయని చెప్పారు. కానీ చంద్రబాబు మాత్రం గ్రాఫిక్స్ చూపి అభివృద్ధి అని మోసం చేశారని విరుచుకుపడ్డారు.
తమ ప్రభుత్వం రైతులు, కూలీలు సంతృప్తిపడేలా నిర్ణయాలు తీసుకుంటుందని చెప్పారు. రాజధాని పెట్టుబడి తగ్గించి ఇరిగేషన్ ప్రాజెక్టుల, విద్యాభివృద్ది, మౌలిక వసతులకు ప్రాధాన్యం ఇస్తామని సంకేతాలు ఇచ్చారు. దీంతో రాష్ట్రం త్వరితగతిన అభివృద్ధి చెందుతుందని చెప్పారు. ఎలాంటి పరిశ్రమలు తీసుకొస్తే రాష్ర్టం అభివృద్ధి చెందుతుందో అనే అంశంపై ప్రభుత్వం ఆలోచిస్తుందని పార్థసారధి పేర్కొన్నారు.
మరోవైపు ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకున్నది. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా మారబోతున్న విశాఖపట్టణానికి 394.50 కోట్లు విడుదల చేసింది. రహదారుల నిర్మాణం, మౌలిక వసతుల కల్పన కోసం ఏడు జీవోలు విడుదల చేసింది. అమరావతి రాజధాని మార్చొద్దని రాజధాని రైతులు కోరుతుంటే, జగన్ ప్రభుత్వం మాత్రం కార్యనిర్వహక రాజధాని ఏర్పాటు దిశగా అడుగులు వేస్తోంది.