కోవింద్ గెలుపు ఖాయం!: వైసిపి-టిడిపి సిద్ధం, టిఆర్ఎస్ మాక్ పోలింగ్
రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో ఆదివారం సాయంత్రానికల్లా విజయవాడ చేరుకోవాలని తమ తమ పార్టీ ఎమ్మెల్యేలకు టిడిపి, వైసిపి అధిష్టానాలు ఆదేశాలు జారీ చేశాయి.
న్యూఢిల్లీ/హైదరాబాద్/అమరావతి: రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో ఆదివారం సాయంత్రానికల్లా విజయవాడ చేరుకోవాలని తమ తమ పార్టీ ఎమ్మెల్యేలకు టిడిపి, వైసిపి అధిష్టానాలు ఆదేశాలు జారీ చేశాయి.
సోమవారం రాష్ట్రపతి ఎన్నికల ఓటింగ్ జరగనుంది. ఉదయం ఎనిమిది గంటలకు వెలగపూడి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో ఎమ్మెల్యేలు సమావేశం కానున్నారు. పోలింగ్ విధానాన్ని ఎమ్మెల్యేలకు టిడిపి నేతలు వివరిస్తారు.
అనంతరం 10 గంటలకు చంద్రబాబు తొలి ఓటు వేస్తారు. వైసిపి ఎమ్మెల్యేలు కూడా ఆదివారం సాయంత్రానికల్లా విజయవాడ వస్తారు. ఓటింగ్ విధానం తదితర అంశాలపై ఆ పార్టీ అధ్యక్షులు జగన్ ఆధ్వర్యంలో సమావేశమవుతారు.
తెరాస మాక్ పోలింగ్
హైదరాబాదులోని తెలంగాణ భవన్లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్ఎల్పీ సమావేశమైంది. ఈ సందర్భంగా రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటింగ్ విధానంపై అవగాహన కల్పించేందుకు మాక్ పోలింగ్ నిర్వహించారు.
ఎన్డీఏ అభ్యర్థి రామ్నాథ్ కోవింద్కు తెరాస మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. ఆయనకు మద్దతుగా వేసే పార్టీ ఎమ్మెల్యేల ఓట్లలో ఒక్కటి కూడా వృథా కాకుండా చూసేందుకు, ఆ మేరకు వారికి అవగాహన కల్పించడానికి మాక్ పోలింగ్ నిర్వహించారు.
మాక్ పోలింగ్ అనంతరం ఎమ్మెల్యేలకు విద్యార్థివిభాగం రాష్ట్ర కమిటీ సభ్యులను సీఎం కేసీఆర్ పరిచయం చేశారు. విద్యార్థి విభాగం నాయకులకు నియోజకవర్గస్థాయిలో సహాయ సహకారాలు అందించాలన్నారు.
రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి రామ్ నాథ్ కోవింద్ గెలుపు ఖాయంగా కనిపిస్తోంది. ఆయనకు డెబ్బై శాతం ఓట్లు పడనున్నాయి. విపక్షాల అభ్యర్థి మీరా కుమార్కు ఓటమి ఖాయమంటున్నారు.