వైసీపీకి ప్రతిష్ఠాత్మకంగా - లక్ష్యం చేరుతుందా : నేడే ఆత్మకూరు బై పోల్ ఫలితాలు..!!
నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఉప ఎన్నిక ఫలితాలు కాసేపట్లో వెల్లడి కానున్నాయి. ఉప ఎన్నిక అయినా దీనిని వైసీపీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. మంత్రిగా పని చేస్తూ మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మరణంతో ఈ ఉప ఎన్నిక జరిగింది. మేకపాటి కుటుంబం నుంచి గౌతమ్ సోదరుడు విక్రమ్ బరిలో నిలిచారు. షెడ్యూల్ కు ముందు నుంచే ఆయన ప్రజల్లోకి వెళ్లారు. నియోజకవర్గంలో తమకు ఉన్న పరిచయాలు..ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరిస్తూ ప్రచారం నిర్వహించారు. ఈ ఎన్నికల్లో టీడీపీ - జనసేన బరిలో లేవు. బీజేపీ మాత్రం తమ అభ్యర్ధి గా భరత్ కుమార్ ను పోటీలో దించింది.
లక్ష్యం లక్ష ఓట్ల మెజార్టీ
ఈ నెల 23న ఉప ఎన్నిక జరిగింది. 64 శాతానికి పైగా పోలింగ్ నమోదైంది. ఈ ఎన్నికల కోసం వైసీపీ జిల్లా నేతలతో పాటుగా ఒక్క మండలానికి మంత్రులు - సీనియర్ నేతలను ఇంఛార్జ్ లుగా నియమించారు. వారు మండలాల్లో ప్రచారం చేసారు. వైసీపీ ఈ ఎన్నికల్లో గెలుపు పైన ధీమాగా ఉంది. తమ లక్ష్యం లక్ష ఓట్ల మెజార్టీ అంటూ చెప్పుకొచ్చింది. ఇక, సార్వత్రిక ఎన్నికలకు ఏపీలో దాదాపుగా అన్ని పార్టీలు సిద్దం అవుతున్న సమయంలో జరుగుతున్న ఉప ఎన్నిక కావటంతో దీని పైన ఆసక్తి నెలకొని ఉంది.
వైసీపీలో అంతర్గత సమస్యలతో
ఇక్కడ వైసీపీ గెలుపు ఖాయమని ఆ పార్టీ నేతలు చెబుతున్నా.. అది కేవలం ఉపశమనంగా మారుతుందా లేదా లక్ష మెజార్టీ లక్ష్యం నెరవేరుతుందా అనేది చూడాలి. నియోజకవర్గం లో వైసీపీ నేతలే మధ్య గ్రూపు తగాదాలు ఎన్నికల వేళ బయట పడ్డాయి. అటు టీడీపీ పోటీలో లేకపోయినా బద్వేలు తరహాలోనే ఆత్మకూరులోనూ బీజేపీకి లోపాయికారీగా సహకరించిందంటూ వైసీపీ ఆరోపిస్తోంది. పలు మండలాల్లో టీడీపీ నేతలే బీజేపీకి ఎన్నికల ఏజెంట్లుగా పని చేసారని విమర్శలు చేసింది. దీనికి కౌంటర్ గా వాలంటీర్లు వైసీపీ ఏజెంట్లుగా వ్యవహరించారని బీజేపీ ఆరోపిస్తోంది.
మధ్నాహ్నానికి తుది ఫలితం
ఇక, ఈ రోజు ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం అవుతుంది. శివార్లలోని ఆంధ్ర ఇంజనీరింగ్ కళాశాలలో కౌంటింగ్ ప్రక్రియ చేపడుతున్నారు. మొత్తం 14 టేబుళ్లపై 20 రౌండ్లలో లెక్కింపు పూర్తి చేయనున్నారు. ముందుగా రిటర్నింగ్ అధికారి సమక్షంలో పోస్టల్ బ్యాలెట్లు లెక్కిస్తారు. అనంతరం ఈవీఎంలలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలవుతుంది. మధ్నాహ్నానికల్లా అభ్యర్థుల భవితవ్యం తేలిపోనుంది. శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలుగకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు.