నేడే ఎంపీపీ ఎన్నికలు-హోరా హోరీ స్థానాల పైనే ఉత్కంఠ : వైసీపీ తాజా వ్యూహం- ఎన్నిక వాయిదా పడితే..!!
ఏపీలో ఎంపీపీ ఎన్నికలకు రంగం సిద్దమైంది. ఈ నెల 19వ తేదీన ఫలితాలు వెల్లడైన సమయంలో రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ రోజు ఎంపీపీ..రేపు జెడ్పీ ఛైర్మన్ల ఎన్నికకు సంబంధించి నోటిఫికేషన్ జారీ చేసింది. ఇప్పటికే ఈ ఎన్నికకు సంబంధించి ఎన్నికల సంఘం విధి విధానాలను ప్రకటించింది. ఎంపీపీతో పాటుగా ప్రతి మండలానికి ఒకరు చొప్పున కో ఆప్టెడ్ సభ్యునితో పాటు మండల ఉపాధ్యక్ష పదవులకు కూడా ఎన్నికలు జరుగుతాయి. మండల పరిధిలో ఎంపీటీసీ సభ్యులుగా ఎన్నికైన వారు చేతులు ఎత్తే విధానంలో ఈ ఎన్నికలను నిర్వహిస్తారు.
ఎంపీపీ ఎన్నికలకు ప్రత్యేక సమావేశాలు
ఇందుకు సంబంధించి అన్ని చోట్ల ఎంపీడీవో కార్యాలయాల్లో ప్రత్యేక సమావేశాల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల కమిషన్తో పాటు జిల్లాలో పంచాయతీరాజ్ శాఖ అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. నిర్ణీత కోరం ప్రకారం.. మండల పరిధిలో కొత్తగా ఎన్నికైన మొత్తం ఎంపీటీసీ సభ్యుల్లో కనీసం సగం మంది హాజరైతేనే ఎంపీపీ, ఉపాధ్యక్ష పదవితో పాటు కో ఆప్టెడ్ సభ్యుల ఎన్నిక కొనసాగుతుందని అధికారులు వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 10,047 ఎంపీటీసీ స్థానాల్లోని 9,583 స్థానాల్లో ఎన్నికల ప్రక్రియ పూర్తయింది. మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రత్యేక సమావేశాలు ప్రారంభమవుతాయి.
వాయిదా వేయాల్సి వస్తే...ఇలా
ఏకగ్రీవంగా ఎన్నికైన వారితో సహా కొత్తగా ఎన్నికైన సభ్యులందరితో ఆ సమావేశంలోనే ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఆ తర్వాత కో ఆప్టెడ్ సభ్యుని ఎన్నిక నిర్వహిస్తారు. సాయంత్రం 3 గంటలకు మరొకసారి సమావేశం నిర్వహించి, తొలుత ఎంపీపీ పదవికి ఆ తర్వాత ఉపాధ్యక్ష పదవికి ఎన్నిక జరుపుతారు. కాగా, ఉదయం 10 గంటల నుంచే ఎన్నికల ప్రక్రియ ప్రారంభం అవుతుంది. ఇక, ఎన్నిక సమయంలో ఏదైనా సమస్యలు ఏర్పడి ఆప్టెడ్ సభ్యుల ఎన్నిక జరగని పక్షంలో ఆయా మండలాల్లో తదుపరి జరగాల్సిన ఎంపీపీ, ఉపాధ్యక్ష ఎన్నికలను వాయిదా వేస్తారు.
ప్రధాన పార్టీలకు ప్రతిష్ఠాత్మకంగా..
ఒకవేళ కో ఆప్టెడ్ ఎన్నిక పూర్తయి, ఎంపీపీ ఎన్నికకు ఆటంకం ఏర్పడితే, సంబంధిత మండలంలో ఆ తర్వాత జరగాల్సిన ఉపాధ్యక్ష పదవికి ఎన్నిక వాయిదా పడుతుందని రాష్ట్ర కమిషన్ కార్యాలయ అధికారులు వెల్లడించారు. శుక్రవారం జరగాల్సిన ఎన్నిక వాయిదా పడిన మండలాల్లో శనివారం ఎన్నిక నిర్వహించుకోవచ్చని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలంసాహ్ని ఇప్పటికే అన్ని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఇక, కొన్ని చోట్ల పార్టీల మధ్య ఎంపీటీసీల సభ్యుల సంఖ్య సమానంగా..లేదా ఒక సభ్యుడు తక్కువ ఉన్న చోట్ల ఎలాగైనా ఎంపీపీ పదవి దక్కించుకొనేలా ప్రధాన పార్టీలు ఫోకస్ పెడుతున్నాయి.
హోరా హోరీ స్థానాల పైనే స్పెషల్ ఇంట్రస్ట్
కడియం... దుగ్గిరాల.. చిత్తూరు జిల్లాలోని కొన్ని స్థానాలు.. ప్రకాశం జిల్లా వంటి ప్రాంతాల్లో ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి. అధికార పక్షం మీద ప్రతిపక్షం ఆరోపణలు చేస్తోంది. ఇక, ఇప్పటికే జిల్లా పరిషత్ ఛైర్మన్ పదవులు ఏ జిల్లాలో ఎవరికి ఇవ్వాలో ఖరారు చేసిన వైసీపీ అధినాయకత్వం ఎంపీపీ పదవుల విషయంలోనూ క్లారిటీ ఇచ్చింది. ఎంపీపీ గా అగ్రవర్ణాలకు చెందిన అభ్యర్ధి ఎంపిక అయితే, మండల ఉపాధ్యక్ష పదవి ఎస్సీ-ఎస్టీ-బీసీ-మైనార్టీ వర్గాలకు కేటాయించాలని అన్ని జిల్లాల పార్టీ బాధ్యులకు స్పష్టం చేసింది.
Recommended Video
వైసీపీ సామాజిక ఫార్ములా ఇలా
దీని పైన క్షేత్ర స్థాయిలో పార్టీ నేతలు భిన్న వాదనలు వినిపిస్తున్నా..సామాజిక వర్గాల ప్రాధాన్యత విషయంలో ఈ విధాన ఖచ్చితంగా అమలు కావాల్సిందేనని సీఎం తేల్చి చెప్పారు. దీంతో..అవే సమీకరణాల ఆధారంగా ఈ రోజున ఎంపీపీల ఎన్నికల ప్రక్రియ పూర్తి చేసి..శనివారం జరిగే జిల్లా పరిషత్ ఛైర్మన్ల ఎన్నికకు సిద్దం కావాలని పార్టీ నేతలను వైసీపీ అధినాయకత్వం ఆదేశించింది. జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రులు ఇప్పటికే తమ జిల్లాల్లో ఎన్నికల పరిశీలకులుగా వ్యవహరించేందుకు జిల్లాలకు చేరుకున్నారు.