రేపు భారత్ బంద్-ఏపీలో ప్రధాన పార్టీల మద్దతు-బీజేపీ, జనసేన దూరం
రైతు సంఘాలతో పాటు విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాల పిలుపు మేరకు రేపు ఏపీలో భారత్ బంద్ ను విజయవంతం చేసేందుకు సర్వం సిద్ధమైంది. కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాల్ని వ్యతిరేకిస్తున్న రైతు సంఘాలు, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్న కార్మిక సంఘాలు ఈ బంద్ కు పిలుపునిచ్చాయి.
రేపటి భారత్ బంద్ ను విజయవంతం చేసేందుకు కమ్యూనిస్టు పార్టీలతో పాటు రైతు సంఘాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఇప్పిటికే బంద్ కు అందరూ మద్దతివ్వాలని రైతు సంఘాలు ప్రచారం చేస్తున్నాయి. కమ్యూనిస్టు పార్టీల మద్దతు కూడా ఉండటంతో ఏపీలో బంద్ విజయవంతం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే సమయంలో రేపటి భారత్ బంద్ కు వైసీపీ సర్కార్ తో పాటు విపక్ష టీడీపీ కూడా మద్దతు ప్రకటించింది. దీంతో బంద్ కు విజయవంతం చేసేందుకు ఆయా పార్టీల కార్మిక సంఘాలు కూడా బరిలోకి దిగుతున్నాయి.
మరోవైపు ఈ బంద్ కు బీజేపీతో పాటు దాని మిత్రపక్షం జనసేన దూరంగా ఉండబోతున్నాయి. బంద్ కు రైతు సంఘాలు, కార్మికులు ఇచ్చిన పిలుపుపై ఇప్పటివరకూ ఈ రెండు పార్టీలు స్పందించలేదు. దీంతో బంద్ కు వీరిద్దరూ దూరంగా ఉండబోతున్నట్లు తేలిపోయింది. అయితే త్వరలో స్టీల్ ప్లాంట్ ఉద్యమంలోకి పవన్ కళ్యాణ్ వస్తారని జనసేన పార్టీ నేత నాదెండ్ల మనోహర్ ప్రకటించినా రేపటి భారత్ బంద్ కు మాత్రం జనసేన దూరంగా ఉండిపోవడం చర్చనీయాంశంగా మారుతోంది. అయితే మిత్రపక్షం బీజేపీకి ఆగ్రహం కలిగించకూడదనే బంద్ కు జనసేన దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది.
బంద్ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తోంది. బంద్ కు ప్రభుత్వం తరఫున అధికారికంగానే మద్దతిస్తున్న నేపథ్యంలో మధ్యాహ్నం వరకూ ఆర్టీసీ బస్సుల్ని తిప్పరాదని నిర్ణయించారు. మధ్యాహ్నం తర్వాతే ఆర్టీసీ బస్సులు ప్రయాణాలు సాగించబోతున్నాయి. అలాగే ప్రభుత్వ కార్యాలయాల్ని కూడా ఉదయం మూసివేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అధికారికంగా ప్రభుత్వం ఏమీ చెప్పకపోయినా బంద్ కు మద్దతిస్తున్న నేపథ్యంలో అధికారిక కార్యకలాపాలకూ అంతరాయం కలగబోతోంది.