విశాఖకు మరో వరం.. ప్రపంచ బ్యాంకు సాయం- కైలాసగిరికి కొత్త రూపు...
విశాఖపట్నం : ఏపీ కొత్త కార్యనిర్వాహక రాజధాని కాబోతున్న విశాఖపట్నాన్ని పర్యాటక హబ్గా మార్చేందుకు కీలకమైన ఓ ప్రాజెక్టుకు ప్రపంచ బ్యాంక్ సాయం అందించబోతోంది. ఎన్నో ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న ఈ ప్రాజెక్టుకు ప్రపంచబ్యాంకు తాజాగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. దీంతో అధికారులు కూడా అంతే వేగంగా టెండర్లు ఖరారు చేయడంతో పాటు పనులు ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు. అన్నీ సవ్యంగా జరిగితే విశాఖకు పాలనా రాజధాని వెళ్లే సరికి ఈ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి సిద్దమవుతుందని భావిస్తున్నారు.
ఏపీ రాజధాని బిల్లులకు గవర్నర్ ఆమోదం- విశాఖ తరలింపుకు మార్గం సుగమం...
విశాఖకు కొత్త కళ...
ఏపీ పాలనా రాజధానిగా ఎంపికైన విశాఖపట్నంలో పర్యాటక రంగానికి అనుకూలంగా ఉన్న పరిస్ధితులను అనువుగా మల్చుకుని అభివృద్ధిని కొత్త పుంతలు తొక్కించేందుకు ప్రభుత్వం సిద్దమవుతోంది. ఇప్పటికే విశాఖ నగరానికి ప్రభుత్వం తరఫున వందల కో్ట్ల రూపాయలతో కొత్త ప్రాజెక్టులు ప్రకటించిన ప్రభుత్వం.. తాజాగా ప్రపంచబ్యాంకు సాయంతో మరో ప్రాజెక్టుకు రూపకల్పన చేసింది. ఒకప్పుడు ప్రముఖ పర్యాటక కేంద్రాల్లో ఒకటిగా ఉంటూ హుద్ హుద్ తుఫాను ధాటికి దెబ్బతిన్న కైలాసగిరి కొండకు తిరిగి పునర్ వైభవం కల్పించేందుకు ప్రభుత్వం సిద్దమైంది. ఇందుకోసం ప్రపంచ బ్యాంకు సాయాన్ని వాడుకోనుంది.
రూ.61 కోట్లతో అభివృద్ధి...
380 ఎకరాల్లో విస్తరించిన కైలాసగిరి కొండపై భారీగా పచ్చదనం ఏర్పాటుతో పాటు కొత్త మార్గాల అభివృద్ధి, అమ్యూజ్ మెంట్ పార్కులు, గేమింగ్ జోన్, స్పోర్ట్స్ ఎరెనా వంటి వాటిని ఏర్పాటు చేయబోతున్నారు. ఇందుకోసం ప్రపంచ బ్యాంకు నుంచి రూ.61 కోట్ల మేర నిధులు అందబోతున్నాయి. గతంలో హుదుద్ తుఫాన్ సందర్భంగా దెబ్బతిన్న కైలాసగిరి కొండను డిజాస్టర్ రికవరీ ప్రాజెక్టు కింద అభివృద్ధి చేసేందుకు వీలుగా ప్రపంచబ్యాంకు ఈ నిధులు కేటాయించనుంది. గతంలో రూ.58 కోట్లుగా ఖరారు చేసిన అంచనా వ్యయం తాజాగా రూ.61 కోట్లకు పెంచారు. దీనికి ప్రపంచ బ్యాంకు ఆమోదం లభించడంతో పనులు ప్రారంభించేందుకు వీలుగా వీఎంఆర్డీఏ ప్రయత్నాలు చేస్తోంది.
Recommended Video
టెండర్ల ఖరారు-త్వరలో పనులు..
గతేడాది టెండర్లు వేసినా సరైన కాంట్రాక్టర్ దొరక్క వాయిదా పడ్డాయి. ఈ నేపథ్యంలో తాజాగా మరోసారి టెండర్లు పిలిచిన వీఎంఆర్డీఏ హైదరాబాద్ కు చెందిన ఓ ప్రముఖ నిర్మాణ సంస్ధకు పనులు కట్టబెట్టింది. ఏడాది లోగా పనులు పూర్తి చేసేందుకు వీలుగా టెండర్లను ఖరారు చేశారు. త్వరలోనే పనులు ప్రారంభించేందుకు వీఎంఆర్డీఏ ప్రయత్నాలు చేస్తోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే వచ్చే ఏడాది ఆగస్టు నాటికి అంటే వాస్తవంగా విశాఖ నుంచి ప్రభుత్వ పాలన ప్రారంభమయ్యే నాటికి ఈ ప్రాజెక్టు సిద్ధం కావాల్సి ఉంది. అదే జరిగితే విశాఖలో ప్రముఖ పర్యాటక కేంద్రంగా కైలాసగిరి మరోసారి పేరు తెచ్చుకోవడం ఖాయం.