స్వామి ప్రబోధానందను పట్టుకునేందుకు రంగంలోకి స్పెషల్ టీంలు:ఈసారి అరెస్ట్ ఖాయమా?
అనంతపురం:అనంతపురం జిల్లా తాడిపత్రి మండలంలోని చిన్న పొలమడ గ్రామంలో ఘర్షణలకు కారణమైన త్రైత ఆశ్రమం నిర్వాహకుడు స్వామి ప్రబోధానంద అరెస్టుకు రంగం సిద్దమయింది.
ఆయనను అదుపులోకి తీసుకునేందుకు పోలీసు శాఖ ప్రత్యేక టీంను ఏర్పాటు చేసింది. రెండురోజుల క్రితమే ఎస్పీ జీవీజీ అశోక్కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటైన ఈ టీం అజ్ఞాతంలోకి వెళ్లిన ప్రబోధానంద అలియాస్ పెద్దన్న చౌదరిని అరెస్టు చేసేందుకు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టింది. ఒకటి రెండు రోజుల్లోనే స్వామి ప్రబోధానందను అరెస్ట్ చేయడం ఖాయమనే ధీమా పోలీసుల్లో వ్యక్తం అవుతోంది.
ఘర్షణలు...కేసుల నమోదు...
సెప్టెంబరు 15న వినాయక నిమజ్జనం సందర్భంగా అనంతపురం జిల్లా తాడిపత్రి మండలంలోని చిన్న పొలమడ గ్రామంలో స్వామి ప్రబోధానంద శిష్యులకు, గ్రామస్థులకు మధ్య చెలరేగిని ఘర్షణల కారణంగా ఒకరి హత్యతో పాటు భారీగా విధ్వంసం చోటుచేసుకుంది. ఈ అల్లర్లకు బాధ్యుడిని చేస్తూ త్రైత సిద్ధాంతకర్త స్వామి ప్రబోధానందపై పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈయనతో పాటు కుమారులైన యోగానంద చౌదరి, యుగంధర్చౌదరిలపై కూడా పోలీసులు కేసులు పెట్టారు.
అజ్ఞాతంలోకి...గాలింపు ముమ్మరం
అల్లర్ల నేపథ్యంలో స్వామి ప్రబోధానంద అరెస్టుకు డిమాండ్ చేస్తూ ఎంపీ జేసీ దివాకర్రెడ్డి ఆందోళన నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే వీరిపై కేసులు నమోదు చేసి దాదాపు నెల కావస్తున్నా వీళ్లని అరెస్టు చేయక పోవడం విమర్శలకు తావిస్తోంది. ఈ నేపథ్యంలో స్వామి ప్రబోధానందతో పాటు ఆయన కుమారులను అరెస్టు చేసేందుకు జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో ప్రత్యేక టీం ఏర్పాటైంది. వీరు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. అలాగే మరోవైపు ప్రబోధానంద భక్తులపై కూడా నిఘా ఉంచారు.
పట్టుకుని తీరతాం...పోలీసులు
అయితే విధ్వంసాల అనంతరం అజ్ఞాతంలోకి వెళ్లిన స్వామి ప్రబోధానంద రెండు సార్లు సోషల్ మీడియాలోకి వచ్చి మాట్లాడిన విషయంపై కూడా పోలీసులు దృష్టి సారించారు. అయితే ప్రబోధానంద స్వామికి ఎపితో పాటు కర్ణాటక, తమిళనాడు, ఒరిస్సా తదితర రాష్ట్రాల్లో కూడా గణరీయమైన సంఖ్యలో భక్తులు ఉన్నారు. ఈ క్రమంలో పోలీసులు అన్ని కోణాల్లో నుంచి ప్రబోధానంద ఆచూకీ కోసం అన్వేషణ సాగిస్తూ ఎలాగైనా ఆయనను పట్టుకోవాలనే పట్టుదలతో ఉన్నారు.
భక్తుల రాక...తరలింపు
మరోవైపు స్వామి ప్రబోధానంద ఆశ్రమంలోకి వెళ్లేందుకు విశాఖపట్నం నుంచి వచ్చిన భక్తులు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకోవడంతో వారు వాగ్వాదానికి దిగారు. అయితే కోర్టు ఆదేశాల అనుసారం ఆశ్రమంలోకి భక్తులను అనుమతించేది లేదని పోలీసులు వారికి స్పష్టం చేశారు. అయినా వారు పోలీసుల మాటలు బేఖాతరు చేస్తూ ఆశ్రమంలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా...పోలీసులు అడ్డుకొని బలవంతంగా ఆటోల్లో అక్కడి నుంచి బస్టాండ్ కు పంపించివేశారు.
Recommended Video